Ramayana: మన దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ రామాయణంతో ముడిపడి ఉన్న ప్రదేశాలు కనిపిస్తాయి. సీతాదేవిని రావణుడు ఎత్తుకుపోయిన చోటు పర్ణశాల, తెలంగాణ  రాష్ట్రంలో ఉంది. భార్య, సోదరుడితో అడవికి బయలుదేరిన రాముడు చాలా ప్రాంతాలను, చాలా రాష్ట్రాలను దాటుకుంటూ వెళ్లాడు. అందుకే ప్రతిరాష్ట్రంలోనూ రామాయణంకి సంబంధించిన ఆనవాళ్లుంటాయి. ముఖ్యంగా శ్రీలంకలో చాలా ఉన్నాయి..


సంజీవని పర్వతం ఉండే ప్లేస్


రామరావణ యుద్ధంలో ఇంద్రజిత్తు సంధించిన బాణాలకు లక్ష్మణుడు మూర్ఛబోతాడు. ఆ మూర్ఛ నుంచి మేల్కొల్పేందుకు సంజీవని మూలిక ఉన్న పర్వతాన్ని తీసుకురమ్మని హనుమంతుని కోరతారు. ఆ మూలిక ఏదో తెలియని హనుమంతుడు, హిమాలయాల నుంచి మొత్తం పర్వతాన్నే పెళ్లగించి తీసుకువస్తాడు. ఆది శ్రీలంకలో రుమశ్శల, దోలుకండ, రితిగల, తల్లాడి, కచ్చతీవు అనే అయిదు ప్రాంతాలలో పడిందని చెబుతారు. ఇప్పటికీ అక్కడ ఔషధ గుణాలు ఉన్న మూలికలు దొరుకుతూ ఉంటాయట.


Also Read: ఓ తెల్లవారుజామున జారుతున్న వస్త్రంతో అశోకవనానికి రావణుడు, ఆ సమయంలో లంకాధిపతి - సీత మధ్య డిస్కషన్ ఇదే!


సీతాదేవిని బంధించిన అశోకవనం


రావణాసురుడు సీతమ్మను బంధించింది అశోకవనంలోనే, శ్రీలంకలో ‘నువారా ఏలియా’ అనే పట్నం దగ్గరలో అశోకవనం ఉండేదని చెబుతారు. ఇప్పటికీ అక్కడ దట్టంగా వృక్షాలు కనిపిస్తాయి.  వీటికి దగ్గరలోనే సీతాదేవి ఆలయం కనిపిస్తుంది. హనుమంతుడు, సీతమ్మను ఇక్కడే గుర్తించాడని చెబుతారు. అందుకు సాక్ష్యంగా ఆయన పాదముద్రలు కనిపిస్తాయి. 


సీతమ్మ అగ్నిప్రవేశం


రావణ సంహారం జరిగిన తరువాత సీతమ్మ తన పవిత్రత నిరూపించుకోవాల్సిన సందర్భం వస్తుంది. అప్పుడు సీతాదేవి అగ్నిప్రవేశం చేసి తన మహత్యాన్ని చాటుకుంటుంది. ఈ ఘట్టం ‘నువారా ఏలియా’ పట్నానికి 20 కిలోమీటర్ల దూరంలోని ‘దివురుంపోలా’ అనే ప్రదేశంలో జరిగిందని చెబుతారు. ‘దివురుంపోలా’ అనే శపథం చేసిన చోటు అని అర్థం. ఇప్పటికీ స్థానికుల మధ్య ఏదన్నా తగాదా వచ్చినప్పుడు, ఇక్కడకు వచ్చి తమ మాట నిజమేనని ఒట్టు పెట్టుకుంటారు.


Also Read: రామ రావణ యుద్ధం తర్వాత యుద్ధభూమిలో జరిగిన సంఘటన ఇది


రావాణాసురుని గుహలు


శ్రీలంకలోని ‘కలుతార’ అనే ప్రాంతంలోనే ఒకప్పుడు ఆయన రాజసౌధం ఉండేదని చెబుతారు. అక్కడి నుంచి లంకలో ఎక్కడికైనా చేరుకునేందుకు రకరకాల సొరంగాలు కనిపిస్తాయి. వీటిని దగ్గరగా పరిశీలిస్తే, ఇవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుహలు కావు మానవులే నిర్మించుకున్న సొరంగాలనీ చెబుతారు.


రాముడు ప్రతిష్టించిన శివలింగాలు


రావణ సంహారం తర్వాత తనకు బ్రహ్మహత్యా దోషాన్ని పరిహరించుకునేందుకు లంకలో మూడుచోట్ల శివలింగాలు ప్రతిష్టించాడట శ్రీరాముడు. అవే చిల్లావ్ అనే పట్నంలో ఉన్న ‘మున్నీశ్వరం ఆలయం’, మన్నార్ ద్వీపంలో ఉన్న ‘తిరుకితీశ్వరం ఆలయం’, ట్రింకోమలీ పట్నంలో ఉన్నా ‘కోనేశ్వరం ఆలయం’. ఈ మూడు ఆలయాలను దర్శించుకుంటే పాప పరిహారం జరుగుతుందని విశ్వాసం.


ఇంకా హనుమంతుడు లంకను దహనం చేసిన చోటు, రావణుడు సీతమ్మను లంకలోకి తీసుకువచ్చిన దారి, రాముడు విశ్రమించిన చోటు, రాముడు రావణుని చంపిన ప్రదేశం అంటూ శ్రీలంకలో దాదాపు 50 ప్రదేశాలు కనిపిస్తాయి. ఆ ప్రదేశాల పేర్లు కూడా ఆ ఘట్టాలను గుర్తుచేసేలా ఉంటాయి. 


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.