Radhashtami 2024:  రాధాకృష్ణలో ప్రేమలో ఉండే మహత్తును తెలిపేలా ఉంటుంది వారిద్దరి మధ్యా జరిగిన ఈ సంభాషణ..రాధాష్టమి సందర్భంగా మీకోసం..


గోలోకాన్ని మహారాస మండలి అని పిలుస్తారు.. నిత్య బృందావనం, శ్వేత మండలి అని కూడా అంటారు..అది ఓ మహారసజగత్తు..ఆ జగత్తుకి ప్రభువు గోపాలుడు.  


రాధ జన్మ వృత్తాంతం గురించి భిన్నగాథలు ప్రచారంలో ఉన్నాయి. కేదారుడు అనే రాజుకు యజ్ఞకుండంలోంచి పుట్టిందని చెబుతారు. కృష్ణుడి కోసం తపస్సు ఆచరించి ఆయన్ను చేరుకుందని చెబుతారు.


వృషభానుడు,కళావతి దంపతులకు పుట్టిన కుమార్తెకు గర్గ మహాముని 'రాధ' అని నామకరణం చేశారు. శ్రీకృష్ణుణ్ని రాధాదేవి తన మనసులో లయం చేసుకుని విజయం సాధించిన రోజే భాద్రపద శుద్ధ అష్టమి అని..అందుకే 'రాధాష్టమి' అని పిలుస్తారు.


Also Read: రాధాష్టమి ఎప్పుడొచ్చింది..ఈ రోజు విశిష్టత ఏంటి - పూజావిధానం!


ఈ రోజున ఇద్దరి మధ్యా జరిగిన ఆసక్తికర సంభాషణ గురించి పురాణాల్లో ఇలా ఉంది..
 
కృష్ణుడు- పుట్టిన రోజు సందర్భంగా ఏదైనా కోరుకో
రాధ - మాధవా నువ్వే నా సొంతం అయినప్పుడు.. నా దగ్గర లేనిది, వెలకట్టలేనిది, నీకన్నా విలువైనది నాకు  ఇవ్వగలవా కృష్ణా?
కృష్ణుడు- ఆశ్చర్యంగా చూస్తున్నాడు
రాధ- నెమ్మదిగా కృష్ణుడి దగ్గరకు వచ్చి... పాదాలకు నమస్కరించింది.. కృష్ణుడిని ప్రేమగా హత్తుకుంది.. అప్పుడు కూడా అదే మాట చెప్పింది.. నిన్ను పొందిన తర్వాత నాకిక కావాల్సింది ఏముంది సర్వేశా అని...


మరి నువ్వేం కోరుకుంటావు కృష్ణా అని అడిగింది రాధ..


కృష్ణుడు- ఆశ్చర్యపోయిన కృష్ణుడు..కాసేపు రెప్పవేయకుండా రాధను చూస్తుండిపోయి ఆ తర్వాత తేరుకుని నువ్వే కోరుకో రాధా అంటూనే నాకన్నా విలువైనది కోరుకోవాలి సుమా అని కండిషన్ పెట్టాడు
రాధ - గలగలా నవ్విన రాధ...నీకన్నా విలువైనది నేనే కృష్ణా అని సమాధానం ఇచ్చింది
కృష్ణుడు- హుతాశుడైన కృష్ణుడు..నాకన్నా నువ్వు విలువైనదానివా? ఎలా?
రాధ - నువ్వు ప్రేమకు బానిసవు కదా కృష్ణా..అప్పుడు నేను నీ ప్రేమకు యజమానురాలిని
కృష్ణుడు- ఒప్పుకున్నాను రాణీ మరి నిన్ను నువ్వే ఎలా కోరుకుంటావు
రాధ- ఎప్పటికీ నువ్వు బానిసగానే ఉండాలి, నేను యజమానురాలుగానే ఉండిపోవాలి..ఇదే నా కోరిక కృష్ణా అంది
 
ఆ మాటలకు కృష్ణుడి హృదయం ద్రవించింది.. ఒకరిని ప్రేమగా ప్రేమకు బానిస చేయగల మహత్తు ప్రేమకు మాత్రమే ఉంది..అంత మంచి ప్రేమ దొరకడం కన్నా విలువైనది ఏముంది...అలాంటి ప్రేమ కృష్ణుడికి అందిస్తోంది రాధ.. 


ఆ క్షణమే రాధ పాదాలు తాకాడు కృష్ణుడు...


అదేంటి కృష్ణా నువ్వు నా పాదాలు ముట్టుకోవడం ఏంటన్న ప్రశ్నకు ... బానిస యజమానికి నమస్కరించాలి కదా అని బదులిచ్చాడు గోపాలుడు..
 
ఆ మాటలకు బృందావనం మొత్తం ప్రణమిల్లింది.. రాధ కళ్లలోంచి వచ్చిన నీటి ధార ఆ ప్రేమికులను అభిషేకించాయి..


Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, దసరా నవరాత్రులు సందర్భంగా ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే!
 
రాధాకృష్ణులు ఏక రూపులు... రాధ పేరులో ఉండే 'ర'కార ఉచ్ఛారమ వల్ల శ్రీ కృష్ణుడిపై నిశ్చల భక్తి ఏర్పడుతుంది. ధ నామస్మరణ వల్ల విష్ణు సాయిజ్యం లభిస్తుందని చెబుతారు. రాధ నామస్మరణతోనే అనారోగ్యం, మృత్యు భయం తొలగిపోతుందని.. జాతకంలో నివృతి లేని దోషాలు కూడా తొలగిపోయి వ్యక్తిగత జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుందని భక్తుల విశ్వాసం..


రాధారమణ మంత్రం


ఓం ఐం హ్రీం శ్రీం నమో భగవతే 
రాధాప్రియాయ రాధారమణాయ
గోపీజనవల్లభాయ మయాభీష్టం
పూరయ పూరయ హుం ఫట్ స్వాహ


రాధా గాయత్రి మంత్రం


ఓ వృషభానుజాయై విద్మహే కృష్ణ ప్రియాయ ధీమహి తన్నో రాధికా ప్రచోదయాత్..


Also Read: దసరా నవరాత్రుల్లో పూజించాల్సిన నవ దుర్గలు - దేవీ కవచంలో ఉన్న అలంకారాలివి!