Stories Behind Makar Sankranti In Telugu: సంక్రాంతి పండగ వెనుక ఎన్నో కథలున్నాయి..సూర్యుడు రాశిమారడంతో పాటూ మరో 5 కథలను ప్రత్యేకంగా చెబుతారు..ఆ కథలేంటంటే...


1. గంగమ్మ అవతరించిన రోజు
పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ వారి ఆత్మశాంతించదని తెలుస్తుంది. ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరధుడు ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీదకు వచ్చిందని చెబుతారు.


Also Read:  సంక్రాంతికి బొమ్మల కొలువు ఎందుకు పెడతారు, బొమ్మలను ఎలా పేర్చాలో తెలుసా!


2. గంగిరెద్దుల వెనుక కథ 
సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు.శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాయిద్యాన్నీ పట్టుకుని, నందికితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకోమని అడిగాడు. తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగాడు శ్రీ మహావిష్ణువు. అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావుడే, ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు. ఈ కథను వినాయకచవితి సందర్భంగా కూడా చెప్పుకుంటాం


3. పశువుల పూజ ఎందుకు
కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి ‘భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి తలకు స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి’ అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో ‘రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని చెప్పాడు. కోపం వచ్చిన శివుడు. ‘ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి’ అన్నాడు. అప్పటి నుంచి ఎద్దులు, వ్వవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు. 


Also Read: భోగి, సంక్రాంతికి ఇంటి ముందు గొబ్బిళ్లు ఎందుకు పెడతారు, ఆ పాటల వెనుకున్న ఆంతర్యం ఏంటి!


4. గాలిపటాల వెనుకున్న కథ
తెలంగాణలో సంక్రాంతి అంటే పతంగుల పండుగ అంటారు. దీనివెనుకున్న కథ ఏంటంటే..సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని చెబుతారు. ఈ సమయంలో దేవతలంతా ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు.


5.హరిదాసు అంటే శ్రీ మహావిష్ణువే
సంక్రాంతి సందర్భంగా ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే, హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర, ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తై ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు. 


ఇంకా చెప్పుకుంటూ పోతే గొబ్బెమ్మల నుంచి భోగిపళ్లు, బొమ్మల కొలువు వరకూ సంక్రాంతి సందర్భంగా పాటించే ప్రతి ఆచారానికి, సంప్రదాయానికి ఓ కథ ఉంది.