Mahabharat story: ఈ చ‌రాచ‌ర సృష్టిని భగవంతుడు సృష్టించాడు. ఆయ‌నే సృష్టి, స్థితి, ల‌య కార‌కుడు. భగవంతుడు విశ్వం మొత్తాన్ని ధ్యాన రూపంలో చూసే శక్తి కలిగి ఉన్నాడు. ఆయ‌న‌ను గుర్తించ‌డం అంత సులభం కాదు. అందరూ భగవంతుడిని చూడలేరు. మన కళ్లకు కనిపించనంత మాత్రాన దేవుడు లేడని కాదు. భ‌గ‌వంతుడు ప్రతిచోటా ఉన్నా మన కళ్లకు కనిపించడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడే దీనికి సమాధానం చెప్పాడు. యోగమాయతో నన్ను నేను కప్పుకోవడం వల్ల, నేను అందరికీ కనిపించన‌ని, ప్రజలు నన్ను భగవంతునిగా గుర్తించలేర‌ని శ్రీకృష్ణుడు తెలిపాడు.


1. భ‌గ‌వంతుడిని చూడ‌లేద‌న్న ధ‌ర్మ‌రాజు
ఒకసారి పాండవులు రాజసూయ యాగం చేస్తున్నారు. ఆ యాగంలో పాల్గొనేందుకు రాజులు, చక్రవర్తులు, ఎంద‌రో మ‌హ‌ర్షులు దూరప్రాంతాల నుంచి వచ్చారు. వారంద‌రితో మాట్లాడుతూ ధర్మరాజు తాను ఇప్పటి వరకు భగవంతుడిని చూడలేదు అని అంటాడు. ఇది విన్న నారద మహర్షి ఈ సమావేశంలో ప్రపంచాన్ని సృష్టించిన భ‌గ‌వానుడు ఉన్నాడ‌ని చెప్పాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ఎక్కడ ఉన్నాడు.. నేను చూడలేదే అని నారదునితో హేళనగా మాట్లాడ‌తాడు.


Also read: గంగమ్మ జాతరలో స్త్రీల రూపంలో పురుషులు, ఈ వేషధారణ వెనుక కారణం తెలిస్తే పూనకాలు లోడింగ్!


2. పాండవులు భగవంతుడితో ఉన్నా ఎందుకు గుర్తించలేకపోయారు?
శ్రీకృష్ణుడు పాండవులతో క‌లిసి చాలా రోజులు జీవించాడు. అయినప్పటికీ, ఆయ‌న‌ను ఎవరూ ప‌ర‌మాత్మ స్వ‌రూపంగా గుర్తించలేకపోయారు. శ్రీకృష్ణుడు భ‌గ‌వ‌త్ స్వ‌రూప‌మ‌ని వారెవరికీ తెలియదు. పాండవులు కృష్ణుడిని కేవ‌లం తమ మామగారి కొడుకుగా మాత్రమే భావించేవారు. త‌న గురించి వివ‌రించ‌బోయిన నార‌ద మ‌హ‌ర్షిని మౌనంగా ఉండ‌మ‌ని శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించాడు. అయితే, నారదుడు మాత్రం పాండవులకు శ్రీకృష్ణుడి లీలా వైభ‌వం గురించి చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.


3. యుధిష్ఠిరుడికి నార‌దుడి జ్ఞాన‌బోధ‌
రాజా..! దుర్వాసుడు, జమదగ్ని త‌దిత‌ర‌ మహామునులు ఈ రాజ‌సూయ యాగ‌ ఫలం పొందాలనే దురాశతో ఇక్కడికి రాలేదు. వీరంతా పరమేశ్వరుని దర్శనం కోసం ఇక్కడికి వచ్చారు. ఈ యాగంలో భగవంతుడు మీకు తోడుగా ఉన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు అని చెబుతూ నారదుడు శ్రీకృష్ణుని వైపు వేలు చూపించాడు. "అయం బ్రహ్మ" అంటే.. అతడిని బ్రహ్మ అంటారు అని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వి 'నేను బ్రాహ్మణుడిని కాదు, నారదుడికి అబద్ధాలు చెప్పే అలవాటు ఉంది' అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు కృష్ణుడిని ఆత్మ గురించి చెప్పమని అడుగుతాడు.


Also Read: మహాభారతానికి సంబంధించిన ఈ 10 ప్రదేశాలు ఇప్పుడెలా ఉన్నాయంటే!


4. శ్రీకృష్ణుడు బోధించిన ఆత్మ‌జ్ఞానం
యుధిష్ఠిరుడు ఆత్మ జ్ఞానం వివ‌రించ‌మ‌ని అడిగినప్పుడు, శ్రీకృష్ణుడు.. నా శక్తితో నేను మానవ శరీరంలో అవతరించాను అని సమాధానమిచ్చాడు. నన్ను కేవలం మనిషిగా భావిస్తూ, విస్మరించే వారు మూర్ఖులు అని తెలిపాడు. దేవతలకు మూలం నేనే అనే సత్యాన్ని వివరిస్తాడు. "స్వర్గం నా తల, సూర్యచంద్రులు నా కళ్లు, బ్రహ్మం నా నోరు, గాలి నా శ్వాస, 8 దిక్కులు నా బాహువులు, నక్షత్రాలు నా ఆభరణాలు, ఆకాశం నా హృదయం. నాకు ఒకటి కాదు వేల తలలు, వేల ముఖాలు, వేల కళ్లు, వేల చేతులు, వేల కాళ్లు ఉన్నాయి. నేను విశ్వాన్ని నిర్వహిస్తాను" అని కృష్ణుడు చెప్పాడు. శ్రీకృష్ణుని మాటలు విన్న యుధిష్ఠిరుడు తాను ఇంతకాలం భగవంతునితో ఉన్నానని గ్రహించాడు. యాగ సంద‌ర్భంగా అజ్ఞానంతో తాను మాట్లాడిన‌ మాటలకు క్షమాపణలు కోరతాడు.