Maha Shivratri 2023:

  కైలాస పర్వతంపై భర్తతో పాటూ కూర్చున్న పార్వతీ దేవి..అన్ని వ్రతాలకన్నా ఉత్తమమైన వ్రతమేదని అడిగింది. శివరాత్రి వ్రతం అని సమాధానం చెప్పిన శివుడు ఆ వ్రతం విశేషాలు తెలియజేశాడు. ఈ వ్రతాన్నిమాఘ బహుళ చతుర్దశి రోజు మాత్రమే ఆచరించాలని, తెలిసి చేసినా తెలియక చేసినా యమదండన నుంచి తప్పించుకోవచ్చని వివరిస్తూ ఈ కథ చెప్పాడు.


ఒకప్పుడు పర్వత ప్రాంతంలో వ్యాధుడు అనే వేటగాడు ఉండేవాడు. నిత్యం అడవికి వేటకు వెళ్లి వేటాడి సాయంత్రం లోపు కచ్చితంగా ఏదో ఒక జంతువును చంపి ఇంటికి తీసుకొచ్చేవాడు. ఒక రోజు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎంత వెతికినా ఏ జంతువు దొరకలేదు. బయలుదేరిన సమయం బాలేదని భావించి ఖాళీచేతులతో ఇంటికి బయలుదేరాడు. దారిలో ఓ వాగు కనిపించగానే..వేటగాడికి ఓ ఆలోచన వచ్చింది. అక్కడికి నీరు తాగేందుకు జంతువులు కచ్చితంగా వస్తాయని భావించి పక్కనే ఉన్న ఓ చెట్టెక్కి కూర్చున్నాడు. తన చూపులకు అడ్డంగా వచ్చిన ఆకులను, కాయలను విరిచి కింద పడేశాడు. అప్పుడు చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ఆ సమయంలో ‘శివ శివ' అంటూ గజ గజ వణుకుతూ విల్లు ఎక్కి పెట్టి జంతువుల కోసం ఎదురుచూశాడు. 


Also Read: తత్పురుషం,అఘోరం, సభ్యోగాతం, వామదేవం మీరు పూజించే రూపం ఏది - శివతత్వం ఏం చెబుతోంది!


ఎట్టకేలకు తెల్లారేసరికి ఓ జింక కనిపించింది. వెంటనే బాణాన్ని ఎక్కు పెట్టాడు. అది చూసిన జింక ‘వ్యాధుడా నన్ను చంపకు' అని మనిషిలా మాట్లాడింది. వ్యాధుడు ఆశ్చర్యపోయి మనిషిలాగా మాట్లాడుతున్నావే.. ఎవరు నువ్వు అని అడిగాడు. దీనికి ఆ లేడీ సమాధానమిస్తూ ‘నేను పూర్వ జన్మలో రంభను' అని సమాధానమిచ్చింది. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని ప్రేమించి శివుడి పూజను పక్కనపెట్టేశాను. ఆ సమయంలో శాపంనుంచి ఇప్పుడు విముక్తి లభించిందని చెబుతుంది.


కొద్దిసేపటి తర్వాత మరో జింక వచ్చింది. దానిపైనా బాణం వేసేలోగా అదికూడా మనిషిలా మాట్లాడింది. ‘ఓ వ్యాధుడా నేను చనిపోయినా కూడా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి మరో మగ జింక కొద్దిసేపట్లో వస్తుంది. దానిని చంపుకో.. లేదంటే నేను తిరిగి వస్తాను' అని వ్యాధుడికి చెప్పడంతో దాన్ని కూడా వదిలేస్తాడు. అలా నాలుగు జింకలు వేడుకుని వెళ్లిపోతాయి. మరో జింక కోసం  ఆశగా ఎదురుచూస్తుంటాడు వ్యాధుడు.


Also Read:  శివుడు-పార్వతి ఇద్దరిలో తమ ప్రేమను ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు


మర్నాడు నాలుగు జింకలు వచ్చి నన్ను మొదట చంపు అంటే నన్ను చంపు అంటూ వేటగాడి ముందు మోకరిల్లాయి. ఆ జింకల నిజాయితీకి వ్యాధుడు ఆశ్చర్యపోయి ఇకపై హింస చేయనని విల్లు వదిలేసి వెళ్లిపోతాడు. అంతలో ఆకాశం నుంచి పూల వర్షం కురుస్తుంది. శివరాత్రి సందర్భంగా ఉపవాసం, జాగరణం చేయడం, పైగా రాత్రంతా వేటగాడు ఎక్కిన చెట్టు బిల్వవృక్షం కావడం, దానిపై నుంచి ఆకులు కొమ్మలు కింద పడేశాడు కదా..అక్కడ శివలింగం ఉండడం..ఇలా అన్నీ కలిసొచ్చాయి. అంటే తెలియకుండా శివలింగాన్ని పూజించినా పాపం పోయిందని చెబుతారు దేవదూతలు. అందుకే శివరాత్రి రోజు జాగరణ, ఉపవాసం, బిళ్వపత్రాలతో పూజ అత్యంత విశిష్టమైనవి అని వివరిస్తాడు శివుడు.