Maha Shivaratri 2025: శివుడు లయకారకుడు కాబట్టి శ్మసానంలో ఉంటాడు...అందులో విశేషం ఏముంది అనుకోవచ్చు.
పాలకడలిపై పవళించిన శ్రీ మహావిష్ణువుకి ఆయన నాభిలోంచి విరిసిన బ్రహ్మదేవుడికి ఉన్న సౌఖ్యం శివుడు ఆశించలేదు.
భక్తుల కోసం పరితపించే ఆ స్వామి పరమసత్యాన్ని తెలియజేసేందుకు భూతనాథుడిగామారి శ్మసానవాసం ఎంచుకున్నాడనే సందేహం చాలామందికి ఉంది.
జన్మించిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు... మరణించిన తర్వాత తిరిగి జన్మించకా తప్పదు. ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మానికి ప్రధాన రక్షకులు ముగ్గురు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు.
బ్రహ్మ దేవుడు సృష్టి ధర్మానికి రక్షకుడు - ప్రాణికోటిని సృష్టించడమే ఈయన ధర్మం
శ్రీ మహా విష్ణువు సృష్టిని పోషించి, రక్షిస్తాడు. అందుకోసమే అవతారాలు..
శివుడు లయకారకుడు. ‘లయం’ అంటే ‘ నాశనం’ అని ఓ తప్పుడు అర్ధాన్ని చెబుతారు కానీ లయం అంటే లీనం చేసుకోవడం తనలో కలిపేసుకోవడం అని అర్థం..
Also Read: శివ మంత్రమే ఎందుకు 'మృత్యుంజయ' స్త్రోత్రం అయింది
మొత్తం ఈ సృష్టిచైతన్యాన్ని లయం చేసుకోవడం అంటే అంత సులభమా...అందుకు ఎంతో తపశ్శక్తి కావాలి. అందుకే శివుడు ఎప్పుడూ తపస్సమాధి స్థితిలో ఉన్నట్టే కనిపిస్తాడు. సృష్టికి, రక్షణకు నాశనం ఉంది కానీ లయానికి నాశనం లేదు. అది శాశ్వతం.
భౌతికంగా కనిపించే ప్రతీదీ నాశనం అయ్యేవే.. అభౌతికమైనవి మాత్రమే శాశ్వతంగా ఉంటాయి.
అభౌతికమైనది అంటే..‘ఆత్మ’.. దీనికి చావు పుట్టుకలు ఉండవు. ఈ ఆత్మ దేహన్ని ధరిస్తే ‘జీవాత్మ’ , ‘జీవాత్మ’ దేహత్యాగం చేస్తే ‘ఆత్మ’గా మిగిలిపోతుంది. పాంచభౌతికమైన శరీరం పంచభూతాల్లో కలసిపోతుంది. మిగిలిన ఆత్మను శివుడు లయం చేసుకుంటాడు. అందుకే ఆయన్ను లయకారకుడు అంటారు.
ఎలాంటి వ్యామోహం లేనివాడే విరాగి. విరాగి మాత్రమే సర్వాన్ని సమానంగా స్వీకరించగలడు. శివుడికి దేహంపై మమకారం లేదు. ఒళ్లంతా బూడిద పూసుకుంటాడు. దిగంబరంగా తిరుగుతాడు. భిక్షాటన చేస్తాడు. పుర్రెలో తింటాడు, రుద్రాక్షలు, పాములు వేసుకుంటాడు. శ్మశానంలో ఉంటాడు కనుకే విరాగి ...లయకారుడు అయ్యాడు.
@ శివుడి చేతిలో ఉండే త్రిశూలం సత్వరజస్తమో గుణాలను సూచిస్తుంది. ఈ 3 గుణాలతోనే సృష్టి నడుస్తుంది
@ సకల భాషలకు ఆధారభూతమైనది ఓంకారం.. సంస్కృతం ఢమరుకం నుంచి ఉద్భవించినవే
@ మనసుని నియంత్రించే శక్తికి నిదర్శనం నెలవంక
@ శివుడి జటాజూటంలోని ఉండే గంగమ్మ అమరత్వానికి నిదర్శనం
@ ఏనుగు అభిమానానికి ప్రతీక..ఆ చర్మం ధరించిన శివుడు స్వాభిమానానికి నిలువుటద్దం
@ పులి విషవాంఛలకు ప్రతీక..విషపూరితమైన కోరికలు జయించాడనడానికి సూచికగా పులి చర్మం మీద ఆశీనుడై ఉంటాడు శివుడు.
@ శివుడి మెడలో ఉండే పాము జీవాత్మకి ప్రతీక
@ పరమేశ్వరుడి నుదుటిపై ఉండే భస్మరేఖలు మనిషిలో త్రిదోషాలు విడిచిపెట్టాలని సూచిస్తాయ్
@ వృషభవాహనం ధర్మదేవతకు ప్రతీక
మనిషి ఎంత సంపాదించినా..ఎంత మంచి పేరు తెచ్చుకున్నా చివరకు చేరేది ఆరడుగుల భూమిలోనే. ఎవరైనా కాలిన తర్వాత మిగిలేది బూడిదే. అందుకే సర్వం తనలో లీనం చేసుకునే శివుడి నివాసం శ్మసానం అయింది. ఆయన ఆభరణం భస్మం అయింది. ఆయన లయకారుడు అయ్యాడు. అందుకే శివయ్యను దర్శించుకోవడం అంటే మోక్షానికి చేరువకావడమే కానీ.. శ్మసానంలో సమానం అనే మూర్ఖపు ఆలోచన వద్దంటారు పండితులు.
Also Read: అయ్యవారిపై అమ్మవారికి ఎన్ని సందేహాలో, భోళా శంకరుడిని పార్వతి అడిగిన ప్రశ్నలివే