TGPSC Group1 Mains Results: తెలంగాణలో 'గ్రూప్‌-1' మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇప్పటికే గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ముగియగా.. రెండు వారాల్లో  వెల్లడించేందుకు తెలంగాణ పబ్లిక్‌ కమీషన్‌ (టీజీపీఎస్సీ) కసరత్తు చేస్తోంది. మెయిన్స్ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా వెల్లడించనుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన తుది పరిశీలన కొనసాగుతోంది. మరో రెండు వారాల్లో తుది ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించనుంది.


రాష్ట్రంలో మొత్తం 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన మెయిన్ పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. దీని ప్రకారం.. ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీపడుతున్నారు. మార్చి మొదటి వారంలో జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను ప్రకటించి ఆ తరువాత గ్రూప్‌-2, 3, ఫలితాలను వెల్లడించాలని కమిషన్‌ భావిస్తోంది. తద్వారా ఆయా పోస్టుల్లో బ్యాక్‌లాగ్‌లు లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటోంది. 


యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడిన ఏడాదిలోగా నియామక ప్రక్రియ పూర్తిచేసే విధానాన్ని గ్రూప్‌-1లో అమలు చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తోంది. ఇందులో భాగంగా .. ఇప్పటికే గ్రూప్‌-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కమిషన్ ప్రారంభించి, వేగంగా ముగించింది. 


రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేయగా.. మొత్తం 4,03,645 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ప్రిలిమ్స్ పరీక్ష నుంచి మెయిన్స్ పరీక్షలకు 1:50 నిష్పత్తిలో మొత్తం 31,382 మంది అభ్యర్థులను టీజీపీఎస్సీ ఎంపిక చేసింది. అయితే వీరితోపాటు హైకోర్టు అనుమతి పొందిన వారితో కలిపి మొత్తం 31,403 మంది మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారు. ఇక మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మొత్తం 7 పేపర్లు రాసిన అభ్యర్థులు 21,093 మంది ఉన్నారు. వీరి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఒక్కో పేపరును రెండుసార్లు మూల్యాంకనం చేశారు. ఒక అభ్యర్థి జవాబుపత్రం తొలిదశ మూల్యాంకనం తర్వాత వచ్చిన మార్కులకు.. రెండోదశ మూల్యాంకనంలో వచ్చిన మార్కులకు పెద్దగా వ్యత్యాసం లేకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాను రూపొందించనున్నారు. 


తెలంగాణలో ఇతర ఉద్యోగాలకంటే కూడా 'గ్రూప్స్' పోస్టులకు ఎక్కువగా పోటీ పడుతుంటారు. అయితే ఇటీవల నియామకాల్లో తుదిఫలితాల వెల్లడిలో అవరోహణ క్రమం పాటించకపోవడంతో, ఒకే అభ్యర్థి రెండు, మూడు పోస్టులకు ఎంపికయ్యారు. వీరిలో చాలా మంది ఉన్నత స్థాయిలోని పోస్టులను ఎంచుకోవడంతో కిందిస్థాయి పోస్టులు బ్యాక్‌లాగ్‌గా మిగిలిపోయాయి. ఇలా గురుకులాల్లోనే దాదాపు 2 వేల పోస్టులు బ్యాక్‌లాగ్‌ కిందకు వచ్చాయి. భవిష్యత్తులో బ్యాక్‌లాగ్‌ కాకుండా ఉండేందుకు రీలింక్విష్‌మెంట్‌ విధానంపై అధ్యయనం చేయాలని ఇటీవల మంత్రిమండలి నియామక సంస్థలకు సూచించింది. ఈ నేపథ్యంలో గ్రూప్స్‌ పోస్టుల్లో అవరోహణ విధానం అమలుపై కమిషన్‌ సమాలోచనలు చేస్తోంది. ఇప్పటికే గ్రూప్‌-3 రాతపరీక్షలు పూర్తయ్యాయి. వచ్చేనెలలో గ్రూప్‌-2 రాతపరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఫిబ్రవరిలో గ్రూప్‌-1 ఫలితాలు వెలువడిన తర్వాతనే.. గ్రూప్‌-2, 3 ఫలితాలిస్తే.. బ్యాక్‌లాగ్‌ రాకుండా అందరికీ న్యాయం జరుగుతుందని టీజీపీఎస్సీ భావిస్తోంది.  


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...