Maha Shivaratri 2024


పార్వతీ దేవి పరమేశ్వరుడిని ప్రశ్నించడం ఏంటి?
పోనీ ఎవ్వరూ లేని సమయం చూసి ఏకాంతంగా మాట్లాడిందా అంటే అదీ కాదు..నిండు కొలువులో అందరి మధ్యా వరుస ప్రశ్నలు సంధించింది
భోళాశంకరుడు కూడా పార్వతి ప్రశ్నలకు  ఏమాత్రం కోపగించుకోకుండా చిరునవ్వుతో సందేహాలన్నీ తీర్చాడు
ఇంతకీ ఏ సందర్భంలో పార్వతీ దేవి పరమేశ్వరుడిని ప్రశ్నించింది.. ఆ సందేహాలకు శివుడు ఇచ్చిన సమాధానం ఏంటి?


కైలాశంలో దేవతలు, సిద్ధులు, మునులు,భూతగణాలతో నిండి ఉంది. ఆ కొలువులో ఉన్నాడు శంకరుడు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన పార్వతీదేవి సరదాగా భర్త కళ్లు మూసింది. సృష్టి స్థితి, లయలను చూసే పరమేశ్వరుడి కళ్లు మూస్తే ఇంకేముంది...లోకాలన్నీ చీకటిమయం అయిపోయాయి. అర క్షణంలో జీవులు అల్లాడిపోవడం చూసి శంకరుడు చేసేది లేక మూడో కన్ను తెరిచాడు. దాంతో హిమనగరం మండిపోవడం మొదలైంది. అదిచూసిన పార్వతీదేవి 'స్వామీ మూడోకన్ను తెరిచారేంటి'  నా తండ్రి హిమవంతుడికి బాధ కలిగిందని వేడుకుంది. నీకు చెప్పకూడని రహస్యాలు నా దగ్గర లేవు, సర్వలోకాలు నాపై ఆధారపడి  ఉంటాయి, నువ్వు నా రెండు కళ్లూ మూసేస్తే లోకం చీకటిమయం అయింది. అందుకు మూడోకన్ను తెరవాల్సి వచ్చిందన్నాడు. అలాంటి సందర్భంలోనూ ప్రశాంతంగా స్పందించిన భర్తను చూసి..తన సందేహాలు తీర్చుకునేందుకు ఇదే మంచి సమయం అని భావించింది పార్వతీదేవి. ఆలస్యం ఎందుకని ప్రశ్నలు సంధించింది..


Also Read: శివభక్తులకు వరాలు ఈ క్షేత్రాలు - అన్నీ ఏపీలోనే ఉన్నాయ్!


పార్వతి: స్వామీ మీ కంఠంపై నల్లటి మచ్చ ఎందుకుంది?
శివుడు: దేవతలు, దానవులు కలిసి పాలసముద్రం మధించినపుడు వచ్చిన హలాహలాన్ని మింగి అక్కడ ఉంచాను. అందుకు అక్కడ మచ్చ ఉంది...


పార్వతి: పినాకమనే విల్లునే ఎందుకు ధరిస్తారు? 
శివుడు: కణ్వుడనే మహాముని ఆదియుగంలో తపస్సు చేశాడు. ఆయనపై పుట్టలు మొలిచాయి. ఆ పుట్టమీద ఒక వెదురుపొద మొలిచింది. అద్భుతంగా పెరిగిన ఆ వెదురు నుంచి బ్రహ్మ మూడు విల్లులు తయారు చేశాడు. అందులో ఒకటి పినాకము( నా దగ్గర ఉంది), రెండోది శారంగం( విష్ణువు దగ్గరుంది), మూడోది బ్రహ్మదగ్గరుంది. అందుకే నన్ను పినాకపాణి అని పిలుస్తారు
 
పార్వతి: మరే వాహనం లేనట్టు ఎద్దును వాహనంగా చేసుకున్నారెందుకు స్వామి?
శివుడు: ఓసారి తపస్సు చేసుకుంటున్నప్పుడు చుట్టూ చేరిన గోవులు కారణంగా నా తపస్సుకి భంగం కలిగింది. కోపంగా చూడడంతో అవి పడిన బాధను చూసిన శ్రీ మహావిష్ణువు..శాంతింపచేసి ఓ ఎద్దుని కానుకగా ఇచ్చాడు. అప్పటి నుంచి ఎద్దు వాహనమైనంది. 


Also Read:  'ఏకబిల్వం శివార్పణం' - మారేడు దళాలు శివ పూజకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!


పార్వతి: కైలాశంలో ఉండకుండా శ్మశానంలో ఉంటారేంటి స్వామి?
శివుడు: భయంకరమైన భూతాలు ప్రజలను చంపుతూ బాధలు పెట్టేవి. అప్పుడు బ్రహ్మ నా దగ్గరకొచ్చి ’శివా! జీవులను కాపాడే మార్గం చూడవయ్యా’ అని అడిగితే భూతాల నివాసమైన శ్మశానంలో నివాసం ఏర్పాటు చేసుకున్నా, అవి నా కనుసన్నలలో ఉన్నంతవరకూ లోకాలు సురక్షితంగా ఉంటాయి. మోక్షపరులు ఇది శుచిస్థానం, జనం తిరగని స్థలం, అందుకే ఇక్కడ నుంచి లోకాలను రక్షించాలనుకున్నా.


పార్వతి: భస్మ  లేపనం, పాములు ధరించడం, శూలం, ఈ భీకరమైన రూపం ఎందుకు స్వామి?
శివుడు: లోక స్వరూపం రెండు రకాలు. ఒకటి శీతం (చలి), రెండవది ఉష్ణం (వేడి). సౌమ్యం విష్ణువు, అగ్ని నేను అందుకే భస్మం సహా ఈ భీకర రూపం.


Also Read: శివనిందను భరించలేక సతీదేవి ప్రాణత్యాగం, అమ్మవారి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలు ఇవే!


పార్వతి: తలపై నెలవంక ఎందుకు?
శివుడు: దక్షయజ్ఞ సమయంలో నేను దేవతలని బాధించాను, ఆ సమయంలో చంద్రుడిని కాలితో తొక్కగా..శరణు వేడాడు. పొరపాటు చేశానని అర్థమై చంద్రుడిని తలపై పెట్టుకున్నాను.


ఇంకా పార్వతీ దేవి అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానమిచ్చాడు పరమేశ్వరుడు. ఈ ప్రశ్నలకు సమాధానం అమ్మవారికి తెలియదు అని కాదు.. సకల జీవులకు తన భర్త గొప్పతనం తెలియజేయాలన్నదే పార్వతి ప్రశ్నల వెనుకున్న ఆంతర్యం..


ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం 
బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా  శివోమే అస్తు సదా శివోం


Also Read: మీ బంధుమిత్రులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో చెప్పేయండి!