పతి పరమేశ్వరుడి రాక గురించి తెలిసి నలుగుపిండి నలుచుకున్న పార్వతీదేవి ఆ పిండితో బాలుడిని తయారు చేసి ప్రాణం పోస్తుంది. తాను స్నానం చేసి వచ్చేవరకూ ఇంటిబయట కాపలా ఉండమని చెబుతుంది. ఆ సమయంలో వచ్చిన శివుడిని వినాయకుడు అడ్డుకోవడంతో ఆగ్రహంతో తల ఖండిస్తాడు శివుడు. ఆ తర్వాత ఏనుగు తలపెట్టడం, విఘ్నాధిపత్యాన్ని ఇస్తారు...ఇవన్నీ ప్రతి వినాయకచవితికి కథలా చెప్పుకుంటారు.ఏనుగు తల తగిలించడం వరకూ సరేకానీ... ఇంతకీ శివుడు ఖండించిన తల ఏమైందన్నది తెలుసా. 


Also Read: ఆంజనేయుడిని పూజిస్తే శనిప్రభావం ఎందుకు తగ్గుతుంది 


వినాయకుడు తల ఉన్న ప్రదేశం
ఉత్త‌రాఖండ్‌ లో పితోరాగ‌డ్ప్రాంతం గంగోలిహ‌ట్ నుంచి సుమారు 14 కిలోమీట‌ర్ల దూరంలో #భువ‌నేశ్వ‌ర్ అనే గ్రామం ఉంటుంది. అక్కడ ఉంది  పాతాళభువనేశ్వ‌రస్వామి ఆల‌యం. ఇందులో వినాయకుడి తల, దానికి కాపలా ఉన్న శివుడిని దర్శించుకోవచ్చు.ఈ ఆలయంలోకి వెళ్లాలంటే సుమారు 100అడుగల లోతు, 160 కిలోమీటర్ల పొడవు ఉన్న గుహలోపలకు వెళ్లాలి. చాలామంది భక్తులు గుహలోకి వెళ్లేందుకు భయపడి సగం దారి వరకూ వెళ్లి తిరిగి వచ్చేస్తుంటారు..కానీ...లోపలి వరకూ వెళ్లి స్వామి దర్శనం చేసుకుంటే అద్భుతమే అని చెప్పాలి. 


విగ్రహ రూపంలో వినాయకుడి తల
తెగిపడిన వినాయకుడి తల ఇక్కడ విగ్రహరూపంలో కనిపిస్తుంది. ఈ గుహకు సాక్షాత్తూ పరమశివుడే కాపలా ఉంటాడు. తన కుమారుడు అని తెలియక శివుడు శిరస్సు ఖండించడంతో పార్వతి శోకసంద్రంలో మునిగిపోతుంది. అప్పుడు ఏనుగు తల అతికించిన పరమశివుడు... లోకానికి గజముఖుడిగా కనిపించినా నీ కుమారుడు నీకు మాత్రం పూర్వరూపంలోనే కనిపిస్తాడని విరమిస్తాడు. ఆ తర్వాత ఖండించిన తలపడిన ప్రదేశం అయిన ఈ గహకు వచ్చిన శివుడు పుత్రవాత్సల్యంతో కాపలా ఉండిపోయాడని చెబుతారు. అప్ప‌టి నుంచి శాలివాహక శకం 1191వ సంవ‌త్స‌రంలో ఆదిశంక‌రాచార్యుడి కాలం వ‌ర‌కు ఈ గుహ‌ను చూసిన వారు లేర‌ని చ‌రిత్ర చెబుతుంది.


Also Read: శనివారం సాయంత్రం ఈ చెట్టుకింద దీపం వెలిగిస్తే జాతకంలో దోషాలు తొలగిపోతాయి


ఇక ఈ ఆల‌యం ఉన్న గుహ కేవ‌లం ఒక్క గుహలా కాకుండా.. చాలా గుహలు కలిపే సమాహారంగా ఉంటుంది. ఈ ఆలయం దాటి వెళితే మరికొన్ని గుహలు ఉంటాయని..వాటిని దాటుకుంటూ వెళితే కైలాశాన్ని చేరుకోవచ్చంటారు. శివుడు ఆ గుహల గుండానే కైలాసానికి వెళ్లాడని చెబుతారు. ప్రస్తుతం ఆ గుహల్లోకి వెళ్లడంపై నిషేధం విధించారు. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ ఉండదట. పాండవులు స్వర్గారోహణ పర్వంలో భాగంగా బయలుదేరేముందు ఈ గుహకు వచ్చి వినాయకుడిని దర్శించుకుని నేరుగా కైలాశానికి వెళ్లారని చెబుతారు.