Jr Ntr and Rishab Shetty Visited Sri keshavanatheshvara Temple:  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలసి కర్ణాటకలో ఉన్న ప్రముఖ దేవాలయాలు దర్శించుకున్నాడు. తారక్ ఫ్యామిలీతో పాటూ కాంతారా హీరో రిషబ్ శెట్టి ఫ్యామిలీ, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ కూడా ఉన్నారు. ఈ టూర్ లో భాగంగా ఉడిపి శ్రీ కృష్ణుడిని దర్శించుకున్న తారక్ ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. లేటెస్ట్ గా మరో విశిష్టమైన ఆలయాన్ని దర్శించుకున్నాడు యంగ్ టైగర్. మూడగల్లులో ఓ గుహలో కొలువైన శ్రీ కేశవనాథేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తారక్, రిషబ్, ప్రశాంత్ నీల్ ముగ్గురూ తమ కుటుంబ సభ్యులతో కలసి ఈ ఆలయానికి వెళ్లిరావడం .. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. అక్కడ లొకేషన్స్ నెటిజన్లను కట్టిపడేస్తున్నాయ్. ఈ ఆలయం ఎక్కడుంది? దాని విశిష్టత ఏంటనే చర్చ జరుగుతోంది...


Also Read: పరిపూర్ణమైన జగత్తుకి సంకేతంగా చెప్పే వినాయకుడి రూపం వెనుకున్న పరమార్థం ఇదే!




మోకాళ్ల లోతు నీళ్లలో దిగి నడుచుకుంటూ కొంత దూరం వెళ్లిన తర్వాత  శ్రీ కేశవనాథేశ్వర స్వామి దర్శనం కలుగుతుంది. జలపాతాలు, కొండలు, అందంగా చెక్కినట్టుండే సజహమైన రాళ్లు, గుహలు ఉండే ఈ  ప్రశాంత ప్రదేశంలో కేశవవాథేశ్వరుడిగా కొలువయ్యాడు పరమేశ్వరుడు. చుట్టూ  అడవులు , లోయలు ఉండే ఈ మార్గంలో కరెంట్ సరఫరా ఉండదు, సరైన రోడ్డుమార్గం కూడా లేదు. ఇన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ ఈ గుహ ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులు పోటీపడుతుంటారు. 


ఇక్కడ పరమేశ్వరుడిని దర్శించుకుంటే మానసిక ప్రశాంతత, ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.  నీళ్లలో నిలబడి భగవంతుడికి నమస్కరించే సమయంలో చేపలు మీ పాదాల చుట్టూ చేరి మీ శరీరంలో ఉండే చింతలు దూరం చేస్తాయి. ప్రవేశ ద్వారం నుంచి 75 అడుగుల దూరంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకునేందుకు అక్కడ చిన్న దీపం మాత్రమే ఉంటుంది. ఎలాంటి లైట్లు కానీ వెలుగు కానీ ఉండదు. 


Also Read: బుద్ధి, జ్ఞానం, ధైర్యం, ఆత్మ విశ్వాసం కోసం ఈ రూపంలో ఉన్న గణపతిని పూజించాలి!


ఈ ఆలయం ఎప్పుడు ప్రారంభమైందో చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవు కానీ శతాబ్దాలుగా ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడని మాత్రం స్థానికులు చెబుతారు. స్వయంభుగా వెలసిన స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. 



మూడగల్లు లో కేవలం 5 నుంచి 6 కుటుంబాలు మాత్రమే ఉంటాయి. ఏడాదికి ఓసారి వచ్చే ‘ఎల్లు అమావాస్య’ రోజు వేలాది భక్తులు పరమేశ్వరుడి దర్శనార్థం ఈ గుహ ఆలయానికి చేరుకుంటారు. ఆ సమయంలో వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ... మూడగల్లులో ఉండే స్థానికులు రోడ్డు బాగుచేస్తారు. 


మోకాలి లోతు నీళ్లలో దిగి దర్శనానికి వెళుతున్నప్పుడు  ఆ నీటిలో చేపలు, పాములు ఉంటాయి కానీ అవి ఇప్పటివరకూ భక్తులకు ఎలాంటి హాని కలిగించిన సందర్భాలులేవు.  అక్కడ చేపలకు ఆహారం వేస్తుంటారు భక్తులు.


Also Read: ఏక సాలగ్రామ శిలపై చెక్కిన గణనాథుడు.. త్రిమూర్తులు ప్రతిష్టించిన విగ్రహం ఇది!


ఈ గుహ నుంచి నీరు ఏడాది పొడవునా ప్రవహిస్తూనే ఉంటుంది. నిత్యం సూర్యాస్తమయం సమయంలో ఆదిత్యుడు కిరణాలు నేరుగా శివలింగంపై ప్రసరిస్తాయి. ఈ రోజుకి సెలవు అని చెప్పేముందు సూర్యుడు నేరుగా శివయ్యకి పూజలు చేస్తున్నట్టే ఉంటుంది ఆ దృశ్యం. సరైన ప్రచారం లేకపోవడం వల్ల ఈ ఆలయ విశిష్టత గురించి పెద్దగా వెలుగులోకి రాలేదు. 


ఇంకా ఎన్నో విశిష్టతలున్న ఈ స్వయంభు కేశవనాథేశ్వర స్వామి ఆలయానికి తగిన గుర్తింపు రాలేదంటారు స్థానికులు. ఇప్పుడు తారక్, రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కుటుంబాలతో సహా వెళ్లి ఆలయాన్ని దర్శించుకోవడంతో దీని గురించి చర్చ జరుగుతోంది.  



ఈ ఆలయానికి చేరుకునేందుకు రెండు మార్గాలున్నాయి.. కుందాపూర్- కొల్లూరు రాష్ట్ర రహదారి, వందే - చిత్తూరు తర్వాత, శ్రీ క్షేత్ర మారనకట్టె వైపు కుడి మలుపు తీసుకుని, కెరాడి గ్రామానికి వెళ్లిన తర్వాత 2 కిలోమీటర్ల మేర అడవిలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ మార్గంలో బైక్ పై వెళ్లొచ్చు.  ఇక రెండో మార్గం అంటే...సిద్ధాపుర, కమలాశిలే , హల్లిహోల్ , చక్ర మైదానం వరకూ వెళ్లి ఆ తర్వాత కొండపై నుంచి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఇక్కడ జీప్ కానీ టూ వీలర్లో కానీ ప్రయాణం చేయొచ్చు. ఈ మార్గం సిద్దాపూర్ నుంచి 18 కిలోమీటర్లు...