పర్యావరణ పరిరక్షణ అనేది నేడు విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్న పదం. నిజానికి మన పూర్వికులు ఆచార, వ్యవహారాల్లోనే ప్రకృతి పరిరక్షణను పొందుపరిచారు. వాటికి దూరమవుతూనే ప్రకృతిని కాపాడుకోవాలంటూ నినదిస్తుండడం విచారకరం. ఇక భారతీయ మహిళలది సంస్కృతిలో ప్రత్యేక పాత్ర అనే చెప్పుకోవాలి. పురుషుల కంటే ఎక్కువ మహిళలే ప్రకృతికి దగ్గరగా ఉంటారు. అందుకే భూమాత, గోమాత, గంగమ్మ తల్లి అని పిలుచుకుంటారు భారతీయులు. అంతటి ప్రాధాన్యత ఉన్న మహిళలు ప్రకృతి పండుగలు ఎంచక్కా జరుపుకుంటారు. అందుకు కొన్ని ఉదాహరణలను చెప్పుకుందాం.


ఉత్తరాఖండ్‌లో కోషి నది కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అప్పుడే రాధా బెన్ అనే మహిళ నది బచావ్ అభియాన్ ప్రారంభించారు. అంతేకాకుండా అడవుల్లోని చెట్లను రక్షిస్తూ వచ్చారు. గిరిజన తెగలవారిని, గ్రామస్తులను ఏకం చేస్తూ 2007లో తన ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. 2010 నాటికి రాధాబెన్‌ పోరాటం ఫలించింది. నది తిరిగి జీవం పొందింది. నది ఆధారిత గ్రామాలు పచ్చదనంతో కళకళాడాయి.


అక్కడితో ఆగిపోలేదామె... అటవీ పరిరక్షణ కోసం లక్ష్మి ఆశ్రమ్ అనే పేరుతో స్థానిక బాలికలకు తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. అదే స్ఫఊర్తితో ప్రేరణ సింగ్ బింద్రా, జానకి లెనిన్, డాక్టర్ వనజా రామ్‌పప్రసాద్, పూనమ్ బిర్ కస్తూరి, బానో హరాలు, సుగతకుమారి, ఆరతికుమార్ రావ్, అమ్ల రూయా, జె.విజయ, నళిని శేఖర్, విద్య ఆత్రేయ, రాధా భట్ వంటి ఎందరో దేశంలో పర్యావరణ పరిరక్షణ కోసం స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు


వీళ్లలో చాలా మంది పోరాటం ఇంటి నుంచే మొదలైంది. ఇంటి ఆవరణలోని తులసమ్మకు తప్పక పూజ చేస్తారు. దీపం వెలిగించి చల్లంగా చూడాలని మొక్కుకుంటారు. అంటే గడప నుంచే మొక్కల సంరక్షణ ప్రారంభిస్తున్నారు అన్నమాట. ఇలా మొదలై దేవాలయాల్లో రావి చెట్టు.. వేప చెట్టు.. ఉసిరి.. తదితర చెట్లకు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజాధికారులు నిర్వహిస్తారు.


విషపూరితమైన పాముకు కూడా నాగులచవితి, నాగుల పంచమి పర్వదినాలలో పాలు పోస్తారు. అంటే పరోక్షంగా వారు చెట్లను.. జీవరాశులను కాపాడుకోవాలనే సందేశాన్ని ఇస్తున్నారు. ప్రకృతి సమతుల్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నారనే చెప్పుకోవాలి. ఇక ఊరంత పూజించే గ్రామ బొడ్రాయి కొండలు, గుట్టలను పూర్వీకులు రక్షించుకునేందుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చెప్పకనే చెబుతోంది.


ఇక పండుగల విషయానికి వస్తే బతుకమ్మను తీసుకొవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ పూల పండుగకు ఖ్యాతి సొంతమైంది. రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు మహిళల నిండుతనాన్ని.. ప్రకృతిలోని అందాలను మన కనులకు కడుతుంటాయి. అంటే పువ్వుల కోసమే కాకుండా.. వన్యప్రాణుల కోసం అడవులను కాపాడుకోవాలనే విషయాన్ని ఈ పండుగ ద్వారా తెలుసుకుంటాం. నిజానికి ఈ పూలకు నీటిని శుద్ధి చేసే గుణం ఉంటుంది. దాంతో వాటిని చెరువులు.. కుంటల్లో వేసినప్పుడు నీరు శుద్ధి అవుతుంది. ఇదే కోవకు చెందినది వినాయక చవితి పత్రి కూడా.


అంతేకాకుండా తీజ్ పండుగ కూడా భారతీయులకు సుపరిచితమే. శ్రావణ మాసంలో మహిళలు, యువతులు ఈ పండుగను చేసుకుంటారు. తమ కుటుంబ సభ్యులు, భర్త ఆయురారోగ్యాలతో వర్థిలాల్లని ఉపవాసాలు చేస్తారు. ముఖ్యంగా ప్రకృతికి పూజలు చేయడం ఈ పండుగలో ప్రధాన భాగంగా ఉంటుంది. దీనినే హరితాళిక అని కూడా అంటారు. అడవులు, గ్రామ శివారుల నుంచి సేకరించిన వివిధ ఔషధ గుణాలతో కూడిన మొక్కల ఆకులతో పూజలను నిర్వహిస్తారు. ఇక సంక్రాంతికి ఆవు పేడతో చేసిన గొబ్బె మ్మలను రంగవల్లికలలో పేర్చి వాటిని కృష్ణుడిగా గోపికలుగా భావించి పూజిస్తారు. ఆవుపేడతో వాకిలిని చల్లుతారు. ఇది నేలలో ఉండే రకరకాల క్రిమికీటకాలను నశింపచేస్తుందనేది మనందరికీ తెలిసిన విషయమే. అంటే ఏ విధంగా చూసుకున్నా భారతీయ స్త్రీలది ప్రకృతితో విడదీయలేని బంధం అని అర్థం చేసుకోవచ్చు. ప్రత్యక్షంగా పరోక్షంగా సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాల ద్వారా ప్రకృతిని భారతీయ మహిళలు రక్షిస్తూ ఉంటారు.