Dussehra Durgashtami 2022:  ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఎనిమిదవ రోజు.. అంటే ఆశ్వయుజ అష్టమి దుర్గాష్టమి లేదా మహాష్టమి పర్వదినం. ఈ రోజున వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడినవారు అస్త్ర పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు. ఈ ఏడాది దుర్గాష్టమి అక్టోబరు 3న వచ్చింది. 
అష్టమి తిథి: అక్టోబరు 2 ఆదివారం సాయంత్రం  6.28కి ప్రారంభమై... అక్టోబరు 3 సోమవారం సాయంత్రం 4.50 వరకూ ఉంది. సూర్యోదయానికి తిథిని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి...దుర్గాష్టమి అక్టోబరు 3 సోమవారం జరుపుకుంటారు. 


Also Read:  ఈ రెండక్షరాలు ఎందుకంత పవర్ ఫుల్


దుర్గాష్టమి
దుర్గా దేవీ "లోహుడు" అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయతీ వచ్చిందని చెబుతారు. ఇక దుర్గ అంటే ? దుర్గమైనది దుర్గ . దుర్గతులను తొలిగించేది దుర్గ. దుర్గతిని దూరం చేసి సద్గతిని ఇచ్చే తల్లి కనకదుర్గమ్మ. లలితా సహస్రనామంలో అమ్మవారికి ‘సద్గతి ప్రదా’ అని ఒక నామం ఉంది. గత జన్మలలో వాసనల వల్ల ఈ జన్మలో దుష్ట విషయాలపై ఆసక్తి కలిగిఉంటారు. ఆ తల్లిని ఉపాసిస్తే గురుమండల రూపిణి అయి, గురు రూపంలో దగ్గరకు వచ్చి తన శక్తిమంతమైన వాక్కులతో గత జన్మ  వాసన దూరంచేసి... దుర్గుణాలను సుగుణాలుగా మార్చేస్తుంది. నిత్యం 'దుర్గా' అనే నామాన్ని ఎవరు స్మరిస్తారో వారు సద్గతి వైపు ప్రయాణం చేస్తారు.‘దుర్గా’ అంటే దుంఖం దూరమవుతుంది. 


దుర్గా ఆరాధన వల్ల దుష్టశక్తులు,భూత , ప్రేత , పిశాచ , రాక్షసుల బాధలు దరిచేరవు . అందువల్లనే మొదటి మూడురోజులు దుర్గా రూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను , తదుపరి మూడురోజులు లక్ష్మీ రూపాన్ని ఆరాధించి సిరిసంపదలను , చివరి మూడురోజులు సరస్వతీ రూపాన్ని ఆరాదించి జ్ఞానాన్ని  పొందవచ్చంటారు పెద్దలు. దుర్గాష్టమి రోజు దుర్గా అష్టోత్తరం, దుర్గా సహస్రనామం పారాయణం చేస్తారు. 


Also Read: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం పొందుతారు!


దుర్గాష్టమి విశిష్టత
పాండవులు అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టుపై ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రతను సంతరించుకుంది. అందుకే ఇప్పటికీ జమ్మిచెట్టుకు భక్తిగా పూజలు చేస్తారు. దుర్గాష్టమి రోజు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి - అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు. దుర్గాష్టమి రోజు శక్తిపీఠాలను దర్శించుకోవడం లేదా సమీపంలోని అమ్మవారి ఆలయాలను సందర్శించుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు.


నవదుర్గల శ్లోకం
ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||
నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||
ఇలా దుర్గాదేవి తొమ్మిది రూపాలతో విరాజిల్లుతుంది