అందరి కోసం వండిన వంట మొత్తం మల్లిక ఒక్కతే కూర్చుని లాగించేస్తుంది. అది చూసి విష్ణు షాక్ అవుతాడు. ఇంట్లో గొడవ జరిగి అందరూ బాధగా ఉంటే నీకు తిండి ఎలా ఎక్కుతుందే అని తిడతాడు. ఇంట్లో బాధ ఉన్నా కడుపులో ఉన్న బిడ్డ కోసం తినాలని కదా అని మల్లిక ఏడుపు మొహం పెడుతుంది. మన బిడ్డ నాన్న తినిపించలేదేంటి అని అడుగుతుంది అనేసరికి విష్ణు మల్లికకి అన్నం తినిపిస్తాడు. అది చూసి తింగరోడు నా మాట నమ్మేశాడు అని అనుకుంటుంది. నా నుంచి నిజం తెలుసుకోవాలని అన్నయ్య వదిన చాలా ట్రై చేస్తున్నారు, అన్నయ్య నిద్ర లేచేలోపే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని తప్పించుకుని వెళ్లబోతుంటే రామా ఎదురుపడతాడు.


అఖిల్ చెయ్యి పట్టుకుని బలవంతంగా లాక్కుని వస్తాడు. అందరి ముందు నీతో మాట్లాడితే నీలో ఉన్న భయం నీతో మాట్లాడించదు అని పక్కకి తీసుకొచ్చాను నీలా చదువుకోకపోవచ్చు కానీ కుటుంబం విలువ నాకు తెలుసు. ప్రేమంటే భయం కాదు ధైర్యం. అమ్మ నిన్ను అర్థం చేసుకుంటుంది నిజం చెప్పు అని అడుగుతాడు. అమ్మ నన్ను నమ్మింది కాబట్టి తన ముందు అన్నయ్య నన్ను అడగడు అని మనసులో అనుకుంటాడు. నిజంగానే నేను జెస్సిని లవ్ చేయలేదని పెద్దగా అరుస్తాడు. ఏ గొడవ లేకుండా నిన్ను ఈ సమస్య నుంచి బయట పడేయాలని నేను చూస్తుంటే నువ్వేంటి అరిచి తప్పించుకోవాలని చూస్తున్నావ్ అని రామా తిడతాడు. జెస్సి కళ్ళల్లో నాకు నిజాయితీ కనిపించింది, నువ్వే తన కడుపుకి కారణం అని కనిపించింది, నువ్వు కాదు అంటే తన తల్లిదండ్రుల ముందు సమాజం ముందు తన పరువు ఏమవుతుందో అని భయం కనిపించింది. తప్పు చేస్తే తప్పించుకోవాలని చూడకు, నిజం ఒప్పుకో అని రామా అడుగుతాడు.


Also Read: తులసి చెయ్యి అందుకున్న సామ్రాట్- అందరి ముందు నిజం బట్టబయలు


అమ్మ మీద ఒట్టేసి మరి నేను నిజం చెప్తే నువ్వు వదిన ఎందుకు నా మీద నిందలు వేయాలని చూస్తున్నారు, ఆ జెస్సి ఎవరి వల్లో కడుపు తెచ్చుకుంటే దాన్ని నా మీద వెయ్యాలని ఎందుకు చూస్తున్నారు అని నోటికి వచ్చినట్టు వాగుతుంటే రామా కొట్టేందుకు చెయ్యి ఎత్తుతాడు. రామా.. అని జ్ఞానంబ గట్టిగా అరుస్తుంది. నీమీద ఒట్టు వేసిన తర్వాత కూడా ఇలా నన్ను అనుమానిస్తుంటే తట్టుకోలేకపోతున్నా అని అఖిల్ తల్లి దగ్గర నటిస్తాడు. తోడబుట్టిన వాడిని నమ్మకపోతే ఎలా అని జ్ఞానంబ అంటుంది. ఒక ఆడపిల్ల జీవితం ఇది, నీ గౌరవం మన ఇంటి గౌరవం కాపాడాలనే తాపత్రయం నాది అని రామా చెప్తాడు. నేను నాలుగు రోజులు నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చదువుకుంటాను అని అఖిల్ అడుగుతాడు. తప్పు చేసిన వాడే నేల చూపులు చూస్తాడు, తప్పు చేసిన వాడే నలుగురిలో ఉండటానికి భయపడతాడు, జెస్సితో తప్పు చేయనప్పుడు ఎందుకు నువ్వు వెళ్ళి బయట ఉండటం అని జానకి అంటుంది.


ఆ అమ్మాయితో ఏ సంబంధం లేదని చెప్తుంటే ఎందుకు వాడిని అనుమానిస్తున్నారని జ్ఞానంబ అంటుంది. నువ్వు నీ మీద ఒట్టేశాడని అఖిల్ వైపే ఆలోచిస్తున్నావ్ ఆ అమ్మాయి వైపే ఎందుకు ఆలోచించడం లేదని గోవిందరాజులు అంటాడు. మనకి నిజం కావాలి ఒట్టు కాదని అంటాడు. నువ్వు అడిగిన నాలుగు రోజులు గడువు కాదు రెండు రోజులు గడువులో నీ చదువుకి ఆటంకం కలగకుండా నిజం నిరూపించాలి, ఒకవేళ నిరూపించలేకపోతే ఆ అమ్మాయి పేరు ఈ ఇంట్లో వినిపించడానికి వీల్లేదని జ్ఞానంబ తేల్చి చెప్తుంది. మల్లిక నీలావతికి ఫోన్ చేసి ఇంట్లో పుల్లలు పెట్టడానికి రమ్మని పురామయిస్తుంది. నీలావతి ఇంటికి వచ్చి అందరూ మీ గురించి గుసగుసలాడుకుంటున్నారు అని చెప్తుంది. మీ ఇంట్లో అందరూ అనుకుంటున్నా సమస్య ఉందా అని అడుగుతుంది. అదేమీ లేదు జానకి సమస్య సృష్టించింది అని మల్లిక చెప్పబోతుంటే జ్ఞానంబ ఆపుతుంది. ఇంకోసారి ఇలాంటి మాటలతో నా ఇంటికి రావద్దు అని నీలావతికి బుద్ధి చెప్పి జ్ఞానంబ పంపించేస్తుంది.   


Also Read: మాధవ్ కి ఝలక్ ఇచ్చిన రుక్మిణి- దేవుడమ్మకి నిజం చెప్పిన సత్య