Dussehra 2022 : శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజంలో వెన్నెల పుచ్చపువ్వులా కాస్తుంది. మేఘాలు దూదిపింజల్లా ఉంటాయి. అందమైన ఈ రుతువులో వచ్చే నవరాత్రులు ఆధ్యాత్మిక సంస్కతిలో విలక్షణమైనవి.  సర్వసృష్టి స్త్రీ నుంచే సంభవిస్తుంది. పురుషుడు ప్రాణదాత. స్త్రీ శరీరధాత్రి. అందుకు నిదర్శనంగానే ఆశ్వయుజం శక్తిమాసంగా వెలుగుతోంది. కాలాన్ని స్త్రీ పురుష రూపాత్మకంగా చెబుతారు. ఏడాదిలో చైత్రం మొదలు భాద్రపద మాసం వరకూ (ఏప్రిల్ నుంచి సెప్టెంబరు) తొలి అర్ధ భాగం పురుష రూపాత్మకం. ఆశ్వయుజం నుంచి ఫాల్గుణం ( అక్టోబరు నుంచి మార్చి) వరకు గల ఆరు నెలల కాలం స్త్రీ రూపాత్మకం. ప్రత్యేకించి రెండో అర్ధ భాగంలోని తొలి మాసం ఆశ్వయుజం..అందుకే అమ్మవారి ఉపాసనకు ఈ నెల చాలా ప్రత్యేకం అని చెబుతారు పండితులు


Also Read: ఈ ఏడాది శరన్నవరాత్రుల్లో దుర్గాష్టమి ఎప్పుడు, ఆ రోజు విశిష్టత ఏంటి!


ఆశ్వయుజం తొలి నెలగా ఉండాలి
వాస్తవానికి శక్తిమాసంగా పిలిచే ఆశ్వయుజం తెలుగు నెలల్లో  మొదటి నెలగా ఉండాలి. కానీ చాంద్రమానం ప్రకారం చైత్రమాసం మొదటిది అయింది. అదెలా అంటే అశ్విని నుంచి రేవతి వరకూ మొత్తం  27 నక్షత్రాల్లో మొదటి 13, వెనక 13 నక్షత్రాలను విడిచి పెట్టి మధ్యలోఉన్న 14 వ నక్షత్రమైన చిత్తా నక్షత్రంతో చంద్రుడు కూడుకున్న పౌర్ణమి ఉండడంతో  చైత్రం మొదటి తెలుగు నెల అయింది. కానీ ఉపాసనకు సంబంధించి ఆశ్వీయుజ మాసం మొదటి మాసం అవుతుంది. 


శారదా నవరాత్రులు
భగవంతుని చేరుకోవడానికి ప్రారంభం ఇక్కడి నుంచే మొదలు. ఈ నెల ఆరంభంలోనే శారదా నవరాత్రులు పేరుతో తొమ్మిది రోజులు ఉపాసన చేస్తారు. దీనివెనుకున్న ముఖ్య  ఉద్దేశం ఏంటంటే ఈ నెల ఆరంభంలో తొమ్మది రాత్రులు కలపి ఒకరోజు ప్రారంభంలో ఉండే తెల్లవారు ఝాముతో సమానమని చెబుతారు. అంటే సూర్యోదయానికి ముందున్న కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తాం కదా అలా అన్నమాట. అందుకే ఈ నవరాత్రులు  ఉపాసనకి పరమయోగ్యమైన కాలమని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే సంవత్సరం మొత్తాన్ని ఒక రోజుగా భావిస్తే అందులో తల్లవారుఝాము కాలం ఆశ్వయుజ పాడ్యమి నుంచి నవమి వరకూ ఉండే కాలం. ఈ తొమ్మిది రాత్రులను బ్రహ్మ ముహూర్తంగా పరిగణిస్తారు.  అందుకే ఉపాశనకు నవరాత్రులు అత్యంత  యోగ్యమైనవి అని చెబుతారు. 


Also Read: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం పొందుతారు!


హిందూ ధర్మంలో బ్రహ్మ ముహూర్తం గురించి  ప్రస్తావన ఉంది.  
వర్ణా కీర్తి మతిం లక్ష్మీ స్వాస్త్యమాయుశ్ఛ విదంతి|
బ్రహ్మ ముహూర్తే సంజాగ్రచ్ఛివ పంకజ యథా||
దీనర్థం బ్రాహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల అందం, తెలివితేటలు, ఆరోగ్యంతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం పొంది సంపన్నలవుతారు. ఈ ముహూర్తానికి ప్రకృతితో లోతైన సంబంధం ఉంది. ఈ సమయంలోనే జంతువులు, పక్షులు మేల్కొంటాయి. వాటి మధురమైన కిలకిల రావాలు ప్రారంభమవుతాయి. తామర పువ్వు కూడా ఈ సమయంలోనే వికసిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే ప్రకృతి కూడా బ్రహ్మ ముహూర్తంలోనే చైతన్య పరుస్తుంది. అందుకే ఉపాసనకు బ్రాహ్మ ముహూర్తంగా భావించే శరన్నవరాత్రుల్లో అత్యంత శక్తి దాగిఉందని చెబుతారు. ఈ తొమ్మది రాత్రులు, తొమ్మది పగలు క్రమం విడిచిపెట్టకుండా దైవచింతనలో ఉండాలని చెబుతారు. ఇంట్లో అయినా, దేవాలయంలో అయినా, మండపాల్లో అయినా అమ్మవారికి నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు చేసి పదవరోజు అంటే విజయ దశమి రోజు పూజలు నిర్వహించి అమ్మవారి మూర్తిని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. 


అందుకే ఆశ్వయుజం మాసం...ఈ మాసం ఆరంభంలో వచ్చే శరన్నవరాత్రులు అంత ప్రత్యేకం....