తుకమ్మ పండుగ పూల పండుగ. బతుకు పండుగ. తెలంగాణ స్త్రీల మనోకామన ఈ పండుగ. ఇది దాదాపు నెలరోజుల పాటు సాగేపండుగ. భాద్రపద పౌర్ణమిన బొడ్డెమ్మగా మొదలై ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాటికి సద్దుల బతుకమ్మగా ముగిసే సుదీర్ఘ పండుగ రోజులు ఇవి. బొడ్డెమ్మను పిల్లలు, పడుచులు కొలుచుకుంటారు. ఇది పుట్టమన్నుతో చేసిన అమ్మవారి ప్రతిరూపం కాగా బతుకమ్మ పూలలో కొలువైన అమ్మవారిని కొలుచుకునే పండుగ. బతుకమ్మ స్త్రీలంతా కూడి చేసుకునే పండుగ. పిండి వంటలు, పట్టుచీరలు, నగలు, పసుపు కుంకుమలు, పువ్వుల శోభతో ప్రతి పడతి ఆ దేవేరిలా దేదీప్యంగా వెలిగే మహోత్సవం ఈ పండుగ.


వానాకాలం దాదాపు ముగింపులో ఉండగా ఈ పండుగ జరుపుకుంటారు. జలశయాలు నిండుగా నిండి ఉంటాయి. ప్రకృతి పచ్చని ఆకృతి దాల్చి తాజా అందాలతో వింత శోభను సంతరించుకుని ఉంటుంది. బతుకమ్మ పూలతో అమ్మవారికి జరిపే ఒక ప్రత్యేక సేవ. ఇందుకు ఉపయోగించే పూవ్వులు కూడా సున్నితమైన మల్లెలో, గులాబిలో కాదు. బతుకమ్మకు వాడే పూలన్నీ కూడా దాదాపు అడవి పువ్వులే. తంగెడు పువ్వు బతుకమ్మ అనగానే గుర్తొచ్చే పువ్వు. ఆతర్వాత శ్రేష్టంగా భావించేది గునుగు పువ్వు, వీటి తర్వాత స్థానం సీత జడలు లేదా పట్టుకుచ్చులనే పేరుతో పూసే మెత్తని పువ్వులు. కలువలు, తామరలు ఇలా కేవలం ఈ సీజన్ లో దొరికే పూలే వాడుతారు తొమ్మిది లేదా ఏడు అంతస్తులుగా రంగురంగుల పూలను పేర్చి బతుకమ్మ తయారు చేస్తారు. పై అంతస్తు మీద గుమ్మడి పువ్వును ఉంచి గుమ్మడి గౌరమ్మగా గౌరవించుకుంటారు. పసుపుతో చేసిన గౌరమ్మను చిక్కుడు ఆకులో ఉంచి దాన్ని బతుకమ్మలో పెట్టి పూజించుకుంటారు పడతులు. రెండు బతుకమ్మలు పేర్చుకోవాలి తప్పని సరిగా.  తమ పుట్టినింటి, మెట్టినింటి సౌఖ్యాన్ని ఆశిస్తూ చేసే ఈ గౌరి పూజ చూడాలి తప్ప చెప్పేందుకు మాటలు చాలవు. తొమ్మిది రకాల తీపి సద్దులను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటారు. అందుకే ఇది సద్దుల బతుకమ్మ. ఇలా పూజించుకున్న బతుకమ్మను అందరూ ఇంటి నుంచి ఊరి మధ్యకు తెచ్చి అక్కడ అందరూ తమతమ బతుకమ్మలను ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ పాడుతూ ఆడుతారు. అదే బతుకమ్మ సంబురం.


ఎప్పుడో కానీ పుట్టింటికి రాని పడతులు తమ స్నేహితురాళ్లను, అక్కాచెల్లెళ్లను కలుసుకున్న సంతోషంలో జీవితాన్ని పాటగా కూర్చి పాడుకునే పాటలే బతుకమ్మ ఉయ్యాల పాటలు.


రామ రామ రామ ఉయ్యాలో


రామనే శ్రీరామ ఉయ్యాలో


కుర్చీ పీటల మీద  ఉయ్యాలో


కూర్చున్న మామ గారు ఉయ్యాలో


మాఅన్నలొచ్చినరు ఉయ్యాలో


మమ్మంపుతారా ఉయ్యాలో


అని అత్తవారింట్లో తాను ఒద్దికగా నడుచుకుంటున్న విధానం గురించి చెబుతుంది. పరమేశ్వరునంతటి తన భర్త గురించి మరో పాటలో పాడుతుంది. ఆ పాటల్లో ఉన్నవి తెలంగాణ స్త్రీల బతుకు చిత్రాలే. కష్ట సుఖాల కలబోత బతుకు అని ఈ పాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు డీజేల మోతలో వినిపించేవి అసలు బతుకమ్మ పాటలే కావు. కేవలం చేతి చప్పట్లు, గాజుల గలగల మధ్య రాగయుక్తంగా లయబద్ధంగా వినిపించే బతుకమ్మ పాట ఒక అద్భుతం. ఇలా చీకటి పడే వరకు సాగిన ఈ బతుకమ్మ ఆట ముగింపులో అంతా కలిసి బతుకమ్మల నిమజ్జనానికి ఊరి చివరన ఉన్న జలశయానికి వెళ్తారు. వెళుతూ కూడా ‘‘గౌరమ్మ అత్తా వాడ పోయిరావమ్మ’’ అని పాడుతూ సాగనంపుతారు. అక్కడ బతుకమ్మలను నిమజ్జనం చేసి పసుపుతో చేసిన గౌరమ్మను ఆ చెరువు నీటితోనే తడిపి అందరూ ఒకరికి ఒకరు పసుపు కుంకుమలు అలంకరించుకొని వాయినాలుగా ఇంట్లో అమ్మవారికి సమర్పించుకున్న నైవేద్యాలను పంచుకోవడంతో బతుకమ్మ సంరంభం ముగుస్తుంది.


బతుకమ్మకు దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ పండుగ మొదలైన విధానం గురించి చరిత్రలో చాలా కథలు ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాడే పాటలు అని ప్రతీతి కూడా ఉంది.


తంజూవూరు బృహదీశ్వరుడి సతి బతుకమ్మ


అంతకు పూర్వపు చరిత్ర కూడా ఉందని కొన్ని చరిత్ర ఆనవాలు చెబ్బుతున్నాయి.  తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యలు సామంతులుగా ఉండేవారు. చోళులకు, రాష్ట్రకూటులకు యుద్దం జరిగినప్పుడు ఈ చాళుక్యలు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు.



 క్రీస్తు శకం 973లో ఈ చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్ర కూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతంచేసి కల్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాస్రాయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు. అప్పటి వేములవాడ ( ప్రస్తుత కరీంనగర్ జిల్లా ) లో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు చోళరాజు పరాంతక సుందరచోళా కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళానే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. అతని కుమారుడైన రాజేంద్రచోళ సత్యాస్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు.

 ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006 లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ. క్రీస్తు శకం 1010 లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బ్రిహదేశ్వరాలయంలో ప్రతిష్టించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళ రాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి , బృహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది.బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను, తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేస్తూ మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణవాసులు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణవాసులు జరుపుకుంటున్నారు.


ఆ బృహదమ్మే ఈ బతుకమ్మ


బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు. బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారు అంతటా స్త్రీలు "బొడ్డెమ్మ" ( మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ ) ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు. తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు తొమ్మిది రోజులపాటు ప్రతిరోజూ ఓక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారు చేస్తారు. చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటారు.


Also Read: శరన్నవరాత్రుల్లో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినరు, తింటే ఏమవుతుంది!


ఆధునికంగా తెలంగాణ అస్థిత్వంగా బతుకమ్మ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర పండుగగా తన శోభను మరింత పెంచుకుంది. ఏది ఏమైనా ఈ పండుగ మనుషులను కలిపే, మనసులను తెలుపుకునే సామూహిక పండుగ. పువ్వులు, నవ్వుల పండుగ. సమస్త మానవాళికి బతుకమ్మ పండుగ శుభాకంక్షలు.


Also Read: శరన్నవరాత్రుల్లో పాడ్యమి నుంచి దశమి వరకూ అమ్మవారికి రోజుకో రంగు ప్రత్యేకం