Shodasa Samskara : హిందూ ధర్మంలో ఎన్ని పద్ధతులు పాటించినా ప్రాణి భూమ్మీద పడినప్పటి నుంచి మరణించి మరుభూమికి చేరుకునేవరకూ ముఖ్యమైన 16 సంస్కారాలను అనుసరిస్తారు. వాటినే షోడశ సంస్కారాలు అంటారు..


1. గర్భాదానం
మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఫస్ట్ నైట్...అత్యంత పవిత్రమైన కార్యం ఇది.  స్త్రీ పురుషులు  ఇద్దరూ కలసి ఓ కొత్తప్రాణికి జీవం పోయడాన్ని గర్భాదానం అంటారు. వివాహిత స్త్రీ స్వచ్ఛమైన ఆలోచనలతో, శారీరక ఆరోగ్యంతో గర్భం దాల్చినప్పుడు.. ఆమె ఆరోగ్యకరమైన తెలివైన బిడ్డకు జన్మనిస్తుంది. ఈ ఆచారం కుటుంబ వృద్ధిని సూచిస్తుంది. 


2. పుంసవనం 
తరం మారుతున్న కొద్దీ ఆలోచనల్లో మార్పులు వచ్చి ఉండొచ్చు కానీ.. అప్పట్లో మగపిల్లాడు పుట్టేవరకూ పిల్లల్ని కంటూనే ఉండేవారు. వంశాభివృద్ధికి, తలకొరివి పెట్టేందుకు వారసుడు తప్పనిసరిగా కావాలని భావించేవారు. అందుకే గర్భందాల్చిన తర్వాత పుంసవనం చేయించేవారు. ఈ క్రతువు చేస్తే మగపిల్లాడు పుడతాడని విశ్వశించేవారు. ఇది జరిపించిన తర్వాత కూడా ఆడపిల్ల పుట్టిన సందర్భాలున్నాయి.


Also Read: ఫస్ట్ నైట్ కి ముహూర్తం ఎందుకు నిర్ణయిస్తారో తెలుసా!


3.సీమంతం
 ముఖ్యమైన మూడోది సీమంతం. ఈ కార్యక్రమం ద్వారా కడుపులో ఉన్న బిడ్డకు మంచి గుణాలు, మంచి స్వభావం ఉంటుందని విశ్వసిస్తారు.  ముత్తైదువల ఆశీర్వచనాలతో ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుందని నమ్మకం


4.జాతకకర్మ
బిడ్డ పుట్టిన తర్వాత జరిపే సంస్కారం జాతకర్మ. గర్భంలో ఏర్పడిన దోషాలను తొలగించేందుకు నవజాత శిశువుకు ఉంగరపు వేలు నుంచి లేదా..బంగారు స్పూన్ నుంచి తేనె , నెయ్యి లేదంటే ఆవుపాలు ఇస్తారు. నెయ్యి ఆయుష్షును పొడిగించగలదని పిత్త వాతాలను నాశనం చేస్తుందని నమ్ముతారు. తేనెను కఫ నిరోధకం కోసం వినియోగిస్తారు.   


5. నామకరణ వేడుక
నామకరణ మహోత్సవం గురించి అందరికీ తెలిసినవిషయమే. పుట్టిన బిడ్డకు పేరు పెట్టడం...


6. ఇల్లు దాటించడం
బిడ్డ జన్మించిన తర్వాత మొదటి సారిగా ఇల్లు దాటించడాన్ని నిష్క్రమణ అంటారు. అమ్మ కడుపులోంచి భూమ్మీద పడినతర్వాత మొదటి సారిగా ఇల్లు దాటేందుకు మంచి రోజు చూసి తీసుకెళతారు. తొలిసారి ఏదైనా ఆలయానికి తీసుకెళ్లడం హిందూ సంప్రదాయం...


Also Read: పెళ్లిలో వధూవరులకు అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారో తెలుసా!


7. అన్నప్రాశన
పెరిగే బిడ్డకు భౌతికావసరాలు తీర్చడానికి ఘనాహారం ఇవ్వడం మొదలు పెట్టే ప్రక్రియ ఇది. ఈ ఆచారం ద్వారా నవజాత శిశువుకు మొదటిసారి ఆహారం  అందిస్తారు.


8. కేశ ఖండన
దీర్ఘాయుష్షు, అందమైన రూపం కలగాలని ఆశిస్తూ చేసే సంస్కారం ‘కేశ ఖండనం’..దీనినే పుట్టు వెంట్రుకలు తీయించడం అంటారు. ఈ సంస్కారం ముఖ్య ఉద్దేశం బిడ్డకు బలం, మెరుపు అందించడమే.


9. చెవులు కుట్టించడం
బిడ్డడికి ఐదేళ్ళ లోపు చేయవలసిన సంస్కా రం ఇది. దీనిని ‘కర్ణవేధ’ అంటారు. కర్ణాభరణాలు ధరించడం అందంకోసమే కాదు ఆరోగ్య రీత్యా కూడా అవసరం.


10. అక్షరాభ్యాసం ఉపనయనం
బిడ్డ కొంత మానసిక పరిపక్వత చెంది..కొత్త విషయాలు నేర్చుకునేందుకు సిద్ధపడే సమయంలో చేసే సంస్కారాన్ని ‘అక్షరాభ్యాసం’ అంటారు. ఈ క్రతువును ఏడో సంవత్సరంలో చేయాలని చెప్పారు అప్పటి రుషులు...ఎందుకంటే అదే సమయంలో అక్షరాభ్యాసం, ఉపనయనం జరిపించి గురుకులాలకు విద్యకోసం పంపించేవారు.  


11. కేశాంత
అబ్బాయికి పదాహారేళ్ళ వయసు వచ్చాక మొదటిసారి గడ్డం గీసుకోడానికి సంబంధించిన సంస్కారాన్ని ‘కేశాంత’ అంటారు. అంటే పెద్దవాడు అవుతున్నాడు అనేందుకు సూచన


Also Read: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది - రాముడు నవమి తిథిరోజే ఎందుకు జన్మించాడు!


12. సమావర్తన
అప్పట్లో విద్యాభ్యాసం ముగించుకుని గురుకులాన్ని వదిలి వెళ్ళేటప్పుడు నిర్వహించే సంస్కారాన్ని  ‘సమావర్తన’ అంటారు. దీనికే ‘స్నాతకము’ అనే పేరు కూడా ఉంది. 


13. సమకాలీన సంస్కృతి
సమావర్తనతో విద్యాభ్యాసం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన యువకుని ముందు రెండు మార్గాలుంటాయి. ఉద్యోగం చేస్తూ ధనం సంపాదించి పెళ్లి చేసుకుని గృహస్థ జీవితం గడపడం...గడించిన జ్ఞానంతో భౌతిక, మానసిక సంబంధాలకు దూరంగా జపతపాలతో ఆధ్యాత్మిక జీవితం గడపడం. మొదటి మార్గం అనుసరించేవారిని ఉపకుర్వనులు అని, రెండవ మార్గంలో ఉన్నవారిని నైష్ఠికులని అంటారు. ఏ మార్గం అనుసరించాలన్నా గురువు అనుమతి తప్పని సరి.


Also Read: ఈ ఏడాది ఉగాది ఎప్పుడు - చైత్ర పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!


14. వివాహ వేడుక
 వరునికి తగిన వధువును చూసి పెళ్లి చేయడం తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. అగ్నిసాక్షిగా వివాహం చేసుకుని ఆఖరిక్షణం వరకూ ఆమెతోనే కలసి బతకాలన్నది శాస్త్రవచనం


15. వివాహ అగ్ని ఆచారాలు
వివాహం తర్వాత ఇంటికి చేరిన తర్వాత ఇంట్లో మొదటి సారిగా దీపం వెలిగించే సంస్కారం కూడా గొప్పది. ఆ రోజు నుంచి ఆ ఇంటి వెలుగుకి  తాను కూడా కారణం అవుతానని వధువు చెప్పడమే దీనివెనుకున్న ఆంతర్యం


16. అంత్యక్రియలు
మనిషి జీవితంలో ఆఖరి మజిలీ అంత్యక్రియలు. చనిపోయిన వ్యక్తి కుమారులు..తమవారి ఆత్మకు శాంతి, సద్గతులు కలగాలని నిర్వహించే కార్యక్రమాన్ని అంత్యక్రియలు అంటారు. వేద మంత్రాల మధ్య కొడుకుతో తలకొరివి పెట్టిస్తారు. పదమూడు రోజుల కర్మకాండ అయ్యాక అన్న సంతర్పణ చేయడంతో ఆ సంస్కారం పూర్తవుతుంది.


గమనిక:  కొన్ని పుస్తకాల్లో ఉన్న సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది...దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం...