Chukkala Amavasya 2024: హిందువులకు జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో..జూలైలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. మకర సంక్రాంతి నుంచి ఉత్తరాణం ప్రారంభమవుతుంది...కర్కాటక సంక్రాంతి నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. ఉత్తరాయణం మొత్తం దైవకార్యాలకు, దక్షిణాయణం పితృకార్యాలకు అత్యంత విశేషమైనది. దక్షిణాయనం మొదలైన వెంటనే వచ్చే అమావాస్య..ఆషాఢ అమావాస్య. చుక్కల అమావాస్యగా పిలిచే ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలు విడిచిపెడతారు. ఈ రోజు చేసే దానధర్మాలు, జపతపాతలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. పితృకర్మలు నిర్వహించినా, వారి పేరుతో దానధర్మాలు చేసినా విశేష ఫలితాలు పొందుతారు. 


ఆషాఢ అమావాస్య (Ashadha Amavasya 2024)


ఆగష్టు 03 శనివారం మధ్యాహ్నం 3 గంటల 31 నిముషాల నుంచి అమావాస్య ఘడియలు ప్రారంభమయ్యాయి. 
ఆదష్టు 04 ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 54 నిముషాల వరకూ అమావాస్య ఘడియలు ఉన్నాయి
పితృదేవతలకు తర్పణాలు విడిచేవారు ఆదివారం అమావాస్య నియమాలు పాటిస్తారు..


Also Read: స్వస్తిక్ గీసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. హిట్లర్ పతకానికి కారణం అదేనా!
 
గౌరీ పూజ ప్రత్యేకం


ఆషాఢ అమావాస్య రోజు కొన్ని ప్రాంతాల్లో గౌరీ పూజ నిర్వహిస్తారు. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శుభాలనిచ్చే శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణం అంటే మళ్లీ శుభముహూర్తాలు మొదలయ్యే సమయం. అందుకే శ్రావణంలో అంతా మంచే జరగాలని కోరుకుంటూ... మంచి వరుడు లభించాలని ప్రార్థిస్తూ కన్నెపిల్లలు గౌరీ పూజ చేస్తారు. పసుపుముద్దని గౌరీదేవిగా భావించి పూజించి..బియ్యంపిండితో చేసిన కుడుములు సమర్పిస్తారు. ఈ రోజు గౌరీపూజ చేసే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. కేవలం అవివాహతులే కాదు కొత్త కోడళ్లు కూడా చుక్కల అమావాస్య పేరుతో నోము నోచుకుంటారు. ఉదయాన్నే గౌరీపూజ చేసి సాయంత్రంవరకూ ఉపవాస నియమాలు పాటిస్తారు. అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటిపై వంద దారపు పోగులు ఉంచుతారు. వాటిని దండగా అల్లుకుని మర్నాడు ధరిస్తారు. ఈ రక్షా కంకణం కట్టుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయని విశ్వసిస్తారు. 


Also Read: రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, నాగపంచమి సహా 2024 ఆగష్టు నెలలో వచ్చే పండుగలివే..!


గోమాతకి పూజ చేయండి


ఆషాఢ మాసం నుంచి సూర్యుడు దక్షిణాయనం వైపు ప్రయాణిస్తాడు. ఫలితంగా పగటివేళలు తగ్గి రాత్రివేళలు పెరుగుతాయి. వాతావరణంలో వేడి తగ్గుతుంది. ఫలితంగా బద్ధకం, అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. వాటిని పారద్రోలి వెలుగుని వేడిని ఇచ్చేందుకు సూచనగా దీపపూజ చేస్తారు.  దేవుడి మందిరం ముందు అలికి ముగ్గువేసి దీపాలు వెలిగిస్తారు. దీపాలను పుసుపు, కుంకుమ, పూలతో అలంకరించి గౌరీదేవికి ప్రత్యేక పూజ చేస్తారు. పూజ అనంతరం  గోమాతకి అరటిపండ్లు తినిపించి..ప్రదక్షిణ చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.  


Also Read: శ్రావణమాసం ఎప్పటి నుంచి ప్రారంభం - వరలక్ష్మీ వ్రతం ఎప్పుడొచ్చింది!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం.  దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం .