Bhai Dooj 2023 Date: సోదరి, సోదరుల పండుగ అనగానే 'రాఖీ' అని గుర్తొస్తుంది. కానీ దాదాపు ఇలాంటి వేడుకే పురాణాల్లో మరొకటి ఉంది. అదే భగిని హస్త భోజనం.   కార్తీక శుద్ధ విదియ అంటే కార్తీకమాసంలో రెండో రోజు ఇది జరుపుకుంటారు. రక్షాబంధనం రోజు సోదరులు తమ సోదరీమణులతో రాఖీ కట్టుకుని వారికి అండగా ఉంటామని, ఎల్లవేళలా యోగక్షేమాలు చూస్తామని మాటిస్తారు. ఈ భగిని హస్త భోజనం రోజు...ఆ సోదరుడి ఆరోగ్యం, ఆయుష్షుని కాంక్షిస్తూ సోదరీమణులు ఈ వేడుక నిర్వహిస్తారు. "భాయ్‌ దూజ్‌'' అనే పేరుతో ఉత్తరభారత దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన వేడుక ఇది. దక్షిణాదిన కూడా ఇప్పుడిప్పుడే మరింత ప్రాచుర్యం పొందుతోంది.. 


Also Read: కార్తీక సోమవారం వ్రతవిధి 6 రకాలు, మీరు అనుసరించేది ఏది!


"భాయ్‌ దూజ్‌'' పురాణ కథనం


ఈ పండుగ జరుపుకోవడం వెనుక పురాణాల్లో ఓ కథనం చెబుతారు. యమధర్మరాజు సోదరి యమున. ఆమె పెళ్లి చేసుకుని వెళ్లిన తర్వాత తన సోదరుడిని ఇంటికి రమ్మని ఎన్నోసార్లు ఆహ్వానించింది. కానీ తన విధినిర్వహణలో యమధర్మరాజు వెళ్లలేకపోయాడు. ఓ సారి కార్తీక మాసం విదియ రోజున అనుకోకుండా చెల్లెలు యమున ఇంటికి వెళ్తాడు. సోదరుడి రాకను సంతోషించిన యమున పిండి వంటలతో భోజనం పెట్టింది. సోదరుడితో తనం సంతోషాన్ని చెప్పింది. ఆ ఆనందంలో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు. అయితే తనకు అత్యంత ఆనందాన్ని ఇచ్చిన ఈ రోజున ఎవరైతే సోదరి ఇంట భోజనం చేస్తారో వాళ్లకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని యమున అడిగింది. తాను సోదరి ఇంట్లో భోజనం చేసిన కార్తీకశుద్ధ  విదియ రోజు ఎవరైతే సోదరీమణుల చేతి భోజనం తింటారో వారికి అపమృత్యు దోషం తొలగిపోయి అకాల మరణం ఉండదని వరమిచ్చాడు యముడు.


Also Read:  కార్తీకమాసంలో రోజూ తలకు స్నానం చేయాలా!


సూర్యుని సంతానమైన యుమడు, యమునకు ఒకరంటే మరొకరికి ఎంతో ఆప్యాతయ. తన సోదరి అనుగ్రహానికి పాత్రులైన వారికి అపమృత్యు దోషం ఉండదని కూడా యముడు మరో వరమిచ్చాడు. అందుకే యమునా నదిలో స్నానం చేసిన వారికి అపమృత్యు దోషం ఉండదని కూడా చెబుతారు. ఈ రోజున సోదరులను ఇంటికి ఆహ్వానించి పిండివంటలతో భోజనం వడ్డించి...అనంతరం హారితిచ్చి దీవించి..నూతన వస్త్రాలు సమర్పిస్తారు. మహారాష్ట్రలో ఈ పండుగను భాయ్ దూజ్ అంటారు..నేపాల్ లో ‘భాయి-టికా’ అని పిలుస్తారు. పంజాబ్ లో ‘టిక్కా’ అంటారు. ప్రాంతం ఏదైనా పిలిచే పేరేదైనా ఈ పండుగ వెనుకున్న ఆంతర్యం సోదరుడి క్షేమమే...సోదరుడికి క్షేమాన్ని కోరుతూ ఇంటికి ఆహ్వానించి భోజనం వడ్డించి కానుకలిచ్చే సోదరి సౌభాగ్యవతిగా ఉంటుందనే వరం కూడా ఇచ్చాడు యమధర్మరాజు. ఉత్తరాదిన బాగా జరుపుకునే ఈ వేడుక దక్షిణాదిన కొందరు మాత్రమే జరుపుకుంటారు. కొత్తగా ప్రారంభిస్తే ఏదో జరిగిపోతుందనే అపోహ అవసరం లేదని..ఈ రోజు విశిష్ఠత గురించి తెలుసుకున్న ఎవ్వరైనా కానీ ఈ వేడుక జరుపుకోవచ్చని సూచిస్తున్నారు పండితులు..


Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!


గమనిక: పండితుల నుంచి, కొన్ని పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఇది. దీన్ని మీరు ఎంతవరకూ విశ్వసిస్తారన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం