Balapur Ganesh Laddu Auction 2024:  ఆర్థికంగా ఊహించని స్థాయిలో ఉన్నాను..మానసిక ప్రశాంతత కలిగింది..అందుకే లక్షలు వెచ్చించైనా వేలంలో గణేష్ లడ్డూ ప్రసాదం దక్కించుకోవాలి అనుకుంటాం అని చెబుతున్నారు గడిచిన వేలంలో విజేతలు.. ఇంతకీ ఆ లడ్డూ ఏం చేస్తారు..


గణేషుడి ఉత్సవాలంటే ఊరూ వాడా సంబరమే. చిన్న చిన్న పల్లెల నుంచి మహా నగరాల వరకూ పండుగ వాతావరణమే.  ఉత్సవాల పేరుతో అందర్నీ ఓ చోటుకి చేర్చి ఘనంగా పూజలందుకుని గంగమ్మ ఒడికి తరలివెళతాడు వినాయకుడు. మళ్లీ వచ్చే ఏడాది వరకూ ఈ సంబరాన్ని గుండెల్లో నింపుకుంటారు భక్తులు. నవరాత్రులు ముగిసి..నిమజ్జనానికి తరలివెళ్లేముందు అత్యంత ముఖ్యమైన క్రతువు లడ్డూ వేలం. 


ఇప్పుడంటే ప్రతి గణేష్ మండపం వద్దా లడ్డూ వేలం నడుస్తోంది కానీ...అసలు లడ్డూ వేలాన్ని ప్రారంభించిందే బాలాపూర్ గణేషుడి దగ్గరే. పార్వతీ తనయుడికి లడ్డూ నివేదించే సంప్రదాయం 1980 నుంచి ప్రారంభమైంది కానీ...1994 నుంచి వేలం పాట ప్రారంభించారు. మొదటిసారిగా 450 రూపాయలు పలికిన లడ్డూ  ధర ఏటికేడాది పెరుగుతూ గతేడాది 27 లక్షలకు చేరుకుంది. అందుకే ఈ ఏడాది లడ్డూ వేలంలో పాల్గొనేవారు ముందుగా గతేడాది లడ్జూ ధర అయిన 27 లక్షలు డిపాజిట్ చేయాలనే ఆంక్షలు విధించారు. ఇలా అయితే వేలంపాటలో రద్దీ నివారించొచ్చు.. పైగా లెక్క తొందరగా ముందుకెళుతుంది..ఎక్కువ సమయం పట్టకుండా వేలం పాట క్లోజ్ అవుతుంది.  ఈ ఏడాది (2024) 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు పలికింది...


Also Read: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా


వినాయకుడికి నివేదించే లడ్డూని వేలంలో దక్కించుకుంటే ఏం లాభం?


లక్షల రూపాయలు వెచ్చించి కొన్న ఆ లడ్డూని ఏం చేస్తారు?


ఇదే విషయాన్ని గతంలో వేలంలో లడ్డూ దక్కించుకున్న భక్తులను ప్రశ్నిస్తే.. వాళ్లు చెప్పిన సమాధానాలివే..


బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంలో దక్కించుకుంటే ఆర్థికంగా వృద్ధి చెందాం. ఆ ఏడాది ఆస్తులు, కొనుగులో అమ్మకాలు ఏం చేసినా మంచి లాభాలు ఆర్జించాం...


వేలంలో లడ్డూ దక్కించుకుంటే కుటుంబంలో కొన్నేళ్లుగా వెంటాడుతున్న వివాదాలు సమసిపోయి ప్రశాంతత లభించింది. మానసికంగా ఉండే గందరగోళం నుంచి ఉపశమనం దొరికింది...


దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడేవారు బాలాపూర్ లడ్డూని వేలంలో కొనుగోలు చేసి ఆ ప్రసాదం స్వీకరించి ...అందరకీ పంచితే ఆరోగ్యం మెరుగుపడింది


ఏడాది మొత్తం ఏం పని ప్రారంభించినా అపజయం అనే మాటే వినిపించదు..కుటుంబంలో సంతోషం, వ్యాపారంలో వృద్ధి, ఉద్యోగంలో ఉన్నతి లభించింది..


ఈ లడ్డూని కొందరు ప్రసాదంగా అందరకీ పంచుతారు... మరికొందరైతే వ్యవసాయ పొలంలో కొంత చల్లితే ఆ ఏడాది ఎలాంటి విపత్తులు సంభవించినా వేసిన పంట చేతికందడమే కాదు..ఊహించని లాభాన్నిస్తుందని నమ్మకం..


Also Read: బాలాపూర్ గణేష్ లడ్డూకు రికార్డు ధర- 30 లక్షల ఒక వెయ్యికి సొంతం చేసుకున్న దయానందరెడ్డి


ఇక వేలంలో లడ్డూ దక్కించుకున్నవారి సంగతి సరే.. అంత మొత్తాన్ని నిర్వాహకులు ఏం చేస్తారనే సందేహం వచ్చి ఉండొచ్చు. ఏటా  గణేష్‌ వేలం పాట ద్వారా వచ్చే లక్షల రూపాయల మొత్తాన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. అదే సమయంలో కొన్నేళ్లుగా జరుగుతున్న వేలంలో ఎవరెవరు ఎంత మొత్తానికి లడ్డూ దక్కించుకున్నారో వారి వివరాలను భక్తులకు తెలియజేసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు బాలాపూర్ ఉత్సవసమితి. ఈ మొత్తంతోనే వివిధ ఆలయాల అభివృద్ధికి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు అండగా ఉండేందుకు ఉపయోగిస్తున్నారు...