Will YSRCP attend Andhra Pradesh assembly sessions:    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ ఆరోపణలు కొనసాగిస్తూనే ఉంది.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన  వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసిన ఉద్యోగాల విషయంలో అందరూ ఉద్యోగాల్లో చేరిన 9 నెలలతర్వాత   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  పూర్తిస్థాయిలో యుద్ధం ప్రకటించింది. నిరుద్యోగుల పక్షాన నిలబడుతున్నామంటూ వైసీపీ చేస్తున్న వరుస ప్రెస్ మీట్లు, ఆందోళనలు చూస్తుంటే.. రాబోయే బడ్జెట్ శాసనసభ   సమావేశాలను ఆ పార్టీ వేదికగా చేసుకోబోతోందా? అనే ఆసక్తికర చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో మొదలైంది. ప్రభుత్వం ఎన్ని సాంకేతిక వివరణలు ఇస్తున్నా, వైసీపీ మాత్రం తన పంథా వీడకుండా  నిరుద్యోగ గళం  వినిపిస్తోంది.

Continues below advertisement

 అసెంబ్లీ బాయ్‌కాట్ పంతం వీడుతుందా? 

  ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే సాకుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది.  కేవలం మీడియా పాయింట్లు, సోషల్ మీడియా వేదికల ద్వారానే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు రెండేళ్లు ముగుస్తుండటం, క్షేత్రస్థాయిలో కొన్ని ప్రభుత్వ నిర్ణయాలపై సహజంగానే వచ్చే   ప్రజా వ్యతిరేకతను వాడుకోవడానికి అసెంబ్లీని మించిన వేదిక లేదనే సలహాలు జగన్‌కు అందుతున్నాయి. డీఎస్సీ వంటి సున్నితమైన, లక్షలాది మంది ఓటర్లతో ముడిపడిన సమస్యపై సభలోనే ప్రభుత్వాన్ని నిలదీస్తే మైలేజ్ వస్తుందని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు.

Continues below advertisement

 డీఎస్సీ అస్త్రంతో నిరుద్యోగులకు దగ్గరవ్వాలని.. 

గత ఎన్నికల్లో యువత, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో కూటమి వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని రివర్స్ చేయాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.  భర్తీలో అవకతవకలు జరిగాయని  అభ్యర్థులు తీవ్ర నష్టపోయారని వైసీపీ ఆరోపిస్తోంది. విద్యాశాఖ మంత్రి ఇచ్చే వివరణలను తోసిరాజంటూ, నిరుద్యోగుల ఆవేదనను అసెంబ్లీ సాక్షిగా రికార్డుల్లోకి తీసుకెళ్లడం ద్వారా తామే అసలైన ప్రజా పక్షమనే ముద్ర వేసుకోవాలని చూస్తోంది. ఒకవేళ సభకు వెళ్తే, డీఎస్సీపై స్వల్పకాలిక చర్చ   లేదా వాయిదా తీర్మానం ఇవ్వడం ద్వారా సభను స్తంభింపజేయడానికైనా వెనుకాడరని భావిస్తున్నారు. 

 రెండేళ్ల పాలనపై నిలదీసేందుకు రైట్ టైమ్  కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికి వైసీపీకి ఇది అత్యంత అనుకూలమైన సమయం . రెండు బడ్జెట్‌లు దాటిపోవడం, సూపర్ సిక్స్ హామీల అమలు తీరు, ఉచిత ఇసుక విధానంలో క్షేత్రస్థాయి లోపాలు, రాష్ట్రంలో శాంతిభద్రతల  సమస్యలపై ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి అసెంబ్లీ కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్. ప్రతిపక్ష హోదా లేదు..  మైకు ఇవ్వడం లేదు, మాట్లాడటానికి సమయం సరిపోవడం లేదనే నెపంతో సభకు దూరంగా ఉంటే.. మైదానం మొత్తం కూటమికే వదిలేసినట్లవుతుందని, దానివల్ల క్యాడర్ మరింత నైరాశ్యంలోకి వెళ్తుందని వైసీపీ అంతర్గత మేధోమథనంలో వ్యక్తమైంది. అయితే వైసీపీ అసెంబ్లీలో అడుగుపెడితే కేవలం తాము మాత్రమే ప్రశ్నలు అడగడం సాధ్యం కాదు, ప్రభుత్వ కౌంటర్లను కూడా తట్టుకోవాల్సి ఉంటుంది. గత వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో అసలు డీఎస్సీ ఎందుకు వేయలేదు? కేవలం జీవోలతో కాలయాపన ఎందుకు చేశారు? కోర్టు కేసుల చిక్కుముడులకు కారణం ఎవరు? అనే ప్రశ్నలతో అధికార పక్షం కౌంటర్ ఎటాక్‌కు సిద్ధంగా ఉంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్,   లోకేశ్‌లు డేటాతో సహా పాత తప్పులను ఎండగడితే.. సభలో కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్న వైసీపీ దాన్ని ఎలా తట్టుకుంటుందనేది పెద్ద సవాల్.

  జగన్ నిర్ణయం పైనే ఉత్కంఠ! 

చివరి నిమిషంలో వ్యూహాలు మార్చడంలో వైఎస్ జగన్ శైలి భిన్నంగా ఉంటుంది. డీఎస్సీ సమస్యను అడ్డం పెట్టుకుని అసెంబ్లీలోకి  గ్రాండ్ ఎంట్రీ ఇస్తారా.. లేదా యథావిధిగా సభ వెలుపలే ప్రెస్ మీట్లు పెట్టి మాకు మాట్లాడే సమయం ఇవ్వరు  కాబట్టే వెళ్లడం లేదు  అని సెంటిమెంట్ పండిస్తారా అనేది చూడాలి. ఏది ఏమైనా, డీఎస్సీ అంశంపై వైసీపీ చూపిస్తున్న దూకుడు రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తోంది. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ వేదికగా ప్రజాస్వామ్యబద్ధమైన చర్చ జరగడమే రాష్ట్రానికి శ్రేయస్కరం అనేది ఎక్కువ మంది భావన.