YSRCP Digital Army:  ఏపీ రాజకీయాల్లో మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  తన వ్యూహాలకు పదును పెడుతోంది. కేవలం క్షేత్రస్థాయి పోరాటాలకే పరిమితం కాకుండా, ఆధునిక రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా మారిన డిజిటల్ మీడియాపై వైసీపీ తన ఫోకస్ మళ్లించింది. టీడీపీకి చెందిన ఐటీడీపీ కి ధీటుగా, జగనన్న టెక్ ఫోర్స్ పేరుతో సరికొత్త డిజిటల్ సైన్యాన్ని రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. మారుతున్న రాజకీయ సమీకరణాలు, ముఖ్యంగా తమిళనాడులో విజయ్ సాధించిన సోషల్ మీడియా విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని వైసీపీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.  

Continues below advertisement

 హైదరాబాద్ వేదికగా  వార్ రూమ్ 

వైసీపీ తన టెక్ ఫోర్స్ కార్యకలాపాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకోవడం వ్యూహాత్మక చర్యగా కనిపిస్తోంది. ఇక్కడి నుంచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక భారీ  డిజిటల్ వార్ రూమ్ ను నడపాలని పార్టీ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ నిఘా నీడ పడకుండా, స్వేచ్ఛగా పార్టీ తరఫున  నేరేటివ్  బిల్డ్ చేసేందుకు హైదరాబాద్ సేఫ్ జోన్ అని వైసీపీ భావిస్తోంది. ఇక్కడి నుంచే ప్రతి మండలానికి ఒక టెక్ వాలంటీర్‌ను సమన్వయం చేస్తూ, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం మరియు విపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం ఈ బృందం ప్రధాన విధి.

Continues below advertisement

 మండలానికి ఒక టెక్ వాలంటీర్ - మైక్రో లెవల్ మేనేజ్‌మెంట్ 

గతంలో వైసీపీకి సోషల్ మీడియాలో బలమైన మద్దతు ఉన్నప్పటికీ, అది కొంత అస్తవ్యస్తంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి మండలానికి ఒక టెక్ వాలంటీర్‌ను నియమించడం ద్వారా వ్యవస్థను సంస్థాగతం  చేస్తోంది. ఈ వాలంటీర్లు కేవలం పోస్టులు పెట్టడమే కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పసిగట్టి, దానికి అనుగుణంగా డిజిటల్ కంటెంట్‌ను రూపొందిస్తారు. ఇది పార్టీకి వ్యతిరేకంగా వచ్చే ప్రతి చిన్న వార్తను ప్రాథమిక దశలోనే తుడిచిపెట్టేందుకు ఉపయోగపడుతుంది.

 నేరేటివ్ బిల్డింగ్ - మారుతున్న యుద్ధ క్షేత్రం 

ప్రస్తుత రాజకీయాల్లో ఓటరు నాడిని పట్టుకోవాలంటే వీధుల కంటే  వాల్స్  మీద యుద్ధం చేయడం అత్యవసరమైంది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పసిగట్టడం, సంక్షేమ పథకాలపై చర్చ పెట్టడం వంటి అంశాల్లో వైసీపీ ఈ టెక్ ఫోర్స్‌ను ఒక ఆయుధంగా వాడుకోనుంది. తాజా ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుకుని సక్సెస్ అయ్యింది. అదే తరహాలో పక్కా ప్లానింగ్‌తో వైసీపీ తన  డిజిటల్ ఫుట్ ప్రింట్ 'ను పెంచుకోవాలని చూస్తోంది.

 విజయ్ ఫార్ములా స్ఫూర్తితో.. 

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే  పార్టీకి సంప్రదాయ మీడియా మద్దతు పెద్దగా లేకపోయినప్పటికీ, కేవలం సోషల్ మీడియా నిఘా ,  డిజిటల్ క్యాంపెయినింగ్ ద్వారానే అద్భుతమైన ఫలితాలు సాధించారు. ఈ  డిజిటల్ వేవ్ ను చూసిన తర్వాతే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ శైలిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో నాయకులు చేసే పనుల కంటే, అవి సోషల్ మీడియాలో ఎంత బలంగా ప్రొజెక్ట్ అవుతున్నాయనేదే ఎన్నికల ఫలితాలను శాసిస్తాయని వైసీపీ గట్టిగా నమ్ముతోంది.

 ఐటీడీపీతో తలపడేందుకు సిద్ధం 

వైసీపీ టెక్ ఫోర్స్ నేరుగా టీడీపీ ఐటీ వింగ్‌తో తలపడనుంది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో టీడీపీ ఒక అడుగు ముందుండగా, ఇప్పుడు వైసీపీ ప్రొఫెషనల్ టెక్ నిపుణులను రంగంలోకి దించడం ద్వారా ఆ గ్యాప్‌ను భర్తీ చేయాలని చూస్తోంది. వైసీపీకి ఉన్న లక్షలాది మంది కార్యకర్తలను ఒకే గొడుగు కిందకు తెచ్చి, ఏకకాలంలో ఒకే నేరేటివ్‌ను రాష్ట్రమంతా వ్యాప్తి చేయడం ఈ టెక్ ఫోర్స్ అసలు లక్ష్యం. రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే  డిజిటల్ స్పేస్ ను ఆక్రమించుకోవడం తప్పనిసరి అని వైసీపీ గుర్తించింది.  జగనన్న టెక్ ఫోర్స్  కేవలం ఒక వాట్సాప్ గ్రూపుల నెట్‌వర్క్ మాత్రమే కాదు, అది ఒక పక్కా పొలిటికల్ మెషినరీలా పనిచేయనుంది. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయ పోరాటం రోడ్ల కంటే మొబైల్ స్క్రీన్ల మీదే ఎక్కువగా కనిపిస్తుందనడంలో సందేహం లేదు. వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీకి మళ్లీ పూర్వ వైభవాన్ని తెస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి.