Assembly Disqualification:  ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు డీఎస్సీపై అసెంబ్లీ ముట్టడిని ప్రకటిస్తామని అంటున్నారు. నిజానికి  అసెంబ్లీకి గత రెండేళ్లుగా వైఎస్సార్సీపీ నేతలు క్రమం తప్పకుండా దూరంగా ఉండటం, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభకు రాబోమని తెగేసి చెప్పారు. వైఎస్సార్సీపీకి శాసనసభలో 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా, జగన్ మినహా అందరూ  హాజరుకాకుండానే ప్రజాధనం నుంచి జీతభత్యాలు పొందుతున్నారు. అందుకే  నో వర్క్ - నో పే అనే విధానం గురించి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ చాలా సార్లు చర్చించారు. 

Continues below advertisement

 ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు చట్టం ఏం చెబుతోంది?  

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం.. ఒక శాసనసభ సభ్యుడు సభ ముందస్తు అనుమతి లేకుండా వరుసగా  60 రోజుల పాటు అన్ని సమావేశాలకు గైర్హాజరైతే, ఆ స్థానాన్ని ఖాళీగా ప్రకటన చేసే అధికారం అసెంబ్లీకి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక సాంకేతిక అంశం ఉంది. ఈ 60 రోజుల సమయాన్ని లెక్కించేటప్పుడు, సభ వాయిదా పడిన సమయాన్ని లేదా వరుసగా 4 రోజుల కంటే ఎక్కువ రోజులు సభ లేని కాలాన్ని మినహాయిస్తారు. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు ఏడాదికి 15 నుండి 20 రోజులకు మించి జరగవు. కాబట్టి కేవలం సమావేశాలకు రాలేదనే కారణంతో రాజ్యాంగబద్ధంగా 60 రోజుల గైర్హాజరును నిరూపించి అనర్హత వేటు వేయడం కొంత సమయంతో కూడుకున్న ప్రక్రియ.

Continues below advertisement

 స్పీకర్ అధికారం,  రూల్ బుక్ ఆధారంగా చర్యలు 

కేవలం రాజ్యాంగంలోని 60 రోజుల నిబంధనే కాకుండా, ఏపీ శాసనసభ నిర్వహణ నిబంధనల ప్రకారం స్పీకర్‌కు విస్తృతమైన అధికారాలు ఉంటాయి. సభను ,  రాజ్యాంగ వ్యవస్థను అవమానించేలా "మేము అసెంబ్లీకి రాము" అని బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి రికార్డెడ్ వ్యాఖ్యలు చేయడం, ప్రజాప్రతినిధిగా ప్రమాణం చేసి కూడా సభ పట్ల బాధ్యతారాహిత్యంగా ఉండటాన్ని సభా హక్కుల ఉల్లంఘన  కింద పరిగణించే అవకాశం ఉంది. ప్రివిలేజ్ కమిటీ ద్వారా విచారణ జరిపి, నోటీసులు ఇచ్చి, నిర్ణీత గడువులోగా హాజరు కాకపోతే సభ్యత్వాన్ని రద్దు చేసే దిశగా స్పీకర్ ముందడుగు వేయవచ్చు.

 నో వర్క్ - నో పే  .. జీతభత్యాల కోత పెడతారా? 

అనర్హత వేటు కంటే ముందు ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న ప్రధాన ఆయుధం నో వర్క్ - నో పే.  సభకు హాజరు కాకుండా ప్రజాధనం నుంచి జీతాలు, భత్యాలు తీసుకోవడం నైతికంగా తప్పని ఇప్పటికే స్పీకర్ కార్యాలయం భావిస్తోంది. ఒకవేళ సభ్యులు సభకు రాకపోతే వారి అలవెన్సులు, పెన్షన్ లేదా జీతాలను నిలిపివేస్తూ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఇది పొలిటికల్ ,  లీగల్ చెక్-మేట్ అవుతుంది. జీతాలు ఆపేస్తే.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించక తప్పదు, అప్పుడు సభకు ఎందుకు వెళ్లడం లేదో కోర్టుకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.

 కూటమి ప్రభుత్వం ధైర్యం చేస్తుందా? 

వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి కూటమి ప్రభుత్వం   సిద్ధంగా ఉందా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ జగన్ సహా 11 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే, ఆయా నియోజకవర్గాల్లో 6 నెలల లోపు ఉపఎన్నికలు  నిర్వహించాల్సి వస్తుంది.  తమను అణచివేస్తున్నారని, కక్షసాధింపు చర్యలతోనే సభ్యత్వాలు రద్దు చేశారని వైసీపీ సానుభూతి పొందే ప్రమాదం ఉందనే అభిప్రాయం కూడా ఉంది. అయితే, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఉపఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం చేయలేరు కాబట్టి, వారిపై అనర్హత వేటు వేస్తే ఉపఎన్నికల్లో వారిని గెలిపించుకోవడానికి వైసీపీ ముప్పుతిప్పలు పడుతుందని, దాంతో వైసీపీ క్యాడర్ పూర్తిగా కుప్పకూలుతుందని మరో వ్యూహాత్మక వర్గం వాదిస్తోంది.

అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యేలకు ప్రజా మద్దతు లభిస్తుందా?

 ప్రజా సమస్యలను అసెంబ్లీ వేదికగా గొంతు విప్పి అడగాల్సిన ఎమ్మెల్యేలు.. కేవలం హోదా దక్కలేదనే నెపంతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని జీతాల రూపంలో దండుకోవడం ఎంతవరకు సమంజసమని  సోషల్ మీడియాలో అభిప్రాయం వినిపిస్తోంది.  సభకు రాని పక్షంలో రాజీనామా చేసి బయటకు రావాలని, లేదా ప్రభుత్వం వెంటనే వారి సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. శాసనసభ నిబంధనలను, రాజ్యాంగ సూత్రాలను పరిశీలిస్తే.. వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి స్పీకర్‌కు స్పష్టమైన మార్గాలు ఉన్నాయి. కాకపోతే అది కేవలం చట్టపరమైన నిర్ణయం మాత్రమే కాదు, రాజకీయ పరిణామాలకు దారితీసే అంశం. ప్రభుత్వం ముందస్తుగా  నో వర్క్ - నో పే  విధించి, ఆ తర్వాత నోటీసులు ఇచ్చి నిలదీసే వ్యూహంతో ముందుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.