Mancherial Latest News | లక్షెట్టిపేట (మంచిర్యాల): బీజేపీ పార్టీకి, ఎర్రబెల్లి రఘునాథ్ కి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్న బీఆర్ఎస్ నేత నడిపెల్లి విజిత్ కుమార్.. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకి విదేశాలలో ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తా అని ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని, ఆధారాలతో అంతా బటయపెడతా అన్నారు. లక్షెట్టిపేట పట్టణంలోని ఐబి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజిత్ కుమార్ మాట్లాడుతూ.. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు, రైతులు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నాయకత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బ్యాంకుకు కట్టిన 444 కోట్ల విషయాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టినా.. దీనిపై కంప్లైంట్ చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రేమ్ సాగర్ రావుకి, రఘునాథ్ రావుకి పెద్ద తేడా ఏం లేదని.. ఒకరు ఎమ్మెల్యే అయ్యారు, మరొకరికి పదవి రాకపోయినా ఇద్దరి వ్యక్తిత్వం ఒకటేనన్నారు.
కడెం ప్రాజెక్టు నుండి నీరు విడుదల చేపించిన ఘనత, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుది. బీఆర్ఎస్ పార్టీదని అన్నారు. కడెం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయకపోతే రైతులతో కలిసి పాదయాత్ర చేస్తామని హెచ్చరించడంతో ప్రభుత్వం భయపడి నీటిని విడుదల చేసిందన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఏ పని చేస్తే దానిని బిజెపి పార్టీ కాపీ కొడుతుందన్నారు. బిజెపి పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు లాంటి గొప్ప ప్రాజెక్ట్ కట్టి రైతులకు అందించి రైతును రాజు చేసింది దివాకర్ రావు అని అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు లాంటి గొప్ప ప్రాజెక్ట్ గత 25 సంవత్సరాల కాలంలో, తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలలో, ఇప్పటి 33 జిల్లాలలో ఒక్క ప్రాజెక్టు అయిన కట్టారా అని ప్రశ్నించారు.
విజిత్ కుమార్ చేసిన వ్యాఖ్యలివే..- నడిపెల్లి దివాకర్ రావు గురించి మాట్లాడే హక్కు బిజెపి నాయకులకు లేదు. లక్షెట్టిపేట మండలంలోని లక్ష్మీపూర్ నుంచి వెంకటరావుపేట వరకు 8 కోట్ల రూపాయలతోని బీటీ రోడ్డు వేయించారు. హనుమంతు పల్లి నుండి తలమల వరకు 10 కోట్లతోని బీటీ రోడ్ వేశారు. దండేపల్లి మండలంలోని వెళ్గానూర్ నుండి కొమ్ముగూడెం వరకు ఆరు కోట్లతో బీటీ రోడ్డు వేయించారు.- మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ, బిజెపి పార్టీ నాయకులు అందరూ తిరుగుతున్న రోడ్లు, గ్రామాల్లో వెలుగుతున్న లైట్లు, డ్రైనేజీలు ప్రతి పని బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి అని తెలుసుకోండి.
- దివాకర్ రావు ఎమ్మెల్యే కాకముందు తపలపూర్, రాజంపేట, హాజీపూర్ ఇలా కొన్ని ఊర్లకు తప్ప ఎక్కడ రోడ్లు లేవు. ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గమంతా BT రోడ్లతో కళకళలాడుతుంది. మంచిర్యాలకు మెడికల్ కాలేజ్ తెచ్చింది దివాకర్ రావు. లక్షెట్టిపేటను మున్సిపాలిటీ చేశారు. ఏర్పాటు చేసిన లక్షెట్టిపేట మున్సిపాలిటీని వార్డుకి కోటికి పైన కేటాయించి మున్సిపాలిటీనీ అభివృద్ధి చేశారు.
- మోడీ నియోజకవర్గం వారణాసిలో భక్తి పేరిట దోపిడీ జరుగుతుంది. దేశభక్తి ఎక్కువ ఉన్న పంజాబ్ లో బిజెపి అధికారంలోకి రాదు. దేవాలయాలు ఎక్కువగా ఉన్న తమిళనాడులో బిజెపి అధికారంలోకి రాదు. అక్షరాస్యత ఎక్కువగా ఉన్న కేరళలో బిజెపి అధికారంలోకి ఎందుకు అధికారంలోకి రాలేకపోతుంది. బిజెపి పాలిత ప్రాంతాల్లో వేసిన రోడ్లు ఒక్క వరద వస్తే కొట్టుకుపోయే పరిస్థితి. బ్రిడ్జిలు సంవత్సరం గడవకముందే కూలిపోతున్నాయి. అంటే కట్టడాల్లో ఎంత అవినీతి జరుగుతుందో ప్రజలందరూ ఆలోచించాలి.
- రైల్వే అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం కాజీపేట నుండి బల్లర్ష వరకు మంచిర్యాలలో దివాకర్ రావు కట్టించిన అండర్ బ్రిడ్జ్ అన్నిటికంటే అత్యుత్తమైన అండర్ బ్రిడ్జ్. అదే మోడీ గుజరాత్ లోని సూరత్ లో వచ్చిన వరదలకు అక్కడి వ్యాపారస్తులు 200 కోట్లు నష్టపోయారు. సూరత్ లో వరదలు వస్తే మాట్లాడని బిజెపి పార్టీ, అదే మంచిర్యాలలో వరదలు వస్తే మాత్రం ఇది దివాకర్ రావుని తప్పు పట్టడం మానుకోవాలి.
- అవినీతిలో బిజెపి పార్టీ అగ్రస్థానంలో ఉంటుంది. మొన్న జరిగిన పేపర్ లీకేజీ లో జెన్ జీ (Gen Z) పోరాటంతో పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేశారు. అంబేద్కర్ పేరు తీస్తే మీకు పుణ్యం రాదు. దేవుని పేరు తీస్తే మీరు స్వర్గానికి పోతారని ఓ సభలో కేంద్రమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాతను అవమానించారు.
- బిజెపి పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలని తహతహలాడుతుంది. 2028 ఎన్నికల్లో మళ్ళీ తెలంగాణలో, మంచిర్యాల గడ్డపై గులాబీ జెండా ఎగురుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో వచ్చాం, మా గ్రాఫ్ పెరిగిందని బీజేపీ నేతలు అంటున్నారు. కానీ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ కంటే బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు ఎక్కువ వచ్చాయి. మున్సిపల్,కార్పొరేషన్ ఎన్నికల కోసం బిజెపి పార్టీ పంపించిన ఎన్నికల ఫండ్ మాయం చేశారని సొంత పార్టీ నేత రఘునాథ్ గురించి అన్న విషయం నిజం కాదా.
- సేవా భారతి సంస్థ వచ్చిన డబ్బులు, CSR ఫండ్ వేరే దగ్గర వస్తే వివేకానంద్ ఫోటో పెట్టి బ్యాగులను స్కూల్ పిల్లలకు పంపిణీ చేస్తూ బ్యాగు లోపల తన ఫోటో పెట్టుకుంటున్న రఘునాథ్ హైదరాబాదులోని తమ స్కూల్లో 10 మంది పేద విద్యార్థులకైనా ఉచిత విద్య అందిస్తున్నారా.
Also Read: Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
- దివాకర్ రావు నాయకత్వంలోప్రజలకు జవాబుదారీగా ఉన్నాం. బాధ్యతగా పని చేయాలన్నదే మా ఉద్దేశం. బీఆర్ఎస్ పై అసత్య ఆరోపణలు మానుకుని, మేం అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు ఉంటే బయటపెట్టండి. మీలాగా ఎమ్మెల్యేతో మంచిర్యాలలో కుస్తీ, హైదరాబాదులో దోస్తీ చేయడం లేదు.
- ఎమ్మెల్యేకి హైదరాబాదులో ఉన్న దోస్తీ కారణంగానే.. మీ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం లేదు. మా కార్యకర్తల్ని ఇబ్బందిపెడితే రోజంతా పోలీసు స్టేషన్లో కూర్చొని కంటికి రెప్పలా కాపాడుకున్నాం. మంచిర్యాలలో బీజేపీ, కాంగ్రెస్ రెండు ఒకటే. కేవలం పైకి చూడడానికి మాత్రమే వేరువేరు పార్టీలు అన్నారు.
