YSRCP Protest On DSC Irregularities: ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిరుద్యోగ విద్యార్థి జేఏసీ ప్రతినిధులో సమావేశమై పార్టీ అధినేత వైఎస్ జగన్, అభ్యర్థుల భవిష్యత్ కోసం తాము పోరాడతామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో గత ఏడాది నిర్వహించిన డీఎస్సీ -2025 నియామక ప్రక్రియలో అనే అవకతవకలు జరిగాయని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనికి మద్దతుగా నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు జగన్ను కలిశారు. ముఖ్యంగా డీఎస్సీ పరీక్షల నిర్వహణ తీరుపై ఫలితాల్లో నెలకొన్న అస్పష్టతపై వారు ఫిర్యాదు చేశారు. నిరుద్యోగుల విన్నపాన్ని సానుకూలంగా స్వీకరించిన జగన్, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమయ్యారు.
వైసీపీ ప్రధాన డిమాండ్లు ఇవే
ప్రభుత్వం ముందు వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ కీలకమైన డిమాండ్లు ఉంచింది. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై నిష్పాక్షికంగా సీబీఐ విచారణ జరిపించాలి. ఈ విఫల్యానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో భాగంగా నోటిఫికేషన్లో పదివేల పోస్టులు భర్తీ చేయాలి. పోలిస్ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 35ఏళ్లకు పెంచాలి. ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయల భృతి ఇవ్వాలి. బకాయిపడిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అభ్యర్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి వైఎస్ఆర్సీపీ భారీ ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఇవాళ రేపు(ఆగస్టు7,8) అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ఆగస్టు 10న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, నిరుద్యోగ యువత, ప్రజా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ నెల 10 తర్వాత ప్రభుత్వం స్పందించకుంటే తదుపరి పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని వైసీపీ నేతలు వెల్లడించారు.
మరోవైపు గురువారం పలు ప్రాంతాల్లో జరిగిన నిరసనల్లో అధికార పార్టీ నేతలు తమపై దాడులు చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. ముఖ్యంగా విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షా శిబిరంపై దాడి చేశారని అన్నారు. టెంట్లు పీకడం, మహిలా కార్యకర్తలపై రాళ్లు, కోడిగడ్లు విసరడం వంటి ఘటనలను మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. పోలీసుల సమక్షంలో దాడులు జరగడం, నిరసనకారులనే అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.
