MLAs Joinings in Telangana Congress  :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒకరొకరుగా పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరారు. పదకొండో ఎమ్మెల్యే కూడా చేరబోతున్నారని ఓ సారి హడావుడి చేశారు. ఇంకా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల్లోపు బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుందని ఆ పార్టీలో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఉండరని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వరకూ గంభీరమైన ప్రకటనలు చేశారు. కేసీఆర్‌కు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. ముగిశాయి.. ప్రతిపక్ష నేత హోదాలో ఓ సారి కేసీఆర్ సభకు వచ్చి వెళ్లారు. కానీ మరో ఎమ్మెల్యే చేరిక మాత్రం జరగలేదు. 


బీఆర్ఎస్ ఎల్పీ విలీనం  లేనట్లే


భారత రాష్ట్ర సమితి ఎల్పీని విలీనం  చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా తీవ్రంగా ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నం సఫలం కాలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది  రేవంత్ తో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నారు కానీ.. పార్టీలో చేరే విషయంలో మాత్రం ఏ విషయం చెప్పడం లేదు. రేవంత్ సీఎం కాబట్టి  ఆయనను ధిక్కరించలేరు.. అలాగని పార్టీలో చేరిపోతామని కూడా చెప్పడం లేదు. అనివార్య పరిస్థితుల్లో కొంత మంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అలాంటి వారు పది  మంది ఉన్నారు. మరో పదిహేను మందిని అయినా చేర్చుకుంటే తప్ప.. ఎల్పీ విలీనం కాదు. ఆ పదిహేను మంది ఎమ్మెల్యేలు తమతో  టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వారెవరో మాత్రం.. క్లారిటీగా లేదు. అయితే కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడిందని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..విలీనమయ్యే స్థాయిలో కాంగ్రెస్‌‌లలో చేరే పరిస్థితి లేదని క్లారిటీ వచ్చేసినట్లయింది. 


అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలనం, అక్బరుద్దీన్ ఒవైసీని డిప్యూటీ సీఎం చేస్తానని హామీ


బీజేపీ, బీఆర్ఎస్‌ మధ్య డీల్‌పై ప్రచారమే కీలక కారణం


వచ్చే కొద్ది నెలల్లో తెలంగాణ రాజకీయాలు మారిపోతాయని ఓపిక పట్టాలని పార్టీ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పెద్దలు సర్ది చెబుతున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో జరుగుతున్న చర్చల గురించి బీఆర్ఎస్ పెద్దలు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. కొద్ది నెలల్లో ప్రభుత్వాన్ని మార్చేద్దామన్న నమ్మకం కలిగేలా పార్టీ ఎమ్మెల్యేలకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం లేదా పొత్తుల గురించి ఎంతగా ప్రచారం జరిగుతున్నా మౌనం అర్థాంగీకారం అన్నట్లుగా రెండు పార్టీల నేతలు మౌనంగా ఉంటున్నారు. అసలు అలాంటిదేమీ లేకపోతే మరో మాట లేకుండా ఖండించేవారు. అలాంటి ఖండన ప్రకటనలు రాకపోవడంతో నిజంగానే చర్చలు జరుగుతున్నాయన్న నమ్మకంతో ఎమ్మెల్యేలు ఉన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత.. ఇలాంటి పరిస్థితి వస్తే.. ఇబ్బంది పడతామని జరిగే పరిణామాలను బట్టి వేచి చూడాలని అనుకుంటున్నారు. ఈ కారణంగా చేరికలు కాంగ్రెస్ అనుకున్నంత జోరుగా సాగలేదు. 


ఏడాది చివరిలోపు స్థానిక ఎన్నికలూ పూర్తి - రేవంత్ పక్కా ప్లాన్‌తో వెళ్తున్నారా ?


కొంటున్నామని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారం 


మరో వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఐదు నుంచి పది కోట్లకు కొంటున్నామని అంత కంటే ఎక్కువ ఖరీదు పెట్టడం లేదని .. చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని నమ్మి తాము పార్టీలో చేరితే.. తామేదో డబ్బులకు అమ్ముడుపోయామన్నట్లుగా ప్రచారం చేయడం ఏమిటని వారు అసంతృప్తికి గురవుతున్నట్లుగా చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో చేశారో కానీ.. వచ్చిన ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరి అమ్ముడుపోయామన్న పేరు తెచ్చుకోవడం ఎందుకని  సైలెంట్ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ రాజకీయాలు ఎప్పటికప్పుడు భిన్నంగా ఉంటాయి. అలాంటి పార్టీలో చేరాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితిని కల్పిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తంగా ఇప్పుడు స్థానిక ఎన్నికలపై ఆలోచన చేయాల్సిందే కానీ...ఇక చేరికల గురించి వద్దని కాంగ్రెస్ పెద్దలు కూడా ఓ నిర్ణయానికి వస్తున్నారు.