Why suddenly YS Jagan is going towards India alliance : వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకూ జాతీయ రాజకీయాల్లో  భారతీయ జనతా పార్టీకి హార్డ్ కోర్ సపోర్టర్ గా ఉన్నారు. స్పీకర్ అభ్యర్థిని నిలబెడితే అడగకుండానే మద్దతిచ్చారు. టీడీపీ, జనసేన ఉన్నందున ఎన్డీఏ కూటమికి మద్దతివ్వడం ఎందుకన్న  ఆలోచన చేయలేదు. అంశాల వారీగా తమ మద్దతు  బీజేపీకి ఉంటుందన్నారు. రెండు రోజుల కిందట విజయసాయిరెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు. అయితే హఠాత్తుగా బుధవారం సీన్ మారిపోయింది. జగన్ కోసం ఇండీ కూటమి నేతలంతా తరలి వచ్చారు. మద్దతు పలికారు. అందరూ ఇండియా కూటమిలోకి రావాలని జగన్ కు ఆహ్వానం పలికారు. 

 

వ్యూహాత్మకంగానే జగన్‌కు ఇండీ కూటమి నేతల సంఘిభావం

 

ప్రజాదర్భార్ ప్రారంభిస్తానని చెప్పిన రోజున జగన్ కాలు నొప్పికి చికిత్స కోసం అని బెంగళూరు వెళ్లిపోయారు. వారం రోజుల తర్వాత వినుకొండలో జరగిిన ఓ హత్య ఘటనను రాజకీయంగా మార్చేసి.. ఏపీలో అరాచకాలపై ఢిల్లీలో ధర్నా ప్రకటించేశారు. కలసి వచ్చే  పార్టీలను కలుపుకుంటామని ప్రకటించారు. జగన్ ఢిల్లీలో ధర్నా చేయగానే ఇండీ కూటమి నేతలంతా ఒకరి తర్వాత ఒకరు వచ్చి మద్దతు పలికారు. అంటే. .. జగన్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఇండీ కూటమిలో చేరికపై చర్చలు జరిగాయని ఆ ఫలితంగానే.. ఢిల్లీ ధర్నా ప్రణాళిక రూపుదిద్దుకుందని భావిస్తున్నారు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి బుధవారం నుంచి అనధికారికంగా ఇండీ కూటమి మిత్రపక్షంగా మారారు. పార్లమెంట్ సమావేశాలకు ముుందు ఆల్ పార్టీ మీటింగ్‌లో విపక్షాలుక డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఇవన్నీ వైసీపీ ప్రణాళికా బద్దంగా చేసుకుంటూ వచ్చిన రాజకీయం అనుకోవచ్చు. 


 

ఇప్పటికిప్పుడు ఇండీ కూటమికి దగ్గరవడానికి కారణం షర్మిల !

 

జగన్మోహన్ రెడ్డి ఇప్పటికిప్పుడు ఇండీ కూటమికి దగ్గరవడానికి కారణం షర్మిల అని రాజకీయవర్గాలు అంచనా  వేస్తున్నాయి. షర్మిల ఏపీ పీసీసీ  చీఫ్ గా ఉన్నారు. వైఎస్ వారసురాలిగా ఆమె తనదైన రాజకీయం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమలో పలు చోట్ల వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడానికి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లే కారణం. 2019 ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ పోటీ చేసిందో లేదో ఎవరికీ తెలియదు. కానీ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పోటీ చేయడంతో రాయలసీమలో  ముస్లిం మైనార్టీలు, దళితుల ఓట్లు కాంగ్రెస్ వైపు వెళ్లాయి. జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దగ్గరయ్యారని ఆ పార్టీతో అనధికారిక పొత్తులు పెట్టుకున్నాని నేరుాగానే షర్మిల విమర్శిస్తున్నారు. జీవితాంతం కాంగ్రెస్ తో ఉన్న వైఎస్‌కు.. బీజేపీతో  నడుస్తున్న జగన్ రాజకీయ వారసుడు కాలేరని అంటున్నారు. అదే సమయంలో బీజేపీతో దగ్గరగా ఉన్నట్లుగా కనిపించడం వల్ల దళితులు, మైనార్టీలు జగన్ పై అసంతృప్తిగా ఉన్నారు. వారందర్నీ కాంగ్రె్స్ వైపు మళ్లించేందుకు షర్మిల తన వంతు ప్రయత్నాలను గట్టిగా చేస్తున్నారు. షర్మిల రాజకీయంలో జగన్ కన్నా షార్ప్ గా ఉన్నారని రాజకీయవర్గాలు ఇంతకు ముందే తేల్చాయి. ఆమెకు ప్రత్యేకంగా సలహాదారులు అవసరం లేదు.. స్క్రిప్టు అవసరం లేకుండా రాజకీయ ప్రసంగాలు ఇస్తున్నారు. సమస్యలపై చురుగ్గా స్పందిస్తున్నారు. బీజేపీతో వైసీపీ సంబంధాలు ఇలాగే కొనసాగితే.. దళిత , మైనార్టీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు వెళ్లిపోతుందని అంటున్నారు. అదే జరిగితే వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. మరోసారి అధికారంలోకి రావాలన్న కల నెలవేరదు. అందుకే జగన్ వ్యూహాత్మకంగా ఇండీ కూటమి వైపు మొగ్గుతున్నారని  భావిస్తున్నారు. 


 

కేసులతో సానుభూతి రాజకీయం చేయవచ్చన్న ఆలోచన !

 

జగన్మోహన్ రెడ్డి ఇంత కాలం బీజేపీకి దగ్గరగా ఉండటానికి కారణం ఆయన వెనుక ఉన్న కేసుల  లగేజీ అని ఎక్కువ మంది  భావిస్తున్నారు. బీజేపీ కన్నెర్ర చేస్తే ఆయన బెయిల్ రద్దవుతుందని..కేసుల్లో విచారణ వేగం పుంజుకుంటుందని చెబుతారు. అంతేనా వివేకా హత్య కేసులో సీబీఐకి ఇంకా  ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఆయన పేరు కూడా బయటకు వచ్చే ప్రమాదం ఉందని చెబుతారు. ఇక అధికారం పోయినందున టీడీపీ ప్రభుత్వం ఇసుక, లిక్కర్ స్కాంలతో పాటు జరిగిన అనేక ఆర్థిక అవకతవకల్ని వెలికి తీసేందుకు రెడీ అవుతోంది. తమ పార్టీని భూస్థాపితం చేస్తామని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అలాంటివి ఏదో ప్రణాళికలు ఉన్నాయని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే బీజేపీతో దగ్గరగా ఉండటం కన్నా.. ఇండీ కూటమికి దగ్గరవడం వల్ల.. వచ్చే పరిణామాలను ఎదుర్కోవచ్చని అనుకుంటున్నారని భావింవచ్చు. ఆయా పార్టీలు తనకు మద్దతివవడంతో పాటు ప్రజల్లో సానుభూతి  కూడా వస్తుందని అనుకుంటున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. 

 

భారీ ఓటమితో భవిష్యత్ లో తాను ఎదుర్కోబోయే గడ్డు పరిస్థితులపై జగన్ మోహన్ రెడ్డికి అవగాహన ఉంది. వాటిని ఎదుర్కోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నరని అనుకోవచ్చు.