AP MLC Elections : ఆంధ్రప్రదేశ్‌లో టీచర్స్, గ్రాడ్యూయేట్స్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు టీచర్స్, మూాడు గ్రాడ్యూయేట్ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి. ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి పెద్ద ఎత్తున ఫేక్ ఓట్ల ఆరోపణలు వస్తున్నాయి. విపక్ష పార్టీలకు చెందిన నేతలు ఈ నకిలీ ఓటర్ల విషయాన్ని సాక్ష్యాలతో సహా మీడియా ముందు చూపిస్తున్నారు. అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఈ దొంగ ఓట్లపై విస్తృతంగా ఉద్యమం చేస్తున్నాయి. 


తిరుపతిలో వేలల్లో దొంగ ఓట్లు !


తిరుపతిలో వేలల్లో దొంగ ఓట్లు ఉన్నాయని టీడీపీ , బీజేపీ నేతలు చెబుతున్నారు. ఒకే వ్యక్తికి అనేక మంది తండ్రుల పేర్లు పెట్టి ఓటు నమోదు చేయడం.. ఓకే మహిళకు అనేక మంది భర్తల పేర్లు పెట్టి ఓట్లు నమోదు చేయడం వంటివి బయటపడ్డాయి. అలాగే వైఎస్ఆర్‌సీపీ ఆఫీస్ తో పాటు అసలు పట్టభద్రులే లేని ఇంటి నెంబర్‌తో పెద్ద ఎత్తున ఓట్లు నమోదు కావడం  సంచలనంగా మారింది. ఆధారాలతో వీటిని విపక్ష నేతలు బయట పెడుతున్నారు. అడ్డదారుల్లో గెలిచేందుకు అధికార పార్టీ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల సాయంతో ఇలాంటి దొంగ ఓట్లను సృష్టించిందన్న ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణల విషయంలో ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా స్పందించలేదు. తాను న్యాయపోరాటం అయినా చేస్తామని విపక్ష పార్టీలు అంటున్నాయి. 


ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎంతో అవగాహన ఉండాలి !


ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడం అంటే.. సాధారణ ఎన్నికల్లో మీట నొక్కినట్లుగా ఉండదు. గతంలో గ్రాడ్యూయేట్ ఎన్నికల్లోనే ఇరవై వేల వరకూ చెల్లని ఓట్లు తేలాయి. అంటే.. ఓటు వినియోగం విషయంలో ఎంత గందరగోళం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే కౌంటింగ్ విషయంలోనూ అంతే. మెజార్టీ ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటించరు. యాభై శాతం ఓట్లు తెచ్చుకుంటేనే గెలుపు. 50 శాతం ఓట్లు రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తప్పనిసరి అవుతుంది.  2017 లో జరిగిన ఎన్నికలలో రాయలసీమ పశ్చిమ నియోజకవర్గ ఎన్నికలను ఉదాహరణ గా తీసుకోవాలి. అప్పుడు పట్టభద్రుల కోటా ఎం ఎల్ సీ పదవికి జరిగిన ఎన్నికల్లో మొత్తం 1,55,711 ఓట్లు పోలయ్యాయి. అందులో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపాలరెడ్డి కి మొదటి ప్రధాన్యతా క్రమంలో 50 శాతం కన్నా తక్కువగా 65,889 ఓట్లు లభించాయి. అప్పుడు రెండో ప్రాధాన్యత కింద వచ్చిన 1,998 ఓట్లు కలపడంతో ఆయన గెలుపొందారు. దీన్ని బట్టి ఎం ఎల్ సి ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓటు విలువ ఎంతో అర్ధం అవుతుంది. 


పోలింగ్ బూత్ లలో సీనియర్ నేతలను ఏజెంట్లుగా కూర్చోబెట్టాలని నిర్ణయం ! 


ఈ నెల 13వ తేదీన రాయలసీమ తూర్పు, పశ్చిమ శాసనమండలి పట్టభద్రుల, ఉపాధ్యాయుల కోటా సీట్ల విషయం లో మొదటి ప్రాధాన్యత ఓటుకు దీటుగా రెండో ప్రాధాన్యత ఓటు విలువ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోటీదారులు ఎందరున్నా బలబలాల కోణంలో లో పట్టభద్రుల కోటా సీటుకు వై ఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రోగ్రెస్సివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీ డీ ఎఫ్ ) అభ్యర్థులకు నడుమ హోరాహో్రీ పోరు జరగ నున్నది. టీచర్ల కోటా సీటు కు పోటీ చేయని తెలుగుదేశం ఇండిపెండెంట్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. తాజాగా వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని ఓడించాలనే లక్ష్యం తో తెలుగుదేశం, పీ డీ ఎఫ్ ల మధ్య అంగీకారం కుదిరింది. అదేమిటంటే తొలి ప్రాధాన్యత ఓటు తమ అభ్యర్థి కి వేసుకుని, మలి ప్రాధాన్యత ఓటు ఒకరికి ఒకరు వేసుకునేలా వ్యూహ రచన చేసుకున్నారు. అదే సమయంలో భారీగా దొంగ ఓట్లు నమోదు చేసినందున పోలింగ్ బూత్‌లలో సీనియర్లను కూర్చోబెట్టి ఇలాంటి వారు ఓటు వేయకుండా నిరోధించాలని అనుకుంటున్నారు. 
 
ద్వితీయ ప్రాధాన్య ఓట్లపైనా గురి !


మొత్తం పోల్ అయ్యే ఓట్లలో 50 శాతం ఓట్లు వై ఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు రాక పొతే జరిగే రెండో ప్రాధాన్యత ఓట్లు వారి విజయాన్ని నిర్దేశించే స్థాయికి వస్తాయి. ఇప్పుడు పోటాపోటీగా ఓటర్లను చేర్పించిన ప్రధాన అభ్యర్థులు అత్యధికంగా తమకే ఓట్లు వచ్చేలా చూసుకోవాల్సి వస్తుంది. వీరిలో మొదటి స్థానం లో నిలవడానికి 50 శాతం ఓట్లు తప్పనిసరి అవుతాయి. లేకుంటే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పై ఆధార పడక తప్పదు. అటు వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు , ఇటు తెలుగుదేశం, పీ డీ ఎఫ్ అభ్యర్థులు ఎక్కువగా ఓటింగ్ శాతం పెరగడానికే కాక అందులో 50 శాతం ఓట్లు తగ్గకుండా తమకు ఓట్లు వచ్చేలా చూసుకోడానికి పాట్లు పడుతున్నారు.