అమరావతి: వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు రాజ్య సభ ఎంపీ మోపిదేవి వెంకట రమణ పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ అయ్యారు. మరో రెండు రోజుల్లో టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు పోతుల సునీత పార్టీకి రాజీనామా కూడా చేసేశారు. ఇదే బాటలో మరికొంత మంది వైసీపీ ఎమ్మెల్యే లు, ఎంపీలు ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా ప్రచారం జరుగుతోంది.


జగన్ కు షాక్ ఇవ్వబోతున్న మోపిదేవి వెంకట రమణ


వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహిత మిత్రుడు గా పేరున్న మోపిదేవి వెంకటరమణ గత కొంతకాలం నుంచి తీవ్ర అసహనంతో అన్నారు. జగన్ తో పాటు జైలుకు సైతం వెళ్లి వచ్చిన ఆయన 2019 లో మత్స్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం జగన్ చేసిన మార్పుతో రాజ్యసభ ఎంపీ అయ్యారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక వేరే వ్యక్తుల అజమాయిషీ ఎక్కువైంది అనేది ఆయన ఫీలింగ్ గా మోపిదేవి సన్నిహితులు చెబుతుంటారు. పేరుకు బీసీల పార్టీ అని చెబుతారు. కానీ కొంతమంది రెడ్ల డామినేషన్ ఎక్కువైపోయింది అని జగన్ తో పాటు జైలుకు వెళ్లి వచ్చింది తామైతే.. ఇప్పుడు బయటినుండి వచ్చిన వాళ్ల ఒత్తిడి తనపై ఎక్కువైంది అని తన ఇన్నర్ సర్కిల్ లో ఉండే వారివద్ద బాధపడ్డట్టు చెబుతుంటారు. దానితో పార్టీ మారడమే బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్టు రేపు లేదా ఎల్లుండి  వైసీపీ పార్టీకి రాజీనామా చేసి త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్నారు ఈ బీసీ నాయకుడు.


వైసీపీకి రాజీనామా చేసేసిన పోతుల సునీత


ఎమ్మెల్సీ పోతుల సునీత ఆల్రెడీ వైసీపీ పార్టీకి రాజీనామా చేసేశారు. గతంలో టీడీపీ నుండి వైసీపీకి వెళ్ళిన ఆమెకు ఎమ్మెల్సీ పదవి దక్కింది.. అయితే 2024 ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తరువాత ఆమె కాస్త సైలెంట్ గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా వైసీపీ కు గుడ్ బై చెప్పేశారు. త్వరలో ఆమె కూడా మళ్ళీ టీడీపీ లోకి వెళ్ళిపోయే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు ఆమె సన్నిహితులు.


అదే రూట్ లో మరికొందరు ఎంపీలు ఎమ్మెల్యేలు
వైసిపి పార్టీకి చెందిన మరికొందరు ఎంపీలు , ఎమ్మెల్యేలు కూడా జంప్ జిలానీ కావడానికి సన్నద్ధం అవుతున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిందే 11 మంది ఎమ్మెల్యే సీట్లు. వారిలో జగన్ మినహా ఉన్నది 10 మంది ఎమ్మెల్యేలు. మరి వారిలో ఎంతమంది పార్టీ మారే ఆలోచనలో ఉన్నారో తెలియాలంటే కాస్త వేచి చూడాలి. అలాగే ఎంపీలు సైతం ముఖ్యంగా రాజ్యసభ నుండి ఎవరెవరు పార్టీ నుండి జంప్ అవుతారు అన్నది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఆశక్తి కరంగా మారింది. అన్నట్టు వీరిలో సింహభాగం టీడీపీ వైపే చూస్తున్నా .. కొందరు మాత్రం జనసేన , బీజేపీల బాట పట్టేందుకు కూడా ఎదురు చూస్తున్నట్టు ఆయా పార్టీల వర్గాలు చెబుతున్నాయి 


అసలు చంద్రబాబు స్కెచ్ ఏమిటి??


ఆ జంపింగ్ జపాంగ్ లను చంద్రబాబు ఎందుకు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. గతంలో వైసీపీ నుండి ఎమ్మెల్యే లను చేర్చుకుని 2019 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారు చంద్రబాబు. 2014 ఎన్నికల్లో ఇంచుమించు అలాగే కుదేలయ్యారు జగన్ మోహన్ రెడ్డి. మరి ఏ దైర్యంతో ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది కూటమి పార్టీలంటే కనపడుతున్న ఒకేఒక సమాధానం నియోజక వర్గాల పెంపు.


2029 నాటికి పెరగనున్న నియోజక వర్గాల సంఖ్య
ప్రస్తుతం ఏపీలో 175 అసెంబ్లీ నియోజక వర్గాలు 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. వీటిని పెంచాల్సిన అవసరం ఉందని చాలా ఏళ్లుగా కేంద్రాన్ని అడుగుతోంది ఏపీ. అయితే  2029 వరకూ అది కుదిరేపని కాదని చెప్పిన కేంద్రం గడువు దగ్గర పడుతున్నకొద్దీ ఆ దిశగా అడుగులు వేస్తోంది . త్వరలోనే ఏపీ లో నియోజక వర్గాల సంఖ్య మరో 50 పెరిగి 225 కు చేరుకోనుంది. అప్పుడు రాష్ట్రం లో గెలుపు ఓటముల ఈక్వేషన్స్ మారిపోతాయి. కాబట్టి ఇప్పటినుండే ప్రామినెంట్ లీడర్ల ను పార్టీ లోకి ఆహ్వానించే పనిలో పడ్డారు చంద్రబాబు. ఎలాగూ నియోజక వర్గాలు పెరుగుతాయి కాబట్టి క్రొత్త వాళ్ళు వచ్చినా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరిగే అవకాశం చాలా తక్కువ. అందుకే మాష్టర్ ప్లానర్ గా పేరొందిన చంద్రబాబు ఈ వ్యూహం పన్నారు అంటున్నాయి రాజకీయ వర్గాలు. మరి అవి ఏ మేరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి అంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.


Also Read: Allu Aujun: 'అల్లు అర్జున్‌కు మా పార్టీకి ఎలాంటి శత్రుత్వం లేదు' - మరోసారి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు