YS Viveka murder case :  " త్వరలోనే న్యాయం గెలవబోతోంది.  ఇన్నేళ్ల నిరీక్షణకు సత్ఫలితాలు రానున్నాయి.  త్వరలోనే దోషులకు శిక్ష పడనుంది.  ఈ కేసులో సీబీఐ చేయాల్సింది చాలా ఉంది. హత్యలు చేయించిన వారు చట్టసభల్లో ఉండకూడదు. ’’ అని   వైఎస్ వినేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత అమరావతిలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితతో  సమావేశం  తర్వాత వ్యాఖ్యానించారు. తన తండ్రి హత్య కేసులో చివరికి  నిందితులకు శిక్ష పడుతుందని ఆమె  గట్టి  నమ్మకానికి వచ్చారు. సునీతకు అంత నమ్మకం ఎలా కలుగుతోంది ?. ఏపీ ప్రభుత్వం ఈ కేసులో కొత్తగా ఏమైనా చేయబోతోందా ? 


వివేకా కేసు ప్రస్తుతానికి ఎక్కడిదక్కడే !


వైఎస్ వివేకా  హత్య కేసు ప్రస్తుతానికి ఎక్కడిదక్కడే ఉంది. సుప్రంకోర్టు గతంలో గత ఏడాది జూన్ 30 తేదీలోపు దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. ఆ మేరకు సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి వివరాలను సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్‌‌లో సమర్పించింది. అయితే ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ చెబుతోంది. అ అంశంపై ఇంకా సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అదే సమయంలో వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి, గంగిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ సునీత దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉంది. ఇంకా విచారణకు రాలేదు. సీబీఐ కోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతున్నా ఇంకా పూర్తి స్థాయి ట్రయల్ ప్రారంభం కాలేదు. నిందితులకు బెయిల్ కూడా లభించడం లేదు. తాజాగా కీలక నిందితునిగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు. అంతకు ముందు తనను నిందితుడు, అనుమానితుడు జాబితా నుంచి  తొలగించి సాక్షుల జాబితాలో చేర్చాలని దాఖలైన పిటిషన్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. 


గెలవడానికి కాదు బొత్సను ఆపడానికే - విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక పోటీ వెనుక జగన్ ప్లాన్ ఇదేనా ?


మరో సారి సీబీఐ విచారణ కంటిన్యూ అవుతుందా ?


సీబీఐ ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉన్నదని చెబుతోంది. ఇప్పటికైతే సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో అప్పటి వరకూ వివరాలు సమర్పించి సైలెంట్ గా ఉన్నారు. సుప్రీంకోర్టు నుంచి వచ్చే తదుపరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయంలో నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడేలా చూడాలన్న లక్ష్యంతో ఉన్న వైఎస్ సునీత సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్లతో వాదనలు వినపిస్తున్నాయి. ఈ క్రమంలో సునీత.. సుప్రీంకోర్టులో సీబీఐ విచారణకు మరి కొంత సమయం ఇవ్వాలని కోరే అవకాశాలు ఉన్నాయి. అమరావతిలో సునీత మాట్లాడినప్పుడు ఈ కేసులో ఇంకా సీబీఐ చేయాల్సింది చాలా ఉందని చెప్పారు. అంటే ఆ దిశగా ఆమె కొత్త ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. 


ఏపీ ప్రభుత్వం నుంచి ఈ సారి పూర్తి స్థాయి సహకారం !


ఏపీలో ప్రభుత్వం మారింది. అయితే విచారణ ప్రభుత్వం చేతుల్లో లేదు. కనీసం విచారణ జరిగే కోర్టులు కూడా ఏపీలో లేవు. అయితే.. హత్య జరిగింది ఏపీలో  కాబట్టి.. దర్యాప్తునకు ప్రభుత్వ సహకారం పూర్తి స్థాయిలో అవసరం ఉంది. గత ప్రభుత్వం ఏ మాత్రం సహకరించలేదన్నది బహిరంగసత్యం. దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల మీదనే కేసులు నమోదు చేశారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కర్నూలు పోలీసులు సహకరించకపోవడంతో అరెస్టు చేయలేకపోయారు. ప్రభుత్వంలోని పెద్దలు సీబీఐ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. చివరికి సునీత విచారణను తెలంగాణ హైకోర్టుకు మార్చాలని సుప్రీంకోర్టుకు వెళ్లి విజయం సాధించారు. కొత్తగా దర్యాప్తు చేసే విషయంలో సీబీఐకి ఎలాంటి సహకారం కావాలన్నా పూర్తి స్థాయిలో ఏపీ ప్రభుత్వం సహకరిస్తుంది. అందులో సందేహం లేదని అనుకోవచ్చు. 


తమిళనాడు రాజకీయాలపై రోజా మనసు మళ్లిందా? మాజీ మంత్రి మౌనానికి కారణమేంటి?


కేసు కొలిక్కి రావడం ఖాయమేనా ?


వైఎస్ వివేకా హత్య కేసులో రాజకీయ కోణాలు ఉన్నాయని సీబీఐ చెబుతోంది.  అందుకే ఈ కేసును వీలైనంత వేగంగా కొలిక్కి తీసుకు వచ్చి ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ దిశగా త్వరలో సీబీఐ మరోసారి విచారణ జరపడం.. ఈ సారి ఆటంకాలు లేకుండా వేగంగా దర్యాప్తు పూర్తి చేసి .. నిందితుల్ని జైుకు పంపడం ఖాయమని భావిస్తున్నారు. ఈ విషయంలో వచ్చే రెండు, మూడు నెలల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని అంచనా వేస్తున్నారు. వైఎస్ సునీత కూడా అదే నమ్మకంతో ఉన్నారు.