Chandrababu On Madanapally sub collector  office :  ఆదివారం అర్థరాత్రి మదనపల్లి సబ్ కెలెక్టర్ ఆఫీసులో అగ్నిప్రమాదం జరిగింది. కీలకమైన భూరికార్డులు ఉండే సెక్షన్‌లో ఓ ముఫ్పై ఫైళ్ల వరకూ తగలబడ్డాయి. ఈ విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. ఉదయం ఈ ఫైల్స్ తగలబడిపోయిన విషయం చంద్రబాబుకు తెలియగానే ఒక్క సారిగా సీరియస్ అయ్యారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం హడావుడిలో ఉన్నప్పటికీ డీజీపీని, ఇంటలిజెన్స్ చీఫ్ ను పిలిపించి  మాట్లాడారు. డీజీపీని అప్పటికప్పుడు మదనపల్లి వెళ్లాలని ఆదేశించారు. అదే సమయంలో సాయంత్రం మరోసారి సమీక్ష నిర్వహించారు. ఒక చిన్న అగ్నిప్రమాదంపై చంద్రబాబు ఇలా రెండు సార్లు సమీక్ష నిర్వహించడం, డీజీపీని  మదనపల్లికి  పంపడంతో ఈ అగ్నిప్రమాదం  వెనుక చాలా పెద్ద గూడు పుఠాణి ఉందని ఎవరికైనా అర్థమవుతుంది. అగ్నిప్రమాదం వెనుక కుట్ర ఉందని అదేమిటో తెలుస్తామని డీజీపీ ప్రకటించారు. కాలిపోయిన ఫైల్స్ ఏమిటన్నదానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. 


ఉద్దేశపూర్వకంగానే తగులబెట్టారు ! 


వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెత్తనం మొత్తం మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే. ఒక్క నగరిలో మినహా మిగతా మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలు ఆయన చెప్పినట్లుగా వినేవారే. మదనపల్లెలో ఎమ్మెల్యేగా ఉండే నవాజ్ భాషా కూడా అంతే. ఆ సమయంలో మదనపల్లె సబ్ డివిజన్‌లో పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ భూముల రికార్డులు మార్చడంతో పాటు కొన్ని ఆస్తులను నిషేధిత జాబితాను తొలగించడం.. కొన్ని ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడం వంటివి చేశారని ఆరోపణలు ఉన్నాయి . మొత్తం 25 అంశాలకు సంబంధించిన దస్త్రాలు దగ్ధమయ్యాయని కలెక్టర్ చెబుతున్నారు. అసలు ఆ కాలిపోయిన ఫైళ్లు ఏంటో గుర్తించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 


ఎట్టకేలకు అసెంబ్లీకి కేసీఆర్! బడ్జెట్ రోజున సభకు హాజరు కావాలని నిర్ణయం!


పెద్దిరెడ్డిపైనే గురి పెట్టారా ?


పెద్దిరెడ్డి చేసిన అక్రమాలను తెలియకుండా చేయడానికే ఫైళ్లను తగలబెట్టారన్న ఆరోపణలు బలంగా వస్తున్నాయి. మంత్రి అనగాని సత్యప్రసాద్ అదే చెప్పారు. ఈ మంటల వెనుక పెద్దిరెడ్డి కుట్ర ఉందని ఆ ఫైల్స్ లో ఎలాంటి సమాచారం ఉన్నా సరే.. ఆయన చేసిన తప్పుల్ని బయటకు తీయకుండా ఉండబోమని హెచ్చరించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి చేసిన వ్యాపారాలు, దంతాలపై పూర్తి సమాచారం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. చట్టరరంగా ఆయనను ఫిక్స్ చేయడానికి అవసరమైన చర్యలు ప్రారంభమయ్యాయని.. క్రమంగా కొలిక్కి వస్తున్నాయంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఆయనకి ప్రమేయం ఉన్న ఫైల్స్ కాలిపోవడం  అధికారవర్గాల్లోనూ అనుమానాలు రేకెత్తిస్తోంది. 


రాగానిపల్లె భూముల వ్యవహారంపై విమర్శలు 


పుంగనూరు మండలం రాగానిపల్లెలో 982 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరు మీదకు మార్చారు. లాంటి ఉత్తర్వులూ లేకుండానే 982 ఎకరాల భూమిని అధికారులు వేరే వ్యక్తులకు కట్టబెట్టారు.  సెటిల్‌మెంట్‌ ఉత్తర్వు లేకుండానే భూమిని పరాధీనం చేశారని ఇప్పటికే నిర్ధారించారు. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని 2022 ఏప్రిల్‌ 28న సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ ఆదేశాలు ఇచ్చారు. 74 ఏళ్లుగా వివాదంలో ఉన్న కేసును ఎలాంటి పత్రాలు పరిశీలించకుండానే ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేశారు. అనేక నిబంధనలు ఉల్లంఘించారు.  రాగానిపల్లెలోని 982 ఎకరాల భూమిపై రైత్వారీ పట్టాలు జారీ చేయడానికి ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. రాగానిపల్లెలో భూముల పరాధీనం వ్యవహారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలుగు చూసింది. తాజాగా తహసీల్దారు... సర్వే అండ్‌ సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ సిద్ధార్థజైన్‌ కోర్టులో రివిజన్‌ పిటిషన్‌ వేశారు. ఈ భూములన్నీ పెద్దిరెడ్డి బినామీల దగ్గరకు చేరాయని ఆరోపణలు ఉన్నాయి.


బాబాయ్ హత్యపై ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు - జగన్ కు షర్మిల సూటి ప్రశ్న


టీడీపీ టార్గెట్ పెద్దిరెడ్డి 


వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబును పెద్దిరెడ్డి చాలా ఇబ్బంది పెట్టారు. కుప్పంలో  చంద్రబాబును ఓడించడానికి ఆయన ఎంత ఖర్చు పెట్టారో లెక్కేయడం కష్టమని టీడీపీ వర్గాలు చెబుతాయి. మంత్రి పెద్దిరెడ్డి అండతో కుప్పంలో చంద్రబాబు పర్యటనలోనూ వైసీపీ నేతలు రాళ్లు వేశారు. గొడవలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అరాచకం సృష్టించారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. పెద్దిరెడ్డి అటు హిందూపురంలో బాలకృష్ణను ఓడించే  బాధ్యతలు కూడా తీసుకున్నారు. అక్కడ ఒక్కో సారి వారం రోజులకుపైగా మకాం వేసి టీడీపీ నేతలకు డబ్బులు ఆశ చూపి పార్టీలో చేర్చుకునేవారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక చంద్రబాబు అరెస్టుకు ముందు అంగళ్లులో జరిగిన రాళ్లదాడిలో చంద్రబాబుపై కుట్ర చేసి..ఆయనపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. పుంగనూరు దగ్గర జరిగిన అల్లర్లలో వందల మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టి అరెస్టులు చేశారు. ఇలాంటి పరిణామాలతో ఇప్పుడు టీడీపీకి పెద్దిరెడ్డి కీలకమైన టార్గెట్ అయ్యారు. ఈ కారణంగా పెద్దిరెడ్డి పుంగనూరులో పర్యటించలేకపోతున్నారు. ఆయన కుమారుడు పర్యటిస్తేనే రణరంగం అవుతోంది. 


చంద్రబాబునాయుడు చట్ట పరంగానే శిక్షిస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో  పెద్దిరెడ్డి అక్రమాలపై పూర్తి స్థాయి సమాచారం సేకరించి ఆయనను ఫ్రేమ్ చేయాలనుకుంటున్నారని.. అందుకే మనదనపల్లి ఫైర్ యాక్సిడెంట్ పై రెండు సార్లు సమీక్ష చేశారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ అంశంలో తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారనుంది.