ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కాంగ్రెస్‌లోకి తుమ్మల నాగేశ్వరరావును ఆహ్వానిస్తున్నారు ఆపార్టీ నేతలు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి తుమ్మల ఇంటికి వెళ్లి.. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీ చేరమని ఆయన్ను ఆహ్వానించారు. అయితే, ఖమ్మం జిల్లా ప్రజలు, అనుచరుల అభిప్రాయం మేరకే తాను నిర్ణయం తీసుకుంటానని తుమ్మల స్పష్టం చేశారు. 


తుమ్మల ఇంటికి వెళ్లి పొంగులేటి శ్రీనివాసరావు.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్‌లో చేరానన్నారు పొంగులేటి. కానీ, బీఆర్‌ఎస్‌... పొమ్మనలేక పొగబెట్టే కార్యక్రమం చేసిందని ఆరోపించారు ఆయన. ముందు తనను సాగనంపి.. ఇప్పుడు తుమ్మలను అవమానిస్తున్నారన్నారు. ఆయనే పార్టీలో నుంచి వెళ్లిపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్లు కూడా ఇవ్వకుండా ఇబ్బందిపెట్టిన రోజులు ఉన్నాయన్నారు పొంగులేటిజ. వీనాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు బీఆర్‌ఎస్‌ పతనం మొదలైందని... రాబోయే కురుక్షేత్రంలో కౌరవ పక్షాన ఉన్న వారికి ఓటమి త్పపదన్నారు. ప్రజాక్షేత్రంలో వారు శిక్షకు అర్హులని చెప్పారు. ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలిచి చూపిస్తామన్నారు పొంగులేటి. 


తుమ్మల మనస్తూర్తిగా కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానిస్తున్నని చెప్పారు పొంగులేటి శ్రీనివాసరావు. తుమ్మల రాక కోసం కాంగ్రెస్‌ పార్టీ ఎదురుచూస్తోంది చెప్పారు. అయితే, ఏ పార్టీలో చేరాలన్నది తుమ్మల సింగిల్‌గా తీసుకునే నిర్ణయం కాదన్నారు. తాను కూడా పార్టీ మార్పుపై సింగిల్‌గా నిర్ణయం తీసుకోలేదని.. ప్రజలు, అనుచరులు, కార్యకర్తల ఏం కోరుకుంటున్నారో ఆ మేరకే నిర్ణయం తీసుకున్నానన్నారు. తుమ్మల కూడా అనుచరుల అభీష్టం మేరకే నిర్ణయం తీసుకుంటానని చెప్పారన్నారు. రేవంత్‌రెడ్డి కూడా వచ్చి పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు. ఈ విషయంపై ప్రజలతో చర్చిస్తున్నానని తుమ్మల చెప్పారన్నారు. నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని తుమ్మల అడుగుతున్నారని చెప్పారు పొంగులేటి. కానీ, తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానన్నారు. 


పొంగులేటి తన చిరకాల మిత్రుడన్న తుమ్మల... తనను పార్టీలోకి ఆహ్వానించేందుకు వచ్చినందుకు ఆయనకు ధన్యావాదాలు తెలిపారు. రాజకీయ జీవితాన్ని తన స్వార్థం కోసం కాకుండా... ప్రజాశ్రేయస్సు కోసమే ఉపయోగిస్తున్నానని చెప్పారు తుమ్మల. ఏ పార్టీలో ఉన్నా.. ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషిచేశానన్నారు ఆయన. అంతేకాదు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కోసం కష్టపడి పనిచేశానని చెప్పారు. కానీ, ఈరోజు.. తన రాజకీయ లక్ష్యమైన సీతారామ ప్రాజెక్టు.. గోదావరి జలాల విడుదల తన కళ్లతో చూడాలన్నదే తన ఆశయమన్నారు. అధికారంగా ఆ నీళ్లు వదిలి ఖమ్మం జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పారు. ఆ తర్వాత రాజకీయాలు విరమించాలనేది తన కోరిక అన్నారు తుమ్మల. ఆ ఆశయం కోసమే తాను ఈ ఎన్నికల బరిలో నిలబడుతున్నానని చెప్పారు. అనుచరుల అభిప్రాయం మేరకే తన నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు తుమ్మల. 


Also Read: నేడు అనుచరులతో తుమ్మల నాగేశ్వరరావు భేటీ- కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్


Also Read: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్​రెడ్డి భేటీ-పాలేరు టికెట్‌పై చర్చ!