తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల మాట తరచుగా తెరమీదకు వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఖమ్మం జిల్లాపై ఫోకస్ చేశారా..? అసంతృప్తులకు అంతుచిక్కని విదంగా కేసీఆర్‌ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటనపై ఇప్పుడు సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. రాష్ట్రంలో మొత్తం మూడు రాజ్యసభ స్థానాలు ప్రకటించిన కేసీఆర్‌ అందులో ఏకంగా రెండు స్థానాలను ఖమ్మం జిల్లాకు చెందిన వారికే ఇవ్వడం ఖమ్మంపై కేసీఆర్‌ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది స్థానికంగా ఎంత మేరకు సత్పలితాలను అందిస్తాదనే విషయం ఇప్పుడు సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. 
కేసీఆర్‌కు కొరకరాని కొయ్యగా ఖమ్మం..
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా హవా కొనసాగించిన కేసీఆర్‌కు, టీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రం కొరకరాని కొయ్యగా తయారైంది. 2014 ఎన్నికల్లో కేవలం కొత్తగూడెం నియోజకవర్గం నుంచి మాత్రమే విజయం సాదించగా, 2018 ఎన్నికల్లో కేవలం ఖమ్మం నియోజకవర్గంలో మాత్రమే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాదించారు. ఈ రెండు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఘోర పరాజయంను చవిచూసింది. అయితే ఇందులో బాగంగానే రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రెండు రాజ్యసభ స్థానాలు ఖమ్మం జిల్లాకు చెందిన వారినే ఎంపిక చేయడం ఇప్పుడు కేసీఆర్‌కు ఖమ్మంను ఎలాగైనా దక్కించుకోవాలనే కోరికను కనబరుస్తుంది. అయితే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కేసీఆర్‌కు ఎలా ఉపయోగపడుతుందనేది చూడాల్సిందే. 
అంచనాలకు బిన్నంగా..
మొదట్నుంచీ ఖమ్మం జిల్లా నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రాధాన్యత లభిస్తుందనే ఊహాగాహానాలు ఉన్నాయి. నేరుగా కేసీఆర్, కేటీఆర్‌ నుంచి పిలుపు వచ్చిందని, ఆయనకే ఈ దఫా ఎంపీ స్థానం వస్తుందనే ప్రచారం సాగింది. అయితే ఈ అంచనాలకు బిన్నంగా ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులను ప్రకటించడం గమనార్హం. 2010 లోక్‌సభ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న పొంగులేటికి అనూహ్యంగా ఎంపీ టిక్కెట్‌ లబించలేదు. అయితే అప్పట్నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉంటున్న పొంగులేటి మాత్రం తనకు పార్టీలో ప్రాధాన్యత లభిస్తుందనే ఆశలు పెంచుకున్నాడు. అయితే కేసీఆర్‌ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల్లో పొంగులేటికి స్థానం దక్కకపోవడం గమనార్హం. ఇదే సామాజిక వర్గానికి చెందిన హెటిరో డ్రగ్స్‌ అధినేత బండి పార్థసారదిరెడ్డికి ఛాన్స్ దక్కడం గమనార్హం.


పొంగులేటి తాను ప్రత్యక్ష ఎన్నికలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పడం వల్లే ఆయనకు రాజ్యసభ ఇవ్వకుండా అదే సామాజిక వర్గానికి చెందిన నేతకు అవకాశం ఇచ్చారనే ప్రచారం ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారు. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి చెందిన వద్దిరాజు రవిచంద్ర సైతం గత అనేక రోజులుగా టీఆర్‌ఎస్‌ పార్టీలో ప్రాధాన్యత కోసం ఎదురుచూస్తున్నారు. గ్రానైట్‌ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర 2018 ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఇటీవల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వద్దిరాజు రవిచంద్రకు టిక్కెట్‌ వస్తుందని ప్రచారం సాగినప్పటికీ అనూహ్యంగా తాతా మధును ఈ స్థానానికి కేటాయించారు. 


రాజ్యసభ స్థానంపై అసలు ఎలాంటి ఊహాగానాలు లేకుండానే వద్దిరాజు రవిచంద్రకు రాజ్యసభకు ఎంపిక చేయడం గమనార్హం. ఖమ్మం జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించడంతోపాటు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జిల్లాలో పట్టుసాధించాలనే వ్యూహంతో ఉన్న కేసీఆర్‌ అందరి అంచనాలను తారుమారుచేస్తూ వద్దిరాజు రవిచంద్రకు రాజ్యసభకు ఎంపిక చేయడం గమనార్హం.


ఏది ఏమైనా రాష్ట్రంలో అనేక మంది ఆశావహులు ఉనప్పటికీ ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరికి టీఆర్‌ఎస్‌ పార్టీ తరుపున రాజ్యసభకు పంపించడం వెనుక 2023 ఎన్నికల్లో ఎలాగైనా ఉమ్మడి జిల్లాలో పాగా వేయాలనే కేసీఆర్‌ వ్యూహమనే చర్చ సాగుతుంది. మరి ఇది ఎంతమేరకు సత్పలితాలనిస్తుంది, అసంతృప్తులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వాడివేడిగా చర్చ సాగుతుంది. 


Also Read: Damodara Rao: ఎవరీ దామోదరరావు, టీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీ పదవి ఎందుకు ఇచ్చారు?


Also Read: TRS Rajyasabha Candidates: రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల్ని ప్రకటించిన టీఆర్ఎస్, ఆ ముగ్గురు వీరే