Huge Arrangements Ror Yuvagalam Navasakam Sabha :    రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తైన సందర్భంగా బుధవారం నిర్వహించనున్న యువగళం-నవశకం బహిరంగ సభకు  టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేసారు.  ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన అతిరథ మహారధులు హాజరుకానుండటంతో యావత్ ఆంధ్రప్రదేశ్ చూపు. విజయనగరం జిల్లా, పోలిపల్లి వద్ద జరిగే బహిరంగ సభపై పడింది. రాష్ట్ర చరిత్రలో న భూతో నభవిష్యతి అనే చందంగా ఈ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యువగళం-నవశకం సభ మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు జరగనుంది. 


ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోయినా  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు 


సభకు జనం రాకుండా చేసేందుకు అధికార పార్టీ అన్ని అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు అందుబాటులో ఉన్న వాహనాలతో సభా ప్రాంగణానికి ఇప్పటికే చేరుకుంటున్నారు. ఇందుకోసం టీడీపీ 5 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఇవిగాక ప్రైవేటు బస్సులు, లారీలు, కార్లు, ఇతర వాహనాల్లో టీడీపీ అభిమానులు సభా స్థలికి చేరుకుంటున్నారు. దీంతో సభను విజయవంతం కాకుండా చేయాలనుకున్న ప్రభుత్వ కుట్ర బెడిసికొట్టింది. ఈ వేదికపై నుండి ఇరు పార్టీల అధినేతలు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని పూరించనుండటంతో దీనిపై రాష్ట్ర, జాతీయ మీడియా ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఇప్పటికే పెద్దఎత్తున మీడియా ప్రతినిధులు విశాఖపట్నానికి చేరుకున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 


సభా ప్రాంగణ ఏర్పాట్లు పూర్తి 


చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై మాట్లాడటం ఇదే ప్రథమం. పెద్దఎత్తున ఇరు పార్టీల శ్రేణులు హాజరవనున్న నేపథ్యంలో 110 ఎకరాల విశాల ప్రాంగణంలో సభ జరగనుంది. 8 అడుగుల ఎత్తులో, 200 అడుగుల పొడవు, 100 అడుగల వెడల్పుతో వేదిక సిద్ధమైంది. వేదికపై సుమారు 600 మంది ఆసీనులవ్వనున్నారు. సభ ఎదురు వీఐపీలు కూర్చుంటారు. సభు వీక్షించేందుకు కుర్చీలు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూల నుండి సభకు వచ్చే ప్రజలను తరలించడానికి విశాఖపట్నం, విజయనగరం రైల్వే స్టేషన్ల వద్ద ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి వచ్చే వాహనాలకు 2, విశాఖ వైపు నుండి వచ్చే వాహనాలకు 2 భారీ పార్కింగ్ లు సభకు ఇరువైపులా ఏర్పాటు చేశారు


సభాప్రాంగణం వద్ద పండుగ వాతావరణం


ఈ నవశకం బహిరంగ సభ ఈ దశాబ్ధపు అతిపెద్ద వేడుక కావడంతో టీడీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సుదూర ప్రాంతాల నుండి వచ్చే కార్యకర్తలు, అభిమానుల  కోసం సభా ప్రాంగణం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  పోలిపల్లి వద్ద సభ నిర్వహిస్తున్న సందర్భంగా ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. ప్లెక్సీలు, స్వాగత థోరణాలతో చేసిన ఏర్పాట్లతో పరిసర ప్రాంతమంతా పసుపుమయమైంది. విశాఖపట్నం-విజయనగరం మధ్య భారీ కటౌట్లు,  జండాలతో పసుపుజాతరను తలపిస్తోంది.