తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుపై ఆ పార్టీ శ్రేణులు రగిలిపోతున్నాయి. చంద్రబాబును అరెస్టు చేయడంతోపాటు కనీసం నిరసన తెలపడానికి కూడా అవకాశం లేకుండా నేతలను ఎక్కడికక్కడ నిర్బంధించడంపై మండిపడుతున్నారు. అందుకే టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సామూహిక నిరహార దీక్షలకు పిలుపునిచ్చారు. 


చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడి వాళ్లు అక్కడే నిరశన చేపట్టాలని సూచించారు అచ్చెన్న. ప్రజలకు టీడీపీ శ్రేణులు ఈ ఆందోళనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 


చంద్రబాబును అరెస్టు చేశారని తెలిసినప్పటి నుంచి కూడా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. ఇది పరిస్థితిని అదుపు తప్పేలా చేస్తుందని ముందే గ్రహించిన ప్రభుత్వం, పోలీసులు ప్రధానమైన నాయకులను హౌస్‌అరెస్టు చేశారు. జిల్లాలో ముఖ్యనేతలందర్నీ బయటకు రాకుండా కట్టడి చేశారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఎవర్నీ బయటకు రానీయలేదు. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ పార్టీనే హౌస్‌ అరెస్టు చేశారన్నట్టు. 


కొంత మందిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఆందోళన చేస్తున్న వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. లోకేష్‌ యుగళం పాదయాత్రను కూడా అడ్డుకున్నారు పోలీసులు. జిల్లాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యగా నారా లోకేష్‌ను కూడా అడ్డుకున్నారు పోలీసులు. యువగళం పాదయాత్రలో ఉండగా.. బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ యువగళం క్యాంపు నుంచి లోకేష్‌ను బయటకు రానివ్వలేదు. దీంతో కింద కూర్చొని నిరసన తెలిపారు లోకేష్‌. అనంతరం ఆయన్ని అనుమతి ఇచ్చారు.  


చంద్రబాబును అరెస్ట్‌ చేసినందుకు నిరసనగా జాతీయ రహదారిని నిర్బంధించారు రాజోలు నియోజకవర్గ టీడీపి నాయకులు. 
చంద్రబాబును కారణం చెప్పకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుని అరెస్ట్ చేయటానికి నిరసనగా నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు మామిడికుదురు పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించారు. 


ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యప్తంగా టీడీపీ ఆందోళనలకు దిగుతున్నారు. దీంతో ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి. అన్ని ప్రాంతాల్లో టీడీపీ నేతలకు నోటీసులు ఇస్తున్నారు పోలీసులు. మరికొన్ని ప్రాంతాల్లో అరెస్టులు కూడా చేస్తున్నారు. అనంతపురంలో అరవింద్‌నగర్‌లోని పరిటాల శ్రీరామ్‌ ఇంటికి వెళ్లి ఆయన్ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఆయన్ని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని కూడా హౌస్ అరెస్టు చేశారు. అలాగే జిల్లాలోని ముఖ్య నేతలందరినీ గృహనిర్బంధం చేస్తున్నారు. ఇటు శ్రీ సత్యసాయి జిల్లా ఎన్ఎస్ గేట్ దగ్గర మాజీ మంత్రి పరిటాల సునీత రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సునీతను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. టీడీపీ నాయకులు పట్టుకున్నారు. దీంతో పరిటాల సునీత అరెస్ట్‌ చేశారు. ఆమెను తరలిస్తున్న వాహనానికి అడ్డుగా నిలబడ్డ టీడీపీ శ్రేణులు సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమంటూ సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల సునీతను అరెస్ట్ చేసి ధర్మవరం వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు