"రాజ్యాంగాన్ని మార్చాలంటూ"  తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ ఒక్కరూ ఈ అంశంపై టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వకపోగా దురుద్దేశంతోనే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. రాజకీయ పార్టీలు కేసీఆర్ వ్యాఖ్యలపై ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించాయి. దళిత సంఘాలు కూడా కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కేసీఆర్ కోరుకున్నట్లుగా చర్చ జరగకపోగా ఇప్పుడు ఈ మాటలు ఆయన మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. 


కేంద్రం తీరు బాగోలేకపోతే రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలి !?


మంగళవారం రోజున రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా ప్రెస్‌మీట్ పెట్టిన కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని.. మనకు కొత్త రాజ్యాంగం అవసరం ఉందని నొక్కి చెప్పారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని ప్రత్యేకంగా కవరేజీ ఇవ్వాలని మీడియాను కూడా కోరారు. అయితే కేసీఆర్ రాజ్యాంగం విషయంలో ప్రస్తుతం వచ్చిన ఇబ్బందేమిటో చెప్పలేకపోయారు. రాజ్యాంగం వల్ల దేశానికి ప్రస్తుతం వచ్చిన నష్టమేంటో ఒక్క మాట కూడా చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వ తీరు వల్ల దేశానికి నష్టం జరుగుతోందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ తీరు సరిగా లేకపోతే రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ ఎందుకు అనుకుంటున్నారో ఆలోచనాపరులకూ తట్టలేదు. 


కొత్త రాజ్యాంగంలో కేసీఆర్ ఏం ఉండాలనుకుంటున్నారు ? 


రాజ్యాంగం అంటే ఎంతో పవిత్రమైనది. అవసరానికి తగ్గట్లుగా ఎప్పుడో ఓ సారి సవరణ చేస్తున్నారు తప్ప.. అసలు మొత్తం రాజ్యాంగాన్ని మార్చేయాలన్న ఆలోచన ఎప్పుడూ.. ఎవరూ చేయలేదు. అలాంటి ఆలోచన చేస్తే ఎంత తీవ్రమైన రియాక్షన్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఇంత కాలం విమర్శలు అడపాదడపా వినిపిస్తూ ఉంటాయి. ఏం మారుస్తుందో చెప్పరు కానీ హిందూ రాజ్యం చేస్తారనో..మరొకటనో  రకరకాలుగా ప్రచారం జరిగేది. అయితే బీజేపీ నేతలు మాత్రం నిర్మోహమాటంగా ఖండించేవారు. అది తప్పుడు ప్రచారం అనేవారు. కానీ ఇప్పుడు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే విధానం తీసుకున్న కేసీఆర్ ఈ " రాజ్యాంగ మార్పు" వాదన తీసుకొచ్చారు.   ఇంతకీ  కేసీఆర్ అసలు కొత్త రాజ్యాంగం రాయాలంటున్నారా.. లేకపోతే కొన్ని విషయాల్లో మార్పులు చేయాలనుకుంటున్నారా అన్నది స్పష్టతలేదు. అసలు ఏ విషయంలో రాజ్యాంగం మార్చాలన్నదానిపైనా ఆయన క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభాకు తగ్గట్లుగా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే.. రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కోరుకుంటున్నారా..  అన్న అంశాలపై స్పష్టత లేకుండా పోయింది. దీంతో కేసీఆర్ కోరుకున్న చర్చ ప్రారంభానికి అవకాశం లేకుండా పోయింది. 


రాజ్యాంగంపై కేసీఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు !


కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నేతలు అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. రాజ్యాంగం జోలికొస్తే చూరచూర చేస్తారని బండి సంజయ్ కేసీఆర్‌ను హెచ్చరించారు. సీఎం కేసీఆర్ అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకారని...125 అడుగుల బాబా సాహెబ్ విగ్రహాన్ని ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నాయకులు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేయాలని నిర్ణయించారు. తదుపరి కార్యాచరణను గురువారం ప్రకటిస్తామని చెప్పారు. బీజేపీతో కుమ్మక‌్కయ్యే రాజ్యాంగంపై కేసీఆర్ అనుచితంగా మాట్లాడుతున్నారని.. బీజేపీ ఎజెండాను ఆయన అమలు చేస్తున్నారని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇతర పార్టీలు కూడా కేసీఆర్ వ్యాఖ్యలను తప్పు పట్టాయి. 


తీవ్రంగా ఖండిస్తున్న ఎస్సీ, ఎస్టీ సంఘాలు !


రాజ్యాంగ మార్పు వ్యాఖ్యల పట్ల ఇటు ఎస్సీ, ఎస్టీ సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. మాజీ ఐపీఎస్, బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఎంతటిత్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు. 


 






వివరణ ఇస్తున్న టీఆర్ఎస్ !


కేసీఆర్ వ్యాఖ్యలపై దుమారం ప్రారంభం కావడంతో టీఆర్ఎస్ వివరణ ఇచ్చింది. మోడీ సర్కార్ రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ ఎన్నికల కోణంలో ప్రకటనల కోసం ప్రకటనలు ఇస్తుండాన్ని ద్రుష్టిలో పెట్టుకుని కేసీఆర్ రాజ్యాంగం మళ్లీ రాయాలన్న వ్యాఖ్యలు చేశారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ కుమార్ అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు.  వాజ్‌పేయ్ హయాంలో రాజ్యాంగ పున సమీక్ష పరిశీలన కోసం వేసిన కమిటీ గురించి బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.