ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు.. నేనొస్తున్నా.. నేనుంటా.. తెలుగువాడి పౌరుషం ఏంటో చూపిద్దాం ఇది నందమూరి బాలకృష్ణ ప్రెస్ మీట్ ఎండింగ్‌లో చెప్పిన డైలాగులు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్న తరుణంలో..బాలయ్య చెప్పిన ఈ మాటలు కేవలం కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకేనా..లేదా టీడీపీ నూతన సారథిగా బాలయ్య బాధ్యతలు తీసుకోబోతున్నారా..బాలయ్య ఇచ్చిన అభయం దేనికి సంకేతం అనే ఇప్పుడు ఇటు టీడీపీ, అటు వైసీపీ రెండు పార్టీల్లోనూ చర్చకు దారి తీస్తోంది.


నిన్నటికి నిన్న అమరావతి టీడీపీ కేంద్రకార్యాలయంలో టీడీపీ సీనియర్ నేతలతో బాలకృష్ణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్ బాబు, అనగాని సత్యప్రసాద్, పట్టాభి ఇలా టీడీపీ క్యాడర్‌లో బాగా పేరున్న నేతలతో బాలయ్య ఒక్కరే సమావేశం నిర్వహించారు. లోకేష్ రాజమండ్రిలో తన తండ్రి కేసు వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటుండగా...మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలకు, క్యాడర్ కు ధైర్యమిచ్చే బాధ్యతలను బాలయ్య భుజాలకు ఎత్తుకున్నారని అర్థమవుతోంది. కానీ ఈ రోజు ప్రెస్ మీట్‌లో నేను ఉన్నా నేను వస్తాను కలిసి పోరాడదాం అన్న మాటలు దేనికి సంకేతమనేది ఇప్పుడు అసలు ప్రశ్న. బాలయ్య టీడీపీని కబ్జా చేసే ప్రయత్నాల్లో ఉన్నారనైతే వైసీపీ మంత్రులు ఇప్పటికే కౌంటర్స్ ఇవ్వటం మొదలు పెట్టారు కూడా.


దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి మొదటిది నారా లోకేష్ అరెస్ట్. అవును లోకేష్ కూడా కొద్ది రోజుల్లో అరెస్టు అవుతారని చంద్రబాబు అరెస్ట్ సమయంలో స్పందించిన ప్రతీ మంత్రి మాట్లాడిన మాటే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ కూడా వారం రోజుల్లో సీఐడీ విచారణలో ఉంటారనేది మంత్రులు చెబుతున్న విషయం. మరి లోకేష్‌ను కూడా తండ్రి చంద్రబాబులానే రిమాండ్ కు తరలిస్తే పార్టీని నడిపించాల్సిన బాధ్యత తాత్కాలికంగానైనా బాలయ్యపై పడే అవకాశం ఉంటుంది. రెండో విషయం చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో 23మంది గుండెపోటుతో మరణించారని టీడీపీ చెబుతోంది. వారి కుటుంబాలను కూడా స్వయంగా వెళ్లి పరామర్శిస్తానని బాలకృష్ణ రోజు మీడియా సమావేశంలో చెప్పారు. 


గతంలో వైఎస్సాఆర్ మరణించిన సమయంలో చనిపోయిన రాజన్న అభిమానులను కలిసేందుకు వైఎస్ జగన్ కాంగ్రెస్ అధిష్ఠానంతో విబేధించి బయటకు వచ్చి ఓదార్పుయాత్ర చేపట్టిన అంశం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. అలాగే బాలకృష్ణ కూడా ఇప్పుడు టీడీపీ అధినేత అరెస్ట్ కారణంగా కన్నుమూసిన కుటుంబాలను పరామర్శించి ధైర్యమిస్తారా... లేదా బాబు, లోకేష్ ఇద్దరూ జైలులో ఉండాల్సిన పరిస్థితులు వస్తే నూతన సారథిగా ఎన్నికల ముందు ఈ కీలక సమయంలో ముందుండి నడిపిస్తారా చూడాలి.