చంద్రబాబు అరెస్టుతో కాస్త నిరాశలో ఉన్న పార్టీ కేడర్‌కు నందమూరి బాలకృష్ణ ధైర్యం చెప్పారు. నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. అధినేత అరెస్టుతో గుండె ఆగిన వారి కుటుంబాలను పరామర్శిస్తాను అన్నారు. 


చంద్రబాబు అరెస్టు టీడీపీలో ఓ కుదుపుగానే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రేపో ఎల్లుండో లోకేష్‌తోపాటు కీలకమైన నేతలను అరెస్టులు చేస్తారని వైసీపీ లీడర్లు, మంత్రులు బహిరంగంగానే చెబుతున్నారు. ఇలాంటి సమయంలో పార్టీకి ఎవరు అండగా ఉంటారు అనే ప్రశ్న తలెత్తింది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టుగానే నందమూరి బాలకృష్ణ మీడియా సమావేశం జరిగింది. నేను ఉన్నాను ధైర్యంగా ఉండండి... పోరాడుదాం.. భయం వద్దు అంటూ తెలుగుదేశం కేడర్‌కు బాలకృష్ణ పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం సమరం నుంచి ఎన్నో పోరాటాలు మనం చూశాం చదువుకున్నామని వాటి స్ఫూర్తితో పోరాడుదాం అన్నారు. 


ప్రజలు కూడా ఆలోచించుకోవాలని సూచించారు బాలకృష్ణ. ఇప్పటికే పన్ను పోటుతో ఇబ్బంది పడుతున్న జనం మరోసారి అవకాశం ఇస్తే మరింత దుర్బరం అవుతారని హెచ్చరించారు. ఆలోచిస్తూ కూర్చుంటే ఏపీ సర్వనాశనం అవుతుందని.. ప్రతి ఒక్కరూ సైనికుల్లా పోరాడాలని సూచించారు. ప్లాన్ చేసి చంద్రబాబును కేసుల్లో ఇరికించారని అలాంటి వాటికి భయపడి ఇంట్లో కూర్చునే రకం కాదన్నారు బాలకృష్ణ. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారు అన్నారు. చంద్రబాబు అరెస్టుతో కొందరు ప్రాణాలు కొల్పోయారని వారి కుటుంబాలను త్వరలోనే పరామర్శిస్తాను అన్నారు. ఎవ్వరికీ భయపడనక్కర్లేదని కేడర్‌కు, ప్రజలకు సూచన చేశారు. నేను వస్తున్నా.. నేనే ముందుంటా పోరుదాం రండీ అంటూ ధైర్యం నింపారు. 


ఆలోచించడం కాదుని... రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు హిందూపురం ఎమ్మెల్యే. జగనుకు మనుషులేంటేనే అలర్జీ అని విమర్శించారు. ముచ్చి మూతి పెట్టుకుని ఎంగిలి మెతుకులు- విదిల్చే స్వభావం జగన్‌ది అన్నారు. రూ. 10 ఇచ్చి రూ. 100 గుంజుకునే రకం వైసీపీదన్నారు.


హిందూపురంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధే ఇప్పుడు కనిపిస్తోందన్నారు బాలకృష్ణ. వీళ్లు వచ్చాక తట్ట మట్టి కూడా వేసిందని చెప్పుకొచ్చారు. మాట తప్పని పార్టీ తమదన్నారు. మాట తప్పకపోవడం అనేది ఎన్టీఆర్ నుంచి పార్టీకి వారసత్వంగా వచ్చిందన్నారు. టీడీపీ ఎన్నో సంక్షోభాలు చూసిందన్నారు బాలయ్య. ఇప్పుడూ అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇవే కాదు ఇంకా కేసులు పెడతారని అంచనా వేశారు. జగన్ లండన్ ఎందుకెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవాళే జగన్ ఏపీకి వచ్చారంట.. ఈ హ్యాంగోవర్ దిగడానికి మరో పది రోజులు పడుతుందేమో అని ఎద్దేవా చేశారు. 


ప్రజాపక్షాన పోరాడతామన్నారు బాలయ్య. మన శక్తి అయిన యువతని స్ట్రీమ్ లైన్ చేయాలన్నారు. జగన్ ప్రభుత్వం మాత్రం వాళ్లను గంజాయికి బానిసలుగా మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూపురంలో ప్రభుత్వాస్పత్రిలో పందులు.. పశువులు తిరుగుతున్నాయన్నారు. ఏపీని ప్రపంచ పటంలో లేకుండా జగన్ చేశారన్నారు. 


చంద్రబాబుపై కక్ష సాధింపుతో ఎలాంటి ఆధారాలు లేకుండా చట్టాలని అతిక్రమించి నేరాన్ని మోపారన్నారు నందమూరి బాలకృష్ణ. అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు ఓ బ్రాండ్... ప్రపంచ దేశాలే ఆయన గురించి చెప్పుకుంటున్నాయన్నారు. ఇప్పుడు పాలన గాలికి వదిలేసి ప్రతిపక్షాలపై కక్ష సాధించడమే లక్ష్యంగా జగన్‌ ముందుకెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని భయంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో ఎలాంటి ఆధారాలు  లేకుండా... తాను 16 నెలలు జైల్లో ఉన్నాను కాబట్టే చంద్రబాబు కనీసం 16 రోజులైనా పెట్టాలనే దురుద్దేశంతోనే స్కామ్‌ను క్రియేట్ చేశారన్నారు.