తెలుగుదేశం పార్టీ నేతలను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ( CM Jagan ) దూషించారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు నర్సీపట్నంలోని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ( Ayyanna Patrudu ) ఇంటికి వచ్చారు. ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐ లు కొంత మంది సిబ్బందితో  రావడంతో  అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే తాము  41(A) నోటీసు ఇచ్చేందుకే వచ్చామని పోలీసులు చెబుతున్నారు. అయ్యన్నపాత్రుడు ఇంటికి వచ్చిన వారిలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సిఐ ఏ రఘు, నల్లజర్ల ఎస్ఐ ఐ అవినాష్, దేవరాపల్లి ఎస్ఐ కె శ్రీ హరి రావు ఉన్నారు.గత వారం నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ( NTR Statue ) కార్యక్రమానికి మంత్రి అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. 


ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించారు. ప్రభుత్వ  వైఫల్యాలపై మండిపడ్డారు. ప్రజలపై పన్నుల భారం వేస్తున్నారని విమర్శించారు. చెత్త పన్నులు వేస్తున్నారని మండిపడ్డారు. ఆ సభలో సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే మూాడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. తర్వాత వెంటనే నోటీసులు ఇచ్చేందుకు నర్సీపట్నం వచ్చారు.   అయ్యన్నపాత్రుడు ఇంటికి పోలీసులు వెళ్లడంపై టీడీపీ నేత నారా లోకేష్ ( Nara Lokesh ) మండిపడ్డారు.   వాస్తవాలు మాట్లాడితేనే కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వస్తే వైఎస్ఆర్‌సీపీ  నేతలు చెప్పే అబద్ధాలు-మాట్లాడే బూతులకి డైరెక్ట్ గా ఉరి వెయ్యాలి.వైఎస్ఆర్‌సీపీ నేతల తీవ్ర వ్యాఖ్యలపై కేసులు పెడితే కనీసం స్పందించని పోలీసులు జిల్లాలు దాటి మరీ టిడిపి నేతల్ని అరెస్ట్ చేయడానికి రావడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకతని మండిపడ్డారు. 


పోలీసుల చొక్కా పట్టుకొని తిడుతున్న మంత్రులు,బీరు బాటిళ్లు పగలగొట్టి ఏం పీకుతారు అని సవాల్ చేస్తున్న వైఎస్ఆర్‌సీపీ నేతలపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపి ప్రజాస్వామ్యాన్ని కాపాడితే కనీసం వేసుకున్న ఖాకీ గౌరవాన్ని నిలబెట్టినవారవుతారని సూచించారు.  గతంలోనూ టీడీపీ నేతలపై అప్పటికప్పుడు కేసులు పెట్టి ఆ తర్వాత అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అనేక సార్లు టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు కూడా. కొత్త డీజీపీ వచ్చిన తర్వాత కూడా పరిస్థితి మారలేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.