Singanamala MLA Jonnalagadda Padmavathy Hot Comments : వైఎస్‌ఆర్‌సీపీలో అధినాయకత్వానికి ఒకరి తర్వాత ఒకరు షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఫైర్ అయ్యారు. ఎస్సీ నియోజకవర్గమనే చిన్నచూపు అంతటా ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. 
 అనంతపురం జిల్లా వైసీపీలో మరో ముసలం పుట్టింది. తన నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న కుప్పం నియోజకవర్గానికి నీళ్లు వెళ్తున్నాయని తమ నియోజకవర్గంలోని ప్రాంతాలు బీడుగా మారుతున్నాయని అన్నారు. జగన్, పెద్దిరెడ్డికి చెప్పినా ప్రయోజనం లేకపోయిందని అన్నారు. 
పోరాడితే తప్ప నీళ్లు వచ్చే పరిస్థితి లేదన్నారు జొన్మలగడ్డ పద్మావతి. ఆనాడు జగన్ చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని తాను పోరాటానికి సిద్ధమయ్యానన్నారు. నీళ్ల కోసం చేసే పోరాటంలో అందరూ తనకు మద్దతుగా నిలవాలని ఫేస్‌బుల్‌లైవ్‌లో విజ్ఞప్తి చేశారు. 
ఫేస్‌బుక్‌ వేదికగా లైవ్‌లో మాట్లాడిన పద్మావతి చాలా అంశాలపై స్పందించారు. తనపై కేసులు పెట్టి వేధించిన వారిని పార్టీలోకి తీసుకొస్తే వారిని కలుపుకొని వెళ్లాలని ఇప్పుడు తనకు టికెట్ లేదని అంటున్నారన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా నీళ్ల కోసం పోరాటం చేయాల్సి వచ్చిందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందన్నారు.