Pawan Kalyan: నేనింతే ఇలానే ఉంటా..చాలా క్లారిటి గా ఉంటా...నేను చెప్పిన విషయాలు వినండి..వాటినే ప్రజలకు చెప్పండి...ఎవడో ప్రచారాలు చేస్తే వాటిపై మనం ఎందుకు మాట్లాడుకోవాలి అని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తనను కలిసిన పార్టీ నాయకులకు ఇదే చెప్పారు.  పార్టీ క్యాడర్‌ అదే సమాచారం ఇవ్వాలని కూడా దిశానిర్దేశం చేశారు. 


ఆంధ్రప్రదేశ రాజకీయాలకు మనం స్పష్టంగా ఉందాం. మనం చేసేది చెబుదాం. పొత్తులు, ఎత్తులపై మనకంటూ ఒక లైన్ ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నాయకులకు హితబోధన చేస్తున్నారు. ఇప్పటి వరకు రాజకీయాలు ఒక ఎత్తు, మనం చేసే  రాజకీయం మరో ఎత్తంటూ నేతలకు పవన్ ప్రత్యేంగా క్లాస్ తీసుకుంటున్నారు. పదేళ్ళ రాజకీయ ప్రస్థానంలో మనం చూసింది, చేసింది, చెప్పేది, వీటన్నింటకి చాలా వ్యత్యాసం ఉందని, పవన్ తన అభిప్రాయాలను నాయకుల ముందుంచుతున్నారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో తనను కలసిన నాయకులతో పవన్ చాలా డిఫరెంట్‌గా మాట్లాడుతుండటం చర్చనీయాశంగా మారింది. 


పదో ఆవిర్భావ దినోత్సం సభలో తన ప్రసంగంలో కూడా డిఫరెంట్ స్టైల్ చూపించిన పవన్ ఆ తరవాత నుంచి సినిమా షూటింగ్‌లలో బిజగా ఉంటున్నారు. అయితే సమయం దొరికినప్పుడల్లా తనను కలసిన పార్టీ నేతలో పవన్ భవిష్యత్ కార్యక్రమాలు అంటూ కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నారు. పలు దఫాలుగా నేతలతో మాట్లాడుతూ... కేడర్‌కు చెప్పాల్సిన విషయాలను సూటిగా చెబుతున్నారట. 


రాజకీయాల్లో మనం డిఫరెంట్...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం చాలా డిఫరెంట్, ఇతర రాజకీయ పార్టీలు వేరు మన జనసేన పార్టీ వేరు, మన మీద కేసులు లేవు. అవినీతి ఆరోపణలు అంత కంటే లేవు. కుంభకోణాలకు ఆస్కారమే లేదు. పూర్తి పారదర్శకంగా పార్టీని నడుపుతున్నాం. ఇవే మన రక్షణ కవచాలు అని నేతలకు పవన్ వివరిస్తున్నారు. కేడర్‌కు కూడా దీన్నే ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని చెబుతున్నారు. 


ఇప్పటి వరకు పరిస్థితులు వేరు, ఇప్పడు పరిస్థితులు వేరు కాబట్టి రాజకీయాల్లో మనం నిలబడాలంటే ముందుగా ఎదుటి వారి ట్రాప్‌లో పడకూడదని పవన్ పదే పదే చెబుతున్నారంట. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల పేరుతో సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారాన్ని ఆయన ప్రస్తావించారంట. ఎదైనా పార్టీ నుంచి పిలుపు ఉన్నా, రాజకీయ అప్ డేట్ ఉన్నా అధినేతగా తాను ఎదైనా నిర్ణయం తీసుకున్నా ఆ వివరాలు అన్నింటిని అధికారికంగా విడుదల చేస్తామని చెప్పారు. వాటినే పరిగణంలోకి తీసుకోవాలని పవన్ నేతలకు పదే పదే వివరిస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఎన్నికల సమయం దగ్గరపడటంతో పార్టీ నాయకులను కలిసేందుకు కూడా పవన్ ప్రత్యేకంగా సమయం ఇస్తున్నారని అంటున్నారు.


సినిమాలు పూర్తి కాగానే....
ప్రస్తుతం పవన్ సినిమా పనుల్లో బిజిగా ఉంటున్నారు. రాబోయే రోజుల్లో తన షెడ్యూల్‌ను త్వరగా పూర్తి చేసుకొని పార్టీ కోసం పూర్తి సమయం గడిపేందుకు రెడీ అవుతున్నారని పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు తెలిపారు. అయితే ఇదే సమయంలో పవన్ పార్టీకి సంబందించిన పలు అంశాలపై ఇప్పటికే సర్వేలు చేపట్టారని అంటున్నారు. ఇటీవల పవన్ కౌలు రైతులకు సంబందించి నష్టపరిహరం పంపిణి చేశారు. ఒక్కొ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. దీనిపై కూడా ఆయన ప్రజాభిప్రాయం తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. అంతే కాదు నియోజవకర్గాల వారీగా ఇతర పార్టీలకు చెందిన నేతల పని తీరు, ఆ నియోజకవర్గంలో జనసేన ప్రభావం ఎలా ఉందనే విషయాలను కూడా పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఇటీవల కాలంలో వీర మహిళలు పార్టీకి దగ్గర అవుతున్న వేళ మహిళా లోకం నుంచి వచ్చే ప్రతిపాదనలను కూడా పవన్ పరిశీలిస్తున్నారని టాక్ నడుస్తోంది.