ట్విట్టర్‌లో గట్టిగానే కొట్టుకుంటున్నాయి బీఆర్ఎస్‌-బీజేపీ పార్టీలు. మీరేమిచ్చారంటే మీరేమిచ్చారని సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోసుకుంటున్నారు ఇరు పార్టీల కేడర్‌, లీడర్‌. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ చేసిన ట్వీట్‌- హాట్ హాట్‌ చర్చకు తెరతీసింది. ఎవరికి వారు తగ్గేదే లే అంటున్నారు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు. వీరిద్దరి మధ్యలోకి దూరింది కాంగ్రెస్. అసలు చేసిందంతా మేమే, జరిగిందంతా మా హయాంలోనే అంటూ మిడిల్ ఎంట్రీ ఇచ్చింది హస్తం పార్టీ! ఇంతకూ కేటీఆర్ చేసిన ట్వీటేంటి? బీజేపీ ఇచ్చిన కౌంటరేంటి? ఇద్దరి మధ్యలో కాంగ్రెస్ బాధేంది?


కేటీఆర్ చేసిన ట్వీట్ ఇదే!






తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వం - ప్రధాని


పసుపు బోర్డు ఇవ్వం - ప్రధాని


మెట్రో రెండోదశ ఇవ్వం - ప్రధాని


ఐటిఐఆర్ ప్రాజెక్టు ఇవ్వం - ప్రధాని


గిరిజన యూనివర్సిటీ ఇవ్వం - ప్రధాని


బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఇవ్వం - ప్రధాని


ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వం - ప్రధాని


ప్రధాని ప్రాధాన్యతల్లో అసలు తెలంగాణే లేనప్పుడు


తెలంగాణ ప్రజల ప్రాధాన్యతా క్రమంలో ప్రధాని ఎందుకు ఉండాలి?


తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలి??  - కేటీఆర్ ట్వీట్


ఇదీ కేటీఆర్ ట్వీట్! పునర్ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సినవేవీ రాలేదని, అసలు తెలంగాణ అంటే మోదీకి ప్రాధాన్యతే లేదని, మరి అలాంటప్పుడు తెలంగాణ ప్రాధాన్యతా క్రమంలో మోదీ ఎందుకుండాలని, తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలి అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై కమలం పార్టీ కస్సున లేచింది, వెంటనే బండి సంజయ్ ఇలా ట్వీట్ చేశారు.


బండి సంజయ్ చేసిన ట్వీట్






ఉద్యమకారులకు పార్టీలో చోటివ్వం - కేసీఆర్


దళితులకు మూడెకరాలు ఇవ్వం - కేసీఆర్


దళితులకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వం - కేసీఆర్


ఖాళీలున్నా ఉద్యోగాలను భర్తీ చెయ్యం - కేసీఆర్


నిరుద్యోగ భృతి ఇవ్వం - కేసీఆర్


డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వం - కేసీఆర్


దళితబంధు అర్హులకు ఇవ్వం - కేసీఆర్


పంచాయతీ, మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వం - కేసీఆర్


ప్రకటనలే తప్ప ఆలయాలకు సైతం నిధులు ఇవ్వం - కేసీఆర్


ముఖ్యమంత్రి ప్రధాన బాధ్యతల్లో ప్రజలకు చోటివ్వన్నప్పుడు, నిన్ను ఎందుకు భరించాలి ? సహించాలి ? అసలు కేసీఆర్ తన పార్టీ నుంచే తెలంగాణను తొలగిస్తే, ఆయనను ఎందుకు ఈ రాష్ట్రం నుంచి తొలగించకూడదు ? - బండి సంజయ్ ట్వీట్


కేటీఆర్ ట్వీట్ చేసిన కాసేపటికే తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ ఇలా కౌంటర్ ట్వీట్ చేశారు. దళితుడిని సీఎం చేస్తానని చేసిన హామీ నుంచి మొదలుకుని నిరుద్యోగ భృతిని, డబుల్ బెడ్రూం ఇళ్లను కోట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి ప్రధాన బాధ్యతల్లో ప్రజలకు చోటివ్వన్నప్పుడు కేసీఆర్‌ను ఎందుకు భరించాలి ? కేసీఆర్ తన పార్టీ నుంచే తెలంగాణను తొలగిస్తే, ఆయనను ఎందుకు ఈ రాష్ట్రం నుంచి తొలగించకూడదు అని ట్వీట్ చేశారు.


బండి సంజయ్ ట్విట్ మీద బీఆర్‌ఎస్‌ భీకరంగా దాడిచేస్తే, కేటీఆర్ ట్వీట్ మీదా అంతే ధాటిగా బీజేపీ ఎదురుదాడికి దిగింది. నల్లధనం, జన్ ధన్ ఖాతాలో రూ. 15 లక్షలు,  2కోట్ల ఉద్యోగాలు, గ్యాస్‌, పెట్రోల్ ధరలమీద మోదీ చేసిందేంటని బండికి కౌంటర్ల మీద కౌంటర్లు పడ్డాయి.


మరో అడుగు ముందుకేసి ఆంధ్రాకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కొందరు నెటజన్లు ప్రశ్నించారు. పోలవరం, ప్రత్యేక హోదా, అమరావతి, మెట్రో, నిధులు, పరిశ్రమలు వెంకన్న సాక్షిగా చేసిన ప్రమాణాలకు దిక్కులేదని, దేశ సంపదంఆ అదానీకి ఇప్పుడు దోచిపెడుతున్నారని ట్వీట్ చేశారు.


ఇక్కడ బీజేపీ ఏం తక్కువ తినలేదు. కేటీఆర్ ట్వీట్ మీద ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. కరెంట్ బిల్లులు పెంచలేదా? బస్ చార్జీలు పెంచలేదా? రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచలేదా అని నిలదీశారు.  


వీళ్లిద్దరి వార్ ఇలా వుంటే.. మధ్యలో కాంగ్రెస్ దూరింది. లేదులేదు.. అసలు చేసిందంతా మేమే.. అభివృద్ధి జరిగిందంతా మా హయాంలోనే అంటూ ట్వీట్ దూర్చింది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్, అభివృద్ధి చేసింది కాంగ్రెస్, సాగునీటి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్, ఆరోగ్యశ్రీ ఇచ్చింది కాంగ్రెస్ అంటూ కొందరు కాంగ్రెస్ నేతలు ట్వీట్ చేశారు.






మొత్తానికి ట్టిట్టర్ వేదికగా కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ వార్ హోరాహోరీగా సాగుతోంది. మాటల యుద్ధంలో ఎవరికి వారు తగ్గేదే అంటున్నారు. ఇరు పార్టీల మధ్య కౌంటర్లు ఎన్‌ కౌంటర్లతో పొలిటికల్ డైలాగ్ వార్ వేరే లెవల్‌కు వెళ్లిపోయింది.