ఎన్నికలు వచ్చిన ప్రతీసారీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక బలమైన వాయిస్ వినిపిస్తుంటుంది.. ఎగ్జిట్ పోల్స్ వచ్చాక కూడా ఆ వాయిస్ అలాగే వినిపిస్తుుంటుంది. తీరా రిజల్ట్స్ వచ్చాక అర్థమవుతుంది.. అది వాయిస్‌ కాదు.. వట్టి నాయిస్ మాత్రమే అని..!


బీజేపీ ఏం చేస్తుంది? విపక్షాలు ఏం చేయడం లేదు?


ఒక పార్టీకి వ్యతిరేకంగా బలంగా వాదన వినిపించాలంటే.. గట్టిగా మాట్లాడగలిగే.. సోషల్‌మీడియాను మెప్పించగలిగే..చాతుర్యం ఉన్న  కొన్ని గొంతులు చాలు. ఒక పార్టీకి, ఒక విధానానికి, సిద్ధాంతానికి వ్యతిరేకంగా బలంగానే వాదన వినిపిస్తారు. కానీ ఎన్నికల్లో గెలవాలంటే.. గొంతులు కాదు.. ఈవీఎం మీటలు నొక్కే చేతులు కావాలి. ఆ చిన్న లాజిక్ బీజేపీ వ్యతిరేకులు మిస్ అవుతుంటారు. అంటే బీజేపీ వాయిస్‌ను .. జనంలోకి పంపదా.. అంటే.. ఆ విషయంలో బీజేపీని కొట్టేవాళ్లు ఉండరు. అబద్దాలను ఎదుర్కోవడంలోనూ... అబద్ధాలను చెప్పడంలోనూ బీజేపీ అందరికంటే ముందే ఉంటుంది. అయితే బీజేపీ ఆ ఒక్కపనే...చేయదు. ఎన్నికల్లో ఏం చేయాలో "అన్నీ" చేస్తుంది. బీజేపీని బాహాటంగా విమర్శించే నియో లిబరల్స్, అర్బన్ ఇంటెలెజెన్షియాను చూసి..అదే వాయిస్.. వాళ్లే గెలిపిస్తారు.. అని భ్రమ పడితే.. ఇదిగో ఇలా యూపీలో లాగా బొక్క బోర్లా పడతారు. 


రైతుల ఆందోళనలతో.. పశ్చిమ యూపీ మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుందన్నారు. యోగీ డవలప్‌మెంట్ ఏం చేయలేదు.. ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అన్నారు.. లాక్‌డౌన్‌ టైమ్‌లో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన యూపీ కూలీల కన్నీటిగాథలు చూశాక.. ఇక యోగీ ఇంటికే అనుకున్నారు. పెద్ద వాళ్లు కోవిడ్ తో చనిపోయారు. పిల్లలకు ఉద్యోగాలు రాలేదు. ఉన్నవాళ్లకు పనులు లేవు. అంతా నెగటివ్ గా ఉంది. ఇక కచ్చితంగా ఇంటికే అని మేధావులు, విశ్లేషకుల లెక్క. కానీ ఈ లెక్కలేవీ పనిచేయలేదు.  ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ప్రభుత్వాన్ని ఓడించేంతగా మలచలేకపోవడం ప్రతిపక్షాల వైఫల్యం.  తాము ఏం చేస్తున్నామో.. బీజేపీ బలంగా చెబుతుంది. కానీ బీజేపీ లోపాలు ఏంటి.. తాము ఏం చేయగలమో... ప్రతిపక్షాలు.. ఆ యా రాష్ట్రాల్లో బలంగా చెప్పలేవు. 


యూపీలో ఏం ప్రచారం చేశారు? వాస్తవంగా ఏం జరిగింది?


సోషల్‌ మీడియా ట్రోల్స్‌ లోనూ.. అంతర్జాతీయ వ్యవహారాల్లోనూ బీజేపీని విమర్శిస్తూ ఉంటే... ఊర్లలో ఓట్లు రాలవ్‌. బీజేపీ బాగా లేదు. మరి బాగా చేయగలిగే వారు ఎవరంట.. అన్న ప్రశ్నకు ఆన్సర్ ఉండదు. అదే బీజేపీ బలం. యూపీలో పోలరైజేషన్ వల్ల ఎస్‌.పీ కాస్త బలపడిందేమో కానీ.. బీజేపీ మాత్రం వీక్‌ అవ్వలేదు. యాదవులు, ముస్లింలు కచ్చితంగా ఎస్‌.పీ వెనుక ఉన్నారు. ఇతర వర్గాల ఓట్లు కూడా పెరిగాయి. అందుకే కిందటి ఎన్నికల్లో 23శాతం ఉన్న ఓట్లు.. ౩5శాతం వరకూ వచ్చాయి. కానీ అందరూ విస్మరిస్తోంది.. బీజేపీ ఓట్ల శాతం పెద్దగా తగ్గలేదు. ఎగ్జిట్‌ పోల్స్ ప్రకారం బీజేపీ 1-2 శాతం ఓట్లు మాత్రమే కోల్పోయింది. ఇప్పుడు ఫైనల్‌గా ఎంత ఉంటుందనేది లెక్కలు పూర్తిగా వస్తే తెలుస్తుంది. ఫార్మింగ్ కమ్యూనిటీలో జాట్లు, ఠాకూర్‌లు కొంతమేరకు బయటకు వెళ్లారు. బట్ బ్రాహ్మిన్స్, ఓబీసీల్లోని ఇతర వర్గాలు, దళితులు బీజేపీ వెనుక నిలబ‌డ్డారు. 60 సీట్లు ఉన్న వెస్టర్న్ యూపీ మొత్తం బీజేపీ తుడుచిపెట్టుకుపోతుంది.. అని అన్నారు.. అక్కడ కూడా బీజేపీ లీడ్ వచ్చింది. 


జనం"మూడు"ను బట్టి బీజేపీ


బీజేపీ ఎప్పుడూ ఎన్నికల్లో మూడు స్ట్రాటజీలు ఫాలో అవుతుంది. ఒకటి జనాకర్షణ ఉన్న లీడర్లను.. రెండు ... ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టగలిగే సమర్థత ఉన్న వాళ్లను..   మూడోది పోల్ మేనేజ్‌మెంట్ చేసేవాళ్ళను.. నేనషల్‌ లెవల్‌లోనే తీసుకుంటే.. మోదీ కంటే.. ప్రజాదరణ ఉన్న నేత ఎవరూ లేరు.  ఆయనకు సమీపంలో కూడా ఎవరూ లేరు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడానికే పెద్ద సైన్యమే ఉంది. అందులో పొలిటికల్ లీడర్ల నుంచి యూత్ ఐకాన్ల వరకూ అందరూ ఉంటారు. సమాజంలో న్యూట్రల్ ఇమేజ్ ఉండి.. ఎక్కువ మందిని ప్రభావితం చేయగలిగిన స్పోర్ట్స్ స్టార్లు, సినిమా యాక్టర్లు, యూత్ ఐకాన్లు ఉంటారు. పోల్ మేనేజ్‌మెంట్‌లో పండిపోయిన అమిత్‌ షా ఉన్నాడు.. ఆనక.. ఆరెస్సెస్  ఉండనే ఉంది. అందుకే బీజేపీని కొట్టడం అంత ఈజీ కాదు. యూపీలోనే చూస్తే.. పబ్లిక్‌లో ఇమేజ్ ఉందనే ఎంపీగా ఉన్న యోగీని తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో తమకు జనాదరణ ఉన్న నాయకులు లేరనే.. సచిన్‌ పైలట్‌, జ్యోతిరాదిత్యను ట్రై చేశారు. రాజస్థాన్‌లో వర్కువుట్ కాలేదు.ఎంపీలో అయింది. బెంగాల్‌లో బీజేపీ ఓడిపోయింది... అంటారు కానీ... అసలక్కడ ఏమీ లేని పార్టీ.. మమతకు ముచ్చెమటలు పట్టించింది అనరు. బీజేపీ ఆపరేటివ్స్ ఎంత స్ట్రాంగ్‌ గా ఉంటాయనడానికి బెంగాల్‌ ఉదాహరణ. అయితే సౌత్‌లో కర్ణాటక తప్ప మిగిలిన చోట్ల చేయలేకపోవడానికి పరిస్థితులు అనుకూలించడంలేదు. అయినప్పటికీ.. తెలంగాణలో పలు సందర్భాల్లో తడాఖా చూపించింది. మొన్నటి గ్రేటర్ ఎన్నికలైనా నిన్నటి హుజూరాబాద్‌ రిజల్ట్ అయినా బీజేపీ ఏం చేయగలుగుతుంది అని చెప్పడానికి ఓ ఉదాహరణ.


విపక్షాలే బీజేపీకి బలం 


మహా సభల నుుంచి.. మైక్రో ఎలక్షనరీంగ్‌ వరకూ అంత పక్కాగా ఉండబట్టే బీజేపీ అప్రతిహత యాత్ర సాగుతోంది. మొన్న మమత బెంగాల్ లో గర్జించగానే.. బీజేపీ పని అయిపోయిందన్నారు.  మమత కచ్చితంగా మోదీని ఢీ కొట్టగలిగే లీడరే కానీ.. ఆమెకు మద్దతిచ్చే వారేరీ.. ! పేరులోనే కాంగ్రెస్ ఉన్న తృణమాల్ పార్టీ .. కాంగ్రెస్ తో కలవడానికి ఒప్పుకోదు. అంతెందుకు బెంగాల్‌లో ఓ దశలో హంగ్ హంగ్‌ వస్తుందనుకున్నప్పుడు.. తృణమాల్ కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌కు మద్దతిస్తుందన్న నమ్మకాలు ఎవరికీ లేవు. రేపు మమతకు మద్దతుగా దేశం మొత్తం కలిసొస్తుందనే నమ్మకం లేదు. ప్రతిపక్షాల అనైక్యతే బీజేపీ బలం. అందుకోసం.. ఎవరినైనా కలుపుతుంది.. ఎవరినైనా విడగొడుతుంది. 


చీపురుతో సాధ్యమేనా ?


అయితే ఈ ఎన్నికల రిజల్ట్‌  ఓ కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చాయి. పంజాబ్‌ లో ఆప్ ప్రభంజనంతో అరవింద్ కేజ్రీవాల్‌ను దేశ్‌.కీ నేత అంటున్నారు. ఢిల్లీ , పంజాబ్ రెండూ కలిపి కూడా యూపీలో ఓ భాగమంత ఉండవ్‌. అక్కడ విజయాలను .. అందునా అర్బన్‌ పాపులేషన్ ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో గెలిచిన ఆప్‌ ను చూపి దేశనాయకుడు అంటారా అని కౌంటర్ వాదన చేసే వాళ్లు కూడా ఉన్నారు. దానిని ఓ విధంగా అంగీకరించొచ్చు. అయితే మనం ముందుగానే చెప్పుకున్నాం. బీజేపీకి వ్యతిరేకంగా ఓ బలమైన వాయిస్‌ ఎప్పుడూ ఉంటుందని.. ఆ వాయిస్ లో గొంతులు ఎన్ని ఉన్నాయి అని కాకుండా.. దాని తీవ్రత ఎంత ఉందన్నదే ఎక్కువుగా కౌంట్ అవుతోందని..ఇప్పటికైతే.. కేజ్రీవాల్‌ బీజేపీ వ్యతిరేక గొంతుకు కానున్నారు. అయితే.. వాయిస్ బలం ఓట్ల రూపంలో ఏమాత్రం ట్రాన్సుఫర్‌ అవుతుందో ముందు ముందు తేలుతుంది.