Where Is Telangana BJP Leaders :  అసెంబ్లీలో అయినా బయట అయినా తెలంగాణలో  అధికార  పార్టీపై విరుచుకుపడుతోంది ఎవరు అంటే...   భారత రాష్ట్ర సమితి మాత్రమే.  అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, పార్లమెంట్ ఎన్నికల్లో సగానికిపైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం,  కేసీఆర్ ఫీల్డ్‌లోకి వచ్చేందుకు తటపటాయించడం, ఎమ్మెల్యేలు వరుసగా పార్టీ మారడం వంటి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా బీఆర్ఎస్ .. కాంగ్రెస్ పై పోరాటంలో ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. బీఆర్ఎస్ పని అయిపోయిందని ఎంత మంది చెబుతున్నా..  ఆ పార్టీ హైకమాండ్ మాత్రం..  పూర్వ వైభవం సాధిస్తామన్న నమ్మకంతోనే ఉన్నారు. క్యాడర్ కు ధైర్యం కల్పిస్తున్నారు. అయితే భవిష్యత్ తమదేనని బీఆర్ఎస్ పని అయిపోయిందని అనుకుటున్న బీజేపీ మాత్రం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటంలో పెద్దగా కనిపించడం లేదు. 


బీజేపీ నేతలు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు ?


కాంగ్రెస్ ప్రభుత్వంపై రకరకాల కారణాలతో బీఆర్ఎస్ విరుచుకుపడుతోంది.  ఆరు గ్యారంటీల అమలు దగ్గర నుంచి రుణమాఫీ వరకూ... శాంతి భద్రతల నుంచి పెట్టుబడుల వరకూ  ప్రతి విషయంలోనూ సందు దొరికితే ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. కానీ తామే ప్రధాన ప్రతిపక్షమని..దానికి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, సీట్లే సాక్ష్యమని వాదిస్తున్న బీజేపీ నేతలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఎప్పుడో ఓ సారి ప్రెస్ మీట్ పెడతారు. ఆ ప్రెస్ మీట్ పెట్టారన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు.  రోడ్డు ఎక్కి పోరాడిన సందర్భాలు కూడా లేవు. ఉన్నా... ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలా పోరాటాల విషయంలో  బీజేపీ వెనుకబడిపోవడం ఆ పార్టీ క్యాడర్ కూడా ఆశ్చర్యపోతోంది. 


వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఏపీ మంత్రి కీలక ప్రకటన


వ్యూహమా ?  అంతర్గత పోరాటమా ?


అయితే బీజేపీ ఏం చేసినా దానికో వ్యూహం ఉంటుందని ఆ  పార్టీ కార్యకర్తలు గట్టిగా నమ్ముతున్నారు.  ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని బీఆర్ఎస్ గురించి  అంటున్నారు. అయితే బీజేపీలో అంతర్గత పోరాటాల వల్ల.. పార్టీ ముఖ్య నేతల మధ్య సఖ్యత లేకపోవడం వల్లనే పార్టీ నిస్తేజంగా మారిందని అనే వారు ఎక్కువగా ఉన్నారు.  కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. వీకెండ్స్ లో తప్ప పార్టీ కార్యక్రమాలను పట్టించుకునే పరిస్థితుల్లో లేరు.   ఈటల రాజేందర్ చొరవ తీసుకుని బాధ్యత తీసుకుంటే చాలా మంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. స్వయంగా బీఎల్ సంతోష్ వచ్చి పరస్థితుల్ని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. ఎంత వరకూ చక్కబెట్టారో ఎవరికీ తెలియదు.  కానీ.. ఈ పోరాటం వల్ల మాత్రమే .. పార్టీ కార్యక్రమాలు ముందుకు సాగడం లేదని ఎక్కువ మంది నమ్ముతున్నారు. 


ఏపీలో మరో 3 విమానాశ్రయాలు, 4 కొత్త పోర్టులు, మళ్లీ నెంబర్ 1 అవ్వాలి - సీఎం చంద్రబాబు


బీఆర్ఎస్‌తో విలీనం, పొత్తు పుకార్లతో మరింత గందరగోళం


మరో వైపు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం లేదా, పొత్తులు ఖాయమన్న ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. అందులో ఎంత నిజముందో ఆ రెండు  పార్టీల ముఖ్య నేతలకే తెలియాలి. కానీ  ఆ ప్రచారం మాత్రం గట్టిగా సాగాలని వారు కోరుకుంటున్నారు. అందుకే  విలీనం, పొత్తుల వార్తల్ని ఖండించడం లేదు. అసలు  స్పందించడం లేదు.  ఇలా ప్రచారం జరగడంతో బీజేపీ క్యాడర్ లో గందరగోళం ఏర్పడుతోంది. అలాంటి పరిస్థితే వస్తే..  ఎవరు ఎవరి మీద స్వారీ చేస్తారోనని కంగారు పడుతున్నారు.  బీఆర్ఎస్ తో ఇలాంటి సమయంలో ఎలాంటి సంబంధాలు పెట్టుకున్నా అది బీజేపీకి నష్టం చేస్తుంది కానీ.. లాభం చేసే అవకాశం లేదని వాదిస్తున్నారు. అయితే కింది స్థాయి  క్యాడర్ మాటలు వినేవారు ఇప్పుడు ఎవరూ బీజేపీ లో లేరు.