క్రమశిక్షణ ముందు పుట్టి ఆ తర్వాత తమ పార్టీ  పుట్టిందని బీజేపీ నేతలు తమ పార్టీ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయినట్లుగా ఉన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తమ పార్టీ కూడా ఇతర పార్టీల్లాంటిదేనని నిరూపిస్తున్నారు. తాజాగా బండి సంజయ్, రఘునందన్ రావు మధ్య విభేదాలు బయటపడ్డాయి.  


కలిసికట్టుగా గవర్నర్ వద్దకు టీకాంగ్రెస్ నేతలు - వడ్ల కొనుగోలులో ఇద్దరివీ డ్రామాలే: కోమటిరెడ్డి


గురువారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజాసంగ్రామ యాత్ర రెండో విడత పాదయాత్రను బండి సంజయ్ ప్రారంభించనున్నారు. ఆ కార్యక్రమానికి తాను వెళ్లేది లేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రకటించారు.    బండి సంజయ్ తనను ఆహ్వానించలేదని పిలవకుండా వెళ్లి అవమానపడదల్చుకోలేదని ఆయన అంటున్నారు. మొదటి విడత పాదయాత్ర మెదక్ జిల్లాలో సాగిన తనకు సమాచారం ఇవ్వలేదని రఘునందన్ అంటున్నారు.  ఆయన బీజేపీఎల్పీ భేటీకి హాజరు కావడం లేదు.  ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరి ఫ్లోర్ లీడర్, మరొకరికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్..మరొకరికి విప్ పదవి ఇవ్వాలంటున్నారు. కానీ తెలంగాణ బీజేపీ అధ్యక్షిడిగా బండి సంజయ్ నిర్ణయం తీసుకోలేదు.  దీంతో ఆయన తీరుపై రఘునందన్ అసంతృప్తిగా ఉన్నారు. 


వరి రైతులకు సీఎం కేసీఆర్‌ గుడ్ న్యూస్ - రాష్ట్ర ప్రభుత్వం తరఫున వడ్లు కొనుగోలు


బండి సంజయ్ కూడా ఓ పార్టీ సమావేశంలో ఎవరి పేరునూ ప్రస్తావించకుండా టిక్కెట్ల అంశంపై విమర్శలు చేశారు. బీజేపీ టిక్కెట్లు ఇప్పిస్తామని కొందరు నేతలు హామీలు ఇస్తున్నారని..  టిక్కెట్ల గురించి ప్రచారం చేసే వాళ్లకి టిక్కెట్లు ఇవ్వరని బండి సంజయ్ నేరుగా పార్టీ సమావేశాల్లోనే హెచ్చరించారు.  తన టిక్కెట్‌కే గ్యారంటీ లేదని ఇక ఇతరులకు టిక్కెట్లు ఎలా వస్తాయని ఆయన చెబుతున్నారు. యూపీలో ఇలా ప్రచారం చేసిన వరారికే టిక్కెట్ రాలేదన్నారు.  బండి సంజయ్ ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు అన్నారో స్పష్టత లేదు. అయితే ఆయన వ్యాఖ్యలు కూడా ఓ ఎమ్మెల్యేని ఉద్దేశించే అని చెబుతున్నారు .


కొద్ది రోజుల కిందట బండి సంజయ్‌ తమకు ప్రాధాన్యం ఇవ్వలేదంటూ కొంత మంది సీనియర్ నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ విషయం కలకలం రేపింది. అయితే అప్పటికి పార్టీ నాయకత్వం సర్దుబాటు చేసింది.  తాము ఎవరిపైనా వ్యతిరేకతతో సమావేశం కాలేదని ప్రకటించారు. తాజా పరిణామాలతో బీజేపీలోనూ లుకలుకలు బయటపడుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.