GHMC Elections Political Strategy: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  పరిధిలో  ఇల్లు  అనేది దశాబ్దాలుగా అత్యంత ఉద్వేగభరితమైన, ఓట్లను శాసించే ప్రాథమిక రాజకీయ అంశం. దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను ఈ ఇల్లు అనే తాయిలంతో ఆకట్టుకుని లబ్దిపొందాయి. కానీ ఆ తాయిలాలు నిజంగా ఎంత మందికి అందాయో ఎవరికీ తెలియదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. ఈ పరిణామం రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ముంగిట  రాజకీయ చర్చకు తెరలేపింది. గ్రేటర్‌లో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఈ  హౌసింగ్ కార్డు ను బయటకు తీసిందా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

Continues below advertisement

 కేసీఆర్ 2BHK అప్పట్లో విజయవంతమైన రాజకీయ వ్యూహం 

గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఉచితంగా డబుల్ బెడ్‌రూమ్  ఇళ్లు ఇస్తామంటూ విస్తృతమైన ప్రచారం నిర్వహించారు. లక్షలాది దరఖాస్తులను స్వీకరించి, సర్వేల పేరుతో నగరంలో సుదీర్ఘకాలం హడావుడి చేశారు. ఆచరణలో ఇళ్ల నిర్మాణం తీవ్రంగా ఆలస్యమైనప్పటికీ,  మాకూ ఇల్లు వస్తుంది  అనే ఆశను పేద, మధ్యతరగతి ప్రజల్లో నిలపడంలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఫలితంగా వరుసగా రెండు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఈ అంశం భారీగా ఓట్లను, స్థానాలను తెచ్చిపెట్టింది. నిరంతరం దరఖాస్తులు స్వీకరించడం ద్వారా లబ్ధిదారులను తమ వైపు తిప్పుకోవడం ఒక రాజకీయ వ్యూహంగా ఉపయోగపడింది.

Continues below advertisement

 కాంగ్రెస్  ఇందిరమ్మ  ప్లాన్ 

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సరిగ్గా అదే బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్, సవాలు విసురుతున్న బీజేపీల ఓటు బ్యాంకును దెబ్బతీయాలంటే నగరంలో సొంతిల్లు లేని లక్షలాది మంది నిరుపేదలను ఆకట్టుకోవడం కాంగ్రెస్‌కు అత్యంత అవసరం. రూ.5 లక్షల ప్రభుత్వ సబ్సిడీతో 528 చదరపు అడుగుల వైశాల్యంలో ఫ్లాట్లు కట్టిస్తామని, దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టడం వెనుక వ్యూహాత్మక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది స్పష్టం. ఎన్నికల ముంగిట లబ్ధిదారుల ఎంపిక, లాటరీ లేదా సర్వేల పేరుతో వాతావరణాన్ని కాంగ్రెస్ వైపు తిప్పుకోవడమే ఈ దరఖాస్తుల ప్రక్రియ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

 కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పరిస్థితి ఏంటి? 

ఇక్కడ ప్రధానంగా ఉద్భవిస్తున్న ప్రశ్న.. బీఆర్ఎస్ హయాంలో కొల్లూరు, రాంపల్లి, జవాహర్‌నగర్ వంటి శివారు ప్రాంతాల్లో నిర్మించి ఇంకా పంపిణీకి నోచుకోని వేలాది డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పరిస్థితి ఏమిటనేది! గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను పంపిణీ చేస్తే ఆ క్రెడిట్ బీఆర్ఎస్‌కు వెళ్తుందనే రాజకీయ సంకోచం సహజంగానే అధికార పార్టీలకు ఉంటుంది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పాత ఇళ్లను పూర్తి చేసి త్వరితగతిన అర్హులకు అందిస్తుందా లేక వాటిని పక్కన పెట్టి కేవలం కొత్త ఇందిరమ్మ ఇళ్ల ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తుందా అనే దానిపై నగర ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. పాత ఇళ్లను పంపిణీ చేస్తే పొందే పొలిటికల్ మైలేజ్ కంటే, కొత్తగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల ఆశ చూపి పొందే మైలేజ్ ఎక్కువని భావిస్తే పాత ఇళ్ల పంపిణీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

 ఉచితం  vs  లబ్ధిదారుడి వాటా 

కేసీఆర్ హయాంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పూర్తి ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. కానీ కాంగ్రెస్ తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌లో లబ్ధిదారుడు రూ.6 లక్షలు చెల్లించాల్సి ఉంది . పట్టణ పేదలకు రూ.6 లక్షలు సేకరించడం, బ్యాంక్ రుణాలు పొందడం ఎంతవరకు సాధ్యమనే ఆర్థిక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేవలం రూ.100 దరఖాస్తు రుసుము, రూ.10,000 ముందస్తు డిపాజిట్ చెల్లించి దరఖాస్తు చేసుకున్నప్పటికీ, తుది కేటాయింపు సమయానికి ఆర్థిక భారంతో అసలైన లబ్ధిదారులు వెనక్కి తగ్గే ప్రమాదం కూడా ఉంది. గతంతో పోలిస్తే గ్రేటర్ ఓటర్ల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. కేవలం దరఖాస్తు ఫారాలు నింపినంత మాత్రాన ఓట్లు వేసే పరిస్థితి ఇప్పుడు లేదు. బీఆర్ఎస్ హయాంలో దరఖాస్తులు ఇచ్చి ఏళ్లు గడిచినా ఇళ్లు రాలేదన్న అసంతృప్తి ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం దరఖాస్తులకే పరిమితమైతే  అప్లికేషన్ నిరాశ  పెరిగి రివర్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.  

సొంతింటి కలను రాజకీయ అస్త్రంగా మార్చుకోవడం తెలంగాణ రాజకీయాల్లో కొత్తేమీ కాదు. అయితే కేసీఆర్ ఫార్ములాను కాంగ్రెస్ యథాతథంగా అమలు చేయాలనుకుంటే దానికి ఉన్న పరిమితులను గమనించాలి. దరఖాస్తుల ద్వారా రాజకీయ వాతావరణాన్ని సృష్టించడం మొదటి అడుగు మాత్రమే కాగా, క్షేత్రస్థాయిలో తాళాలు చేతికి ఇచ్చినప్పుడే ఓట్లుగా మారతాయి. రాబోయే గ్రేటర్ పోరులో కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్ల హామీలను ఎంత వేగంగా ఆచరణలోకి తెస్తుందనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.