YSRCP MLCs Retirement AP: ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం శాసనమండలి నామినేటెడ్ స్థానాల చుట్టూ తిరుగుతోంది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవుల కోసం తెలుగుదేశం పార్టీలో దాదాపు ఇరవై మందికి పైగా సీనియర్ నేతలు తీవ్రంగా పోటీ పడుతుండటం అమరావతి వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే, ప్రస్తుతం ఖాళీ అయిన రెండు స్థానాల కోసమే క్యూలో నిలబడి అసంతృప్తికి లోనుకావాల్సిన అవసరం లేదని, కాస్త ఓపిక పడితే ఆశావహులందరికీ పదవులు దక్కడం ఖాయమని సమగ్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. శాసనసభలో కూటమికి ఉన్న తిరుగులేని 164 స్థానాల బలం ఆధారంగా రాబోయే మూడేళ్లలో మండలి మాత్రమే కాకుండా పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభ సీట్లు కూడా ఏకపక్షంగా కూటమి ఖాతాలోనే పడనున్నాయి.
మూడేళ్లలో 30కి పైగా ఖాళీలు.. క్లీన్ స్వీప్నకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోని మొత్తం 58 స్థానాలు ఉన్నాయి. 2026 నుంచి మార్చి 2029 నాటికి సుమారు 30కి పైగా సభ్యుల పదవీ కాలం ముగియనుంది. ఇందులో ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటా, గవర్నర్ నామినేటెడ్, ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలు ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఖాతాలో పడిన స్థానాలన్నీ వరుసగా ఖాళీ అవుతూ వస్తున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షానికి కనీస బలం కూడా లేకపోవడంతో, త్వరలో ఖాళీ కాబోయే ప్రతి ఒక్క సీటూ పోటీయే లేకుండా ఏకగ్రీవంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఖాతాలోనే పడనున్నాయి.
గవర్నర్, ఎమ్మెల్యే కోటాల్లో రాబోయే పెను మార్పులు
ముఖ్యంగా 2026 నుంచి 2027 చివరి నాటికి గవర్నర్ నామినేటెడ్ కోటాలో 6 సీట్లు, ఎమ్మెల్యే కోటాలో దాదాపు 7 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీనికి తోడు స్థానిక సంస్థల కోటాలో కూడా 10 స్థానాల గడువు ముగియనుంది. అప్పటికి స్థానిక ఎన్నికలు అయిపోతాయి. సహజంగానే అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అసెంబ్లీలో కూటమికి ఉన్న సంపూర్ణ ఆధిక్యంతో ఎమ్మెల్యే కోటాలోని స్థానాలన్నీ కూటమికే దక్కుతాయి. మెజారిటీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూటమి వైపు మొగ్గు చూపడం లేదా ఖాళీలు ఏర్పడటంతో ఆయా జిల్లాల్లో కూటమి అభ్యర్థుల విజయం సునాయాసంగా మారనుంది.
2029 నాటికి తిరుగులేని ఆధిపత్యం
2029 మార్చి నాటికి ఎమ్మెల్యే కోటాలో మరో 7 స్థానాలు ఖాళీ కానుండటంతో పాటు, పట్టభద్రుల. ఉపాధ్యాయుల స్థానాల గడువు కూడా పూర్తికానుంది. పట్టభద్రుల స్థానాల్లో ఇప్పటికే కూటమికి విపరీతమైన ఆమోదయోగ్యత ఉందని గత ఫలితాలు నిరూపించాయి. దీనివల్ల నాటి ఎన్నికల నాటికి శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ ప్రాతినిధ్యం దాదాపు శూన్యానికి చేరుకుని, మండలిలో ఎన్డీయే కూటమికి తిరుగులేని సంపూర్ణ మెజార్టీ లభిస్తుంది. కేవలం శాసనమండలి మాత్రమే కాదు, ఢిల్లీలోని రాజ్యసభ సీట్ల సమీకరణలు కూడా కూటమికి అత్యంత సానుకూలంగా మారాయి. ఎంపీల పదవీకాల ముగింపు క్రమంలో 2028లో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలు నూరు శాతం కూటమి ఖాతాలోనే పడనున్నాయి. కేంద్రంలోనూ ఎన్డీయే భాగస్వామిగా ఉన్న టీడీపీ-జనసేనలకు ఈ రాజ్యసభ స్థానాలు దక్కడం వల్ల జాతీయ రాజకీయాల్లోనూ కూటమి నేతల ప్రాధాన్యత, ప్రాతినిధ్యం మరింత పెరగనుంది.
ఈ పరిణామాలన్నింటినీ విశ్లేషిస్తే, ప్రస్తుతం గవర్నర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీ పదవుల కోసం టీడీపీ అగ్రనేతలపై ఒత్తిడి తేవడం లేదా నిరాశకు గురికావడం సమంజసం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మూడేళ్ల వ్యవధిలో దాదాపు 30కి పైగా ఎమ్మెల్సీ స్థానాలు, 4 రాజ్యసభ స్థానాలు అందుబాటులోకి రానున్నందున.. పార్టీ కోసం పనిచేసిన సీనియర్లు, సామాజిక సమీకరణల్లో వెనుకబడిన నాయకులు, ఎన్నికల్లో త్యాగాలు చేసిన అభ్యర్థులకు విడతల వారీగా పదవులు అప్పగించేందుకు చంద్రబాబు వద్ద స్పష్టమైన రోడ్మ్యాప్ ఉందని చెబుతున్నారు. పార్టీ శ్రేణులు ఓపిక పడితే ప్రతి అర్హులైన నాయకుడికీ తగిన గుర్తింపు లభించడం ఖాయమని అంటున్నారు.
