Chintakayala Vijay : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై రూ. యాభై లక్షల పరువు నష్టం దావాను తెలుగుదేశం పార్టీ నేత చింతకాయల విజయ్ దాఖలు చేశారు. గోరంట్ల మాధవ్‌కు చెందినట్లుగా భావిస్తున్న న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టిన ఎంపీ.. అది మార్ఫింగ్ అన్నారు. ఈ వీడియోను మార్ఫింగ్ చేసింది.. సర్క్యూలేట్ చేస్తోంది చింతకాయల విజయ్ అని ఆరోపించారు. తనకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా తనపై ఆరోపణలు చేయడంపై చింతకాయల విజయ్ మండిపడ్డారు.  పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు. ఆ ప్రకారం ఒక్క రోజులోనే పరువు నష్టం దావా వేశారు. 


దిక్కుమాలిన పని చేసి తనపై ఆరోపణలు చేస్తారా అని విజయ్ ప్రశ్న


తనతో పాటు మరో ఇద్దరు టీడీపీ నేతలపై ఎంపీ గోరంట్ల చేసిన విమర్శలపై ఇప్పటికే చింతకాల విజయ్ తన స్పందన తెలిపారు.  ఎంపీ దిక్కుమాలిన పని చేసి తమపై నిందలేయడం సిగ్గు చేటన్నారు. అసలు ఆ వీడియోకు, తనకు ఏం సంబంధమో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో ఏపీ పరువు తీశారని.. 25మంది ఎంపీలను గెలిపిస్తే.. ప్రత్యేక హోదా తీసుకొస్తానని వారి నాయకుడు అంటే.. జనం నమ్మి సీట్లిస్తే.. ఇదా ప్రత్యేక హోదా అటూ ధ్వజమెత్తారు. రాష్ట్రానికి సంబంధించి ఎన్నో సమస్యలుంటే.. కనీసం పోరాటం చేయకుండా.. దిక్కుమాలిన పనులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్


తన తండ్రి అయ్యన్నపాత్రుడ్ని ఇబ్బంది పెట్టాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించి విఫలమయ్యారని.. ఇప్పుడు తనపై చేస్తూ రోడ్డుపైకి లాగాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ తన పేరు చెప్పినందుకు పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు. పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తానన్నారు విజయ్. పార్లమెంటులో రాష్ట్ర సమస్యలు ప్రస్తావించి, ప్రజలకు మేలు చేయడం కోసం ఎన్నుకుంటే.. ఆయన ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. 


ప్రివిలేజ్ కమిటీకి కూడా లేఖ రాస్తా 


మూడేళ్లుగా ఏపీ సమస్యలపై అలుపెరుగకుండా పోరాటం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. పార్లమెంటులో రాష్ట్రం కోసం పోరాటం చేయడకుండా.. ఇలాంటి పనులు చేస్తారా అంటూ సెటైర్లు పేల్చారు. మాధవ్ ఎవరో కూడా ఎవరికీ తెలియదని.. అలాంటి ఆయన వీడియోను మార్ఫింగ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఒక వేళ అలా చేయాలనుకున్నా.. అందుకోసం చేసిన ఖర్చు కూడా వృథా అంటూ ఎద్దేవా చేశారు. తాము చట్టపరంగా పోరాటం చేస్తామని.. కేంద్ర ఫోరెన్సిక్ ద్వారా విచారణ జరపాల్సిందిగా పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి లేఖ రాస్తానన్నారు విజయ్. తాను లీగల్ నోటీసులు పంపించానని.. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ప్రూవ్ చేసుకోవాలని సవాల్ విసిరారు.