" ఏడాది, రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లబోతున్నాం" అని సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించిన అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పలు రకాలుగా చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలయినా పార్లమెంట్ ఎన్నికలయినా రెండేళ్ల తర్వాతే ఉన్నాయి. మరి ఏడాదిలో అని ఎందుకన్నారనేదే ఆ చర్చకు కారణం. ముందస్తు ఎన్నికలకు వెళ్తారని విస్తృతమైన చర్చ జరుగుతున్న సమయంలో వైఎస్ఆర్‌సీపీ రాజకీయ నిర్ణయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించే సజ్జల నోటి వెంట ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఆసక్తికరంగా మారింది 


ముందస్తుకు వెళ్లబోతున్నామని సజ్జల హింటిచ్చారా ? 
 
ముందస్తుకు వెళ్లడానికి మాకేమైనా పిచ్చా 2024లోనే ఎన్నికలు జరుగుతాయి అని ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి రెండు నెలల క్రితం వ్యాఖ్యానించారు. రెండు నెలల్లోనే ఆయన మాట తీరు మారిపోయింది.  ఇటీవలి కాలంలో సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ముందస్తుకు ప్రిపరేషనేనని వైఎస్ఆర్‌సీపీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా నమ్ముతున్నాయి.  ఇప్పటికే సర్వేలు.. ఇతర మార్గాల ద్వారా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. మంత్రులను మార్చారు. పార్టీ యంత్రాంగాన్ని పదవులతో సిద్ధం చేశారు. ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.   రెండు, మూడు నెలల్లోనే అందరూ నియోజకవర్గాలను చుట్టేయాలని సీఎం ఆదేశించారు. రెండేళ్ల తర్వాత ఎన్నికలు ఉంటే ఇలా ముందే సన్నద్ధం కావాల్సిన అవసరం ఏముందని కొంత మంది డౌట్. 


లోక్‌సభతో పాటు అసెంబ్లీకి వద్దనుకుంటున్నారా ? 


తెలంగాణకు అసెంబ్లీకి 2023 చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు రెండూ కలసి వస్తే జాతీయ అంశాలు హైలెట్ అవుతాయని దాని వల్ల ఓటింగ్ ప్రయారిటీ మారిపోతుందని .. అది ప్రాంతీయ పార్టీలకు నష్టం చేస్తుందన్న అంచనా ఉంది. కేసీఆర్ ఈ కారణంతోనే ముందస్తుకు వెళ్లి విజయం సాధించారు. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. అప్పట్లోనే ముందస్తుకు వెళ్లిన కేసీఆర్ విజయవంతం కాగా.. పార్లమెంట్‌తో పాటే ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు ఘోర పరాజయం పాలయ్యారు. ఈ అనుభవాలతో పార్లమెంట్ ఎన్నికలతో సంబంధం లేకుండా విడిగా ఎన్నికలకు వెళ్లడం బెటరన్న ఆలోచనలో వైఎస్ఆర్‌సీపీ వ్యూహకర్తలు ఉన్నట్లుగా భావిస్తున్నారు. 


విపక్షాలు కూడా రెడీ అయినట్లేనా !?


ముందస్తు ఎన్నికలు వస్తాయని విపక్షాలు కూడా గట్టిగా నమ్ముతున్నాయి. అందుకే అవి కూడా రాజకీయ కార్యకలాపాల్లో వేగం పెంచాయి. చంద్రబాబు జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. పవన్ కల్యాణ్ రైతు  భరోసా యాత్ర చేస్తున్నారు. టీడీపీ నేతలు నియోజకవర్గాల్లో జోరుగా పార్టీ కా‌ర్యక్రమాలు చేపడుతున్నారు. చివరికి పొత్తుల చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. అంటే అటుఅధికార పార్టీతో పాటు ఇక విపక్షాలు కూడా ముందస్తుకు సిద్ధమయ్యాయని అంచనాకు వస్తున్నారు. ఈ ముందస్తు ఎప్పుడనేదే తేలాల్సి ఉందనేది ఎక్కువ మంది నమ్మకం.