SIR Voter Revision 2026:    తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ  రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. దశాబ్ద కాలంగా పేరుకుపోయిన నకిలీ ఓట్లు, డబుల్ ఓట్లు, నివాసాలు మారిన వారి వివరాలు,   మరణించిన వారి పేర్లను తొలగించి ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా ఈ భారీ ఎన్యూమరేషన్ డ్రైవ్‌ను నిర్వహించారు. బూత్ లెవల్ అధికారులు   ఇంటింటికీ తిరిగి నిర్వహించిన సర్వేలో బయటపడిన గణాంకాలు, ముసాయిదా జాబితా ఆధారంగా రెండు రాష్ట్రాల్లోనూ ఏకంగా కోటి పది లక్షలకు పైగా ఓట్లు ప్రతిపాదిత్ తొలగింపు  జాబితాలోకి చేరడం తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది.

Continues below advertisement

 తెలంగాణలో  73.47 లక్షల ఓట్లు అన్‌కలెక్టబుల్ 

తెలంగాణలోని 3.38 కోట్ల మంది   ఓటర్ల జాబితా  ఆధారంగా సాగిన ఈ ప్రక్రియలో అత్యంత విస్మయపరిచే విషయాలు వెలుగుచూశాయి. ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి లభించని  అన్‌కలెక్టబుల్  వర్గం కింద ఏకంగా 73,47,053 ఓట్లు మొత్తం ఓటర్లలో 21.72%  నమోదయ్యాయి.   శాశ్వతంగా నివాసాలు మారిన వారు   45,21,608 మంది  ఉన్నారు.  మొత్తం ఓటర్లలో 13.37% - అన్‌కలెక్టబుల్ జాబితాలో ఏకంగా 61.5% వీరే ఉన్నారు. చిరునామా లభించనివారు 11,30,166 మంది , మరణించిన ఓటర్లు  9,22,074 మంది ఉన్నారు.  డబుల్ , ఇతర చోట్ల నమోదైన ఓట్లు  6,69,649 మంది ఉన్నారు.  ఈ ప్రక్రియతో తెలంగాణ ముసాయిదా ఓటర్ల సంఖ్య 3.38 కోట్ల నుంచి ఒక్కసారిగా 2.65 కోట్లకు పడిపోనుంది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్‌లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 41.12%, మేడ్చల్-మల్కాజిగిరిలో 36.04%, రంగారెడ్డి జిల్లాలో 34.78% ఓట్లు అన్‌కలెక్టబుల్ కేటగిరీలోకి రావడం కీలకంగా మారింది. 

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్‌లో 44.71 లక్షల ఓట్ల ప్రక్షాళన 

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన SIR ఎన్యూమరేషన్ తనిఖీల్లో దాదాపు 44,71,523 ఓట్లను తొలగింపునకు అర్హమైనవిగా ఈసీ గుర్తించి రద్దు జాబితాలో చేర్చింది. ఏపీలో గతంలో జరిగిన స్థానిక సంస్థల, సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల అక్రమాలు జరిగాయని ప్రధాన రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఇంత భారీగా ఓట్ల తొలగింపు చేపట్టడం ఆసక్తికరంగా మారింది.  ఇందులో ప్రధానంగా నివాసాలు మారినా రికార్డుల్లో కొనసాగుతున్న వారు, సరైన లింకేజీ లేదా మ్యాపింగ్ లేని వారు , నకిలీ ప్రాతిపదికన ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఉన్న డబుల్ ఓట్లు,   మరణించిన వారి స్థానాల్లో చెల్లుబాటులో ఉన్న ఓట్లను అధికారులు గుర్తించి తొలగింపు చర్యలు చేపట్టారు.

 నో మ్యాపింగ్ చిక్కులు 

రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున ఓటర్లకు ఎదురైన మరో పెద్ద సవాలు  నో మ్యాపింగ్ . 2002 నాటి SIR రికార్డులతో ప్రస్తుతం సమర్పించిన వివరాలు సరిపోలకపోవడం లేదా మునుపటి ఓటరు ఐడీ వివరాలు ఆన్‌లైన్‌లో లభించకపోవడాన్ని  నో మ్యాపింగ్ గా గుర్తించారు. తెలంగాణలో సుమారు 30% మంది ఓటర్లు  ఈసీ ఆంక్షల పరిధిలోకి , ఈఆర్‌ఓల  నోటీసుల పరిధిలోకి వచ్చారు. ఆధార్ లేదా రేషన్ కార్డులను పౌరసత్వ నిరూపణ పత్రాలుగా పరిగణించకపోవడం, ఇతర 11 గుర్తింపు పత్రాలనే అడగడం అర్బన్ , గ్రామీణ ఓటర్లకు కొంత ఇబ్బందికరంగా మారింది.

 ఓట్ బ్యాంక్ రాజకీయాలపై ప్రభావం 

ఈ స్థాయి ప్రక్షాళన రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల మరియు సార్వత్రిక ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ వంటి నగరాల్లో  వలస ఓటర్లు,  ఐటీ వర్కింగ్ క్లాస్ ఓట్లు పెద్ద ఎత్తున డిలీట్ కావడం క్షేత్రస్థాయి సమీకరణాలను మార్చివేస్తుంది. నివాసాలు మారి రెండు ప్రాంతాల్లోనూ ఓటు హక్కు పొందుతున్న వారి సంఖ్య తగ్గడం వల్ల  బోగస్ ఓటింగ్ కు గండి పడుతుందని అంచనా వేస్తున్నప్పటికీ, నిజమైన ఓటర్ల పేర్లు పొరపాటున తొలగించబడితే అది అధికార, ప్రతిపక్ష పార్టీలకు రాజకీయంగా మింగుడుపడని అంశంగా మారవచ్చు.

 తదుపరి అవకాశం - క్లెయిమ్స్, అభ్యంతరాల గడువు 

ఓటర్ల జాబితా నుంచి పెద్ద ఎత్తున పేర్లు తొలిగిపోయినప్పటికీ, ఇది పూర్తిస్థాయి ముగింపు కాదని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించిన అనంతరం, నిజమైన ఓటర్లు ఎవరైనా తొలగింపునకు గురైతే వారు ఫారమ్-6 సమర్పించి తమ ఓటును తిరిగి పొందే అవకాశాన్ని కల్పించారు. ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ జాబితాలో  ఉన్నవారు సంబంధిత ఈఆర్‌ఓలకు అవసరమైన ఆధారాలు చూపి ఓటును పునరుద్ధరించుకోవచ్చు. కాబట్టి ఓటర్లందరూ తమ ఓటు భద్రతను స్వయంగా తనిఖీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు.