89 lakh Voter Records Flagged In Telangana Pre SIR Exercise:  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా ఓటింగ్ శాతం 50 శాతానికి మించకపోవడం దశాబ్దాలుగా కనిపిస్తున్న అతిపెద్ద సమస్య. నగరవాసుల ఉదాసీనత, ఐటీ కల్చర్ ఒక కారణమైతే.. జాబితాలో పేరుకుపోయిన డబుల్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు, ఇళ్లు మారిన వారి రికార్డులు కూడా ఇందుకు ప్రధాన కారణాలు. అయితే, ఈ ఓటర్ల జాబితాను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్   ప్రక్రియ ఇప్పుడు తెలంగాణలో తీవ్ర సంచలనంగా మారింది. ముఖ్యంగా ప్రి-సిర్  మ్యాపింగ్ ప్రక్రియలోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు  89 లక్షల ఓటర్ల రికార్డులలో లోపాలు ఉన్నట్లు  గుర్తించి ఫ్లాగ్  చేయడం   ప్రకంపనలు సృష్టిస్తోంది.

Continues below advertisement

 అసలు ఏమిటీ ‘SIR’ ప్రక్రియ? 

ఈ ‘సిర్’   ప్రక్రియ అనేది సాధారణంగా ప్రతి ఏటా జరిగే ఓటర్ల జాబితా సవరణ లాంటిది కాదు. దాదాపు 24 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత, 2002 నాటి పాత ఓటర్ల జాబితాను ప్రస్తుత ఓటర్ల డేటాతో లింక్ చేస్తూ నిర్వహిస్తున్న అత్యంత లోతైన క్షేత్రస్థాయి సర్వే ఇది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు   ప్రతి ఇంటికి స్వయంగా వచ్చి ఓటర్ల వివరాలను సరిచూస్తారు. ఓటరు జాబితాలోని అక్రమాలను తొలగించి పారదర్శకత తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశమని ఎన్నికల సంఘం చెప్తున్నప్పటికీ, నగరవాసుల్లో మాత్రం  ఓట్లు ఎగిరిపోతాయేమో  అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Continues below advertisement

 హైదరాబాద్‌లో సగం ఓట్లు తగ్గిపోతాయా? 

గ్రేటర్ పరిధిలో సగం ఓట్లు తగ్గిపోతాయనే ప్రచారానికి ప్రధాన కారణం హైదరాబాద్ జిల్లాలో ఇప్పటివరకు జరిగిన ప్రి-సిర్ మ్యాపింగ్ గణాంకాలే. హైదరాబాద్ జిల్లాలోని మొత్తం 47.36 లక్షల మంది ఓటర్లలో.. కేవలం 22.09 లక్షల ఓట్లు అంటే  46.65%  మంది మాత్రమే 2002 నాటి ఓటర్ల జాబితాతో మ్యాచ్ అయ్యారు. మిగిలిన  25.27 లక్షల మంది ఓటర్ల డేటా పాత రికార్డులతో సరిపోలలేదు  . అంటే సాంకేతికంగా చూస్తే నగరంలో సగానికి పైగా ఓటర్ల రికార్డులలో ఏదో ఒక లోపం ఉన్నట్లు తేలింది. అయితే, దీని అర్థం ఆ 25 లక్షల ఓట్లు వెంటనే తొలగిపోతాయని కాదు, వారి వివరాలను ఇంటింటికి వచ్చి భౌతికంగా ధృవీకరించుకోవాల్సి ఉంటుంది.

 పాతబస్తీ ఓటర్ల ఆందోళన.. ఎందుకీ భయాలు? 

ఈ నూతన ప్రక్రియ హైదరాబాద్‌ పాతబస్తీ లో తీవ్ర ఉత్కంఠకు, భయాందోళనలకు దారితీస్తోంది. పాతబస్తీలో తరతరాలుగా ఒకే ప్రాంతంలో నివసిస్తూ, ఓటు హక్కు వినియోగించుకుంటున్న సామాన్య ప్రజలు సైతం తమ పత్రాల వెరిఫికేషన్ అనగానే ఆందోళనకు గురవుతున్నారు. 2002 నాటి ఓటరు జాబితాతో పేర్ల స్పెల్లింగ్‌లు మ్యాచ్ కాకపోవడం, తండ్రి లేదా భర్త పేర్లలో తప్పులు దొర్లడం, అడ్రస్ మారడం వంటి చిన్న చిన్న సాంకేతిక లోపాలు ఉన్నా సరే నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఈ నిబంధనల వల్ల నిజమైన భారతీయ పౌరులు, స్థానిక ఓటర్లు ఎక్కడ ఇబ్బంది పడతారోనని పలు రాజకీయ పార్టీలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

 ఫామ్ తిరిగి ఇవ్వకపోతే ఓటు రద్దు! 

హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఇచ్చిన తాజా హెచ్చరిక ఓటర్లలో మరింత టెన్షన్ పెంచింది. బీఎల్ఓలు ఇంటింటికి వచ్చి ఇచ్చే ముందస్తు సమాచారంతో కూడిన  ఎన్యుమరేషన్ ఫామ్‌ ను ఓటర్లు ఖచ్చితంగా పూర్తి చేసి లేదా సంతకం పెట్టి, ఫోటో జతచేసి తిరిగి అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇల్లు తాళం వేసి ఉన్నా, లేదా ఆ ఫామ్‌ను తిరిగి సమర్పించకపోయినా అలాంటి వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి శాశ్వతంగా తొలగిస్తామని స్పష్టం చేశారు. అద్దె ఇళ్లలో ఉంటూ తరచూ నివాసాలు మార్చే మధ్యతరగతి, ఉద్యోగ వర్గాల వారికి ఈ నిబంధన పెద్ద సవాలుగా మారనుంది.

 ఓటరు అలసత్వం వీడాలి! 

 హైదరాబాద్‌లో పోలింగ్ శాతం తక్కువగా ఉండటానికి  దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు ఒక శాపంగా మారాయి. ఒకే వ్యక్తికి సొంత గ్రామంలో , హైదరాబాద్‌లోని నివాసంలో రెండు ఓట్లు ఉండటం వల్ల నగరంలో ఓటింగ్ శాతం పడిపోతోంది. ఈ  SIR  ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగి, కేవలం అర్హులైన స్థానిక ఓటర్లు మాత్రమే జాబితాలో మిగిలితే, భవిష్యత్తులో గ్రేటర్ పరిధిలో ఓటింగ్ శాతం ఆటోమేటిక్‌గా 70 నుండి 80 శాతానికి పెరిగే అవకాశం ఉంది. కానీ, ఈ సుదీర్ఘ ప్రక్రియలో నిరక్షరాస్యులు, నిరుపేదలు , వృద్ధుల ఓట్లు సాంకేతిక కారణాలతో రద్దు కాకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల యంత్రాంగంపై ఉంది. అక్టోబర్ 1న ప్రచురితమయ్యే తుది జాబితా నాటికి హైదరాబాద్ ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.